ఈ వారం మార్కెట్ ఎలా ఉండవచ్చు, బంగారం ధరలు పెరిగేనా?
ఏప్రిల్ 30వ తేదీతో ముగిసిన వారంలో భారత స్టాక్ మార్కెట్లు రెండు శాతం లాభపడ్డాయి. అయితే ఏప్రిల్ నెల మొత్తం చూసుకుంటే స్వల్పంగా నెగిటివ్గా ముగిశాయి. ఎస్ అండ్ పీ బీఎస్ఈ సెన్సెక్స్ 50,000 మార్కును నిలబెట్టుకోలేకపోయింది. నిఫ్టీ 50 స్టాక్స్ ఓ సమయంలో 15,000ను తాకినప్పటికీ నిలబడలేదు. సూచీలు ఈ వారం దాదాపు స్థిరంగా ఉంటాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. గత వారం మెటల్ రంగం అమ్మకాల ఒత్తిడికి లోనయింది. ఆ తర్వాత ఎనర్జీ, బ్యాంకింగ్ స్టాక్స్ ఉన్నాయి.
సెకండ్ వేవ్ ప్రభావం
అంతర్జాతీయ, ఆసియా మార్కెట్తో పాటు కరోనా సెకండ్ వేవ్ ప్రభావం మార్కెట్ల పైన ఉంటుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ఈ ఫలితాల ప్రభావం కూడా ఉంటుంది. జీఎస్టీ వసూళ్లు ఏప్రిల్ నెలలో రికార్డ్ స్థాయిలో ఉన్నాయి. ఇది మార్కెట్కు సానుకూల పరిణామం. ఇలా వివిధ అంశాలు మార్కెట్ పైన ప్రభావం చూపుతాయి. టెలిం స్తబ్దుగా, చమురు, బ్యాంకింగ్ ప్రతికూలంగా కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ నెలలో వాహన విక్రయాలు క్షీణించాయి. ఇది వాహన రంగ షేర్ల పైన ఉంటుంది. ఔషధ కంపెనీలు సానుకూలంగా కదలాడుతాయని అంచనా. ఐటీలో స్తబ్దు ఉంటుందని భావిస్తున్నారు.
కీలక మద్దతు
నిఫ్టీ కీలక మద్దతుస్థాయి 14400 వద్ద విఫలమయితే మరింత బలహీనం కావొచ్చునని అంచనా. మరో ప్రధాన స్వల్పకాలిక మద్దతుస్థాయి 14000. ఇక్కడ రికవరీ తప్పనిసరి అని, అంతకంటే దిగువకు వస్తే స్వల్పకాలిక కరెక్షన్ ముప్పు ఉంటుందని భావిస్తున్నారు. గతవారం మార్కెట్ మళ్లీ పుంజుకున్న మార్కెట్ గరిష్ఠస్థాయిల్లో నిరోధం ఎదురు కావడంతో వెనక్కి వచ్చింది. స్వల్పకాలంలో 48,150, 47000 పాయింట్ల వద్ద మద్దతుతో సెన్సెక్స్ స్థిరీకరణకు గురి కావొచ్చు. లాభపడితే 50,000 పాయింట్లను దాటినప్పటికీ, 50,400 వద్ద నిరోధకం ఉండవచ్చు. దీనిని దాటితే దూకుడు పెరిగే అవకాశముంది.
బంగారం, వెండి
గోల్డ్ జూన్ ఫ్యూచర్ రూ.47,469 వద్ద నిరోధం కనిపిస్తోంది. ఈ స్థాయిని అధిగమిస్తే మరింత ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. లేదంటే గత లాంగ్ పొజిషన్లలో ఉన్న ట్రేడర్లు రూ.47,217 దగ్గర ప్రాఫిట్ బుకింగ్ మంచిది. సిల్వర్ మే ఫ్యూచర్ రూ.67,456 స్థాయి కంటే దిగువకు వస్తే రూ.66,545 స్థాయిని పరీక్షించవచ్చు. రూ.69,845 స్థాయిని దాటితే రూ.71,325 వరకు వెళ్లే అవకాశముంది.