రూ.3 లక్షల కోట్లు దాటి... బజాజ్ ఫైనాన్స్ సరికొత్త శిఖరాలకు, షేర్ 5% జంప్
ముంబై: బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మంగళవారం (డిసెంబర్ 15) నాటికి 3 ట్రిలియన్ డాలర్ల రూపాయలు దాటింది. బీఎస్ఈలో ఈ సంస్థ స్టాక్ నేడు 5 శాతం లాభపడి రూ.5,137కు ఎగిసింది.త దీంతో సంస్థ మార్కెట్ క్యాప్ రూ.3.08 ట్రిలియన్లను అందుకుంది. బజాజ్ ఫైనాన్స్ స్టాక్ మధ్యాహ్నం గం.2.30 సమయానికి రూ.5,120 వద్ద ఉంది. మే 27వ తేదీన ఈ కంపెనీ స్టాక్ రూ.1,783 వద్ద ట్రేడ్ అయింది. నాటి నుండి ఇప్పటి వరకు 188 శాతం కంటే ఎక్కువగా ఎగిసింది. ఏడాదిలో ఈ స్టాక్ 21 శాతం వృద్ధిని నమోదు చేసింది.
అంబానీ, అదానీ, రాధాకిషన్... ఏడాదిలో వీరి సంపద రూ.4.7 లక్షల కోట్లు పెరిగింది
5 శాతం కంటే ఎక్కువ
బజాజ్ ఫైనాన్స్ స్టాక్ ధర నేడు 5 శాతం కంటే పైకి ఎగిసి రూ.5,150 వద్ద క్లోజ్ అయింది. ఎనిమిది నెలల కాలంలో రూ.1783 నుండి రూ.5,150 వద్దకు చేరుకుంది. దీంతో అత్యధిక మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన సంస్థల్లో మరో రికార్డును నమోదు చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.15.34 ట్రిలియన్లతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల మార్కెట్ క్యాప్ వరుసగా రూ.10.6 ట్రిలియన్లు, రూ.7.72 ట్రిలియన్లుగా ఉంది.
వేగంగా పెరిగిన కార్యకలాపాలు
భారత్లో లాక్ డౌన్ ఆంక్షలు సడలించిన అనంతరం వ్యాపార కార్యకలాపాలు సాధారణ స్థితికి వచ్చిన తర్వాత పెట్టుబడిదారులు బజాజ్ ఫైనాన్స్ షేర్లు పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం ప్రారంభించారు. కరోనా నుండి కంపెనీ వేగంగా కోలుకొని, నెల ప్రాతిపదికన మంచి వృద్ధిని నమోదు చేస్తున్నట్లు సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల సందర్భంగా తెలిపింది. రిటైల్ ఈఎంఐ, వ్యాలెట్ లోన్స్ మినహాయించి మిగతా కార్యకలాపాలను ప్రారంభించింది. ఇవి జనవరి - మార్చి 2021లో ప్రారంభం కానున్నాయి.
తగ్గిన నిరర్థక ఆస్తులు
కరోనా కారణంగా సెప్టెంబర్ త్రైమాసికంలో బజాజ్ ఫైనాన్స్ సంస్థ నిరర్థక ఆస్తులు క్వార్టర్ ప్రాతిపదికన 37 బేసిస్ పాయింట్లు క్షీణించి 1.03 శాతంగా నమోదయ్యాయి. రూ.470 కోట్ల రైటాఫ్, నెట్ రికవరీల కారణంగా ఇది సాధ్యమైంది. పండుగ సీజన్ ప్రారంభమైందని, ఇప్పటికే కార్యకలాపాలు పుంజుకున్నాయని, మున్ముందు మరింత వృద్ధి కనిపించవచ్చునని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.