పెళ్లి చేసుకుంటే బంపరాఫర్: వధువుకు రూ.30,000 బంగారం, షరతులు వర్తిస్తాయి
ప్రజల కోసం ప్రభుత్వాలు వివిధ పథకాలు తీసుకు వస్తుంటాయి. ఆడ పిల్లల పెళ్లిళ్ల కోసం ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు వివిధ రకాలుగా సాయం చేస్తున్నాయి. తాజాగా, అసోంలో ప్రభుత్వం మరో వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టింది. బాలికల్ని చదువుల దిశగా ప్రోత్సహించేందుకు వినూత్న ఆలోచన చేసింది.
ఆంధ్రప్రదేశ్లో తగ్గిన పెట్రో ఆదాయం, పెరిగిన మద్యం ఆదాయం
వధువుకు 10 గ్రాముల బంగారం
అసోం రాష్ట్రంలో పెళ్లి చేసుకోబోయే ప్రతి వధువుకు 10 గ్రాముల బంగారాన్ని కానుకగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. 10 గ్రాముల బంగారం లేదా రూ.30వేలు ఇస్తారు. అరుంధతి బంగారం పథకం పేరుతో తీసుకు వచ్చిన ఈ పథకం ద్వారా బాల్య వివాహాల నిరోధం, మహిళా సాధికారతను లక్ష్యంగా పెట్టుకుంది.
జనవరి 1 నుంచి అమలు
ఈ పథకం కోసం ఏడాదికి రూ.800 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ పథకానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనిని 2020 జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయనున్నారు. వచ్చే ఏడాది నుంచి దీనిని ప్రారంభిస్తామని ఆర్థిక మంత్రి హిమంత బిశ్వశర్మ చెప్పారు.
లక్ష్యం అదే...
బాల్య వివాహాల నిరోధం, మహిళా సాధికారత లక్ష్యంగా తీసుకు వచ్చిన అరుంధతి బంగారం పథకంలో అర్హతలు కూడా వాటిని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ పథకానికి అర్హతలు....
- వధువు కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. వరుడి వయస్సు 21 సంవత్సరాలు ఉండాలి.
- వధువు కనీసం 10వ తరగతి చదువుకొని ఉండాలి.
- వివాహాన్ని తప్పనిసరిగా నమోదు చేయాలి.
- వధువు పేరెంట్స్ వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉండాలి.
పది గ్రాముల బంగారం
అరుంధతి బంగారం స్కీంలో భాగంగా పెళ్లి రిజిస్టర్ చేసుకున్న ప్రతి వధువుకు 10 గ్రాముల వరకు బంగారం ఇస్తామని హిమంత బిశ్వ శర్మ చెప్పారు. ఇందుకు బ్యాంకు అకౌంట్లో రూ.30,000 డిపాజిట్ చేస్తామన్నారు.
బంగారం మాత్రమే కొనుగోలు చేయాలి
ఆ తర్వాత ఈ మొత్తంతో బంగారం కొనుగోలు చేసినట్లుగా రిసిప్ట్ చూపించాలని, దీంతో బంగారానికి తప్ప ఇతర అవసరాల కోసం ఖర్చు చేయరాదన్నారు. తాము ఓట్ల కోసం ఈ పథకాన్ని తీసుకు రావడం లేదని, మహిళా సాధికారత కోసం, పెళ్లిళ్లను రిజిస్టర్ చేయించే లక్ష్యంతో తీసుకు వస్తున్నట్లు చెప్పారు. ఈ పథకం తర్వాత పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్ పెరుగుతుందని భావిస్తున్నారు. అసోంలో ప్రతి సంవత్సరం 3 లక్షల వరకు పెళ్లిళ్లు ఉంటాయని అంచనా. కానీ కేవలం 50 వేల నుంచి 60వేలు మాత్రమే రిజిస్టర్ అవుతున్నాయి.