దలాల్ స్ట్రీట్ బ్లడ్ బాత్: భారీగా పతనమైన సెన్సెక్స్: మార్కెట్ నష్టాలకు కారణాలెన్నో
ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం (ఫిబ్రవరి 26) భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ నేడు ఏకంగా 1,939 పాయింట్లు నష్టపోగా, నిఫ్ట 14,430 పాయింట్ల దిగువన ముగిసింది. క్రితం సెషన్లో 51,000కు పైగా ఉన్న సెన్సెక్స్ ఏకంగా 49,000 పాయింట్లకు పడిపోయింది. అన్ని రంగాలు కూడా భారీగా పతనం అయ్యాయి. దీంతో శుక్రవారం స్టాక్ మార్కెట్లు మరో బ్లాక్ ఫ్రైడేను చూశాయి. సూచీలు ఒకే రోజు మూడు శాతానికి పైగా నష్టపోయాయి. ఇంట్రాడేలో ఓ దశలోను సూచీలకు మద్దతు లభించలేదు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1510 పాయింట్లు, నిఫ్టీ 387 పాయింట్ల తేడాను నమోదు చేశాయి.
2000 పాయింట్లు పతనం
సెన్సెక్స్ ఉదయం 50,256 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 50,400 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 48,890 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. అంటే సెన్సెక్స్ ఓ సమయంలో 49,000 దిగువకు కూడా పతనమైంది. సెన్సెక్స్ నేడు 1,939 పాయింట్లు లేదా 3.80 శాతం నష్టపోయి 49,099.99 వద్ద ముగిసింది. సూచీ నేడు ఓ సమయంలో 2150 పాయింట్ల మేర పడిపోయింది. నిఫ్టీ 568 పాయింట్లు లేదా 3.76 శాతం నష్టపోయి 14,529.15 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 14,888.60 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,919.45 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,467.75 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.
టాప్ లూజర్స్
రిలయన్స్ స్టాక్ నేడు 3.02 శాతం క్షీణించి రూ.2,079 వద్ద, టీసీఎస్ షేర్ 3.05 శాతం తగ్గి రూ.2,903 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నేటి టాప్ లూజర్స్ జాబితాలో ONGC 6.76 శాతం, JSW స్టీల్ 6.24 శాతం, హీరో మోటో కార్ప్ 6.13 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 6.12 శాతం, కొటక్ మహీంద్రా బ్యాంకు 6.07 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్ భారతీ ఎయిర్ టెల్, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, టాటా మోటార్స్, ఎస్బీఐ ఉన్నాయి.
రంగాలవారీగా..
నిఫ్టీ 50 సూచీ 3.76 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 2.34 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఆటో 3.12 శాతం, నిఫ్టీ బ్యాంకు 4.78 శాతం, నిఫ్టీ ఎనర్జీ 2.91 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 4.93 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.69 శాతం, నిఫ్టీ ఐటీ 2.30 శాతం,నిఫ్టీ మీడియా 2.58 శాతం, నిఫ్టీ మెటల్ 2.70 శాతం, నిఫ్టీ ఫార్మా 1.76 శాతం, నిఫ్టీ పీఎస్యూ బ్యాంకు 3.97 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.84 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 4.67 శాతం నష్టపోయాయి. ఉదయం లాభాల్లో ఉన్న నిఫ్టీ ఫార్మా సాయంత్రానికి నష్టపోయింది.
మార్కెట్ పతనానికి కారణాలెన్నో
మార్కెట్ పతనానికి పలు కారణాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా బాండ్స్ ఈల్డ్ ఒక్కసారిగా పెరిగాయి. అమెరికా పదేళ్ల బాండ్ ఈల్డ్స్ ఏడాది గరిష్టాన్ని తాకాయి. కరోనా అనంతరం బాండ్స్ మార్కెట్లో ఈ స్థాయి అనిశ్చితి ఇదే తొలిసారి. అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, జపాన్, ఇండియాలోను బాండ్ ఈల్డ్స్ పెరిగాయి. ఏడేళ్ల బాండ్స్ వేలం వైఫల్యంతో తాజా గందరగోళానికి బీజం పడింది. వేలం వైఫల్యం ద్రవ్యోల్భణానికి సంకేతంగా ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. దీంతో బాండ్స్ విక్రయానికి సిద్ధమయ్యారు. కరోనా అనంతరం వేగంగా పుంజుకుంటున్న డిమాండ్ ద్రవ్యోల్భణానికి దారి తీసే ప్రమాదం ఉందనే అంచనాలు ఉన్నాయి. దీంతో కేంద్ర బ్యాంకులు ద్రవ్య విధానాలను తిరిగి కఠినతరం చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో బాండ్ మార్కెట్ అనిశ్చితితో ఉంది.
బాండ్ ఈల్డ్స్, ద్రవ్యోల్భణం ఆందోళనతో అమెరికా, ఆసియా మార్కెట్లు నష్టపోయాయి. ఈ ప్రభావం మన మార్కెట్లపై పడింది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కనిపించడం కూడా ఇన్వెస్టర్లను భయపెట్టింది. సిరియా భూభాగంలోని ఇరాన్కు చెందిన తీవ్రవాద స్థావరాలపై అమెరికా మెరుపుదాడులు చేసింది. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత అనుమానాలు ఉన్నాయి.