2008 సంక్షోభం కంటే వెల్లువెత్తిన FII, ఈ ఇన్వెస్టర్లతో కాస్త ఊరట
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా చమురు ధరలు భారీగా పెరిగి, డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ ఇటీవల క్షీణించింది. ద్రవ్యోల్భణం ఆందోళనతో భారత్ 3.2 ట్రిలియన్ డాలర్ల విలువ కలిగిన స్టాక్ మార్కెట్ భారీ విదేశీ అమ్మకాలు చూస్తోంది. అక్టోబర్ ప్రారంభం నుండి గ్లోబల్ ఫండ్స్ స్థానిక ఈక్విటీ నికర విక్రయదారులుగా ఉండగా, బెంచ్ మార్క్ ఎస్ అండ్ పీ బీఎస్ఈ సెన్సెక్స్ ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. అయితే యుద్ధం కారణంగా అవుట్-ఫ్లో వేగవంతమైంది. భారత్ తమ చమురు అవసరాలలో 85 శాతం దిగుమతులపై ఆధారపడుతోంది.
గతవారం 2.9 బిలియన్ డాలర్లను ఉపసంహరించుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కేవలం రెండు రోజుల్లోనే 2 బిలియన్ డాలర్లను ఉపసంహరించుకున్నారు. దీంతో సెప్టెంబర్ 30వ తేదీ నుండి 19 బిలియన్లు బయటకు వెళ్లాయి. మార్చి 2020లో కరోనా కనిష్టస్థాయికి పడిపోయినప్పటి నుండి స్థానిక షేర్లు ఆకర్షించిన ఫారెన్ మనీలో ఇది సగం. ఇది రూపాయిని ఆల్ టైమ్ కనిష్టానికి నెట్టింది.
నిపుణుల ప్రకారం 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో కనిపించిన వెనక్కి వెళ్లిన విదేశీ ప్రవాహాలను మించి ప్రస్తుతం వెనక్కి వెళ్లాయని చెబుతున్నారు. 2008 సంక్షోభం సమయంలో గరిష్టంగా 8 బిలియన్ డాలర్ల నుండి 10 బిలియన్ డాలర్లు వెళ్లాయి. విదేశీ ప్రవాహాలు భారీగా తరలి వెళ్తున్నప్పటికీ, కరోనా సమయంలో దేశీయంగా రిటైల్ ఇన్వెస్టర్లు పెరిగారు. దీంతో విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లినప్పటికీ ఇది తీవ్ర తగ్గుదలను నివారించడంలో సహాయపడింది. సెన్సెక్స్ అక్టోబర్ గరిష్టస్థాయి నుండి 10 శాతం క్షీణించింది.