46% భారతీయులు రుణాలు తీసుకున్నారు... 3 కారణాలివే..: ఉద్యోగాల కోత, ఈఎంఐ, శాలరీ ఆలస్యం
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చింది. వైరస్ కారణంగా వ్యాపారాలు లేక, ఉద్యోగాలు పోయి, వేతనాల కోత వల్ల... ఇలా వివిధ కారణాలతో చాలామంది ఇబ్బందులు పడ్డారు. మహమ్మారి సమయంలో తమ కుటుంబ పోషణ కోసం దాదాపు సగం మంది భారతీయులు రుణాలు తీసుకున్నారని హోమ్ క్రెడిట్ ఇండియా సర్వేలో వెల్లడైంది. ప్రధానంగా మూడు కారణాలతో సామాన్యులు రుణాలు తీసుకున్నారు. మార్చి చివరి వారం నుండి దాదాపు మూడు నెలల పాటు లాక్ డౌన్ సమయంలో జనాలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ప్రజల ప్రాణాలకు ప్రాధాన్యతను ఇచ్చి ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది.
వినియోగదారులకు ఎల్పీజీ గ్యాస్ ఊరట, కమర్షియల్ సిలిండర్ ధర పెంపు
వేతనాల కోత లేదా ఆలస్యం మొదటి కారణం
కరోనా కాలంలో 46 శాతం మంది భారతీయులు తమ ఇంటిని నడిపేందుకు రుణాలు తీసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో రుణాలు తీసుకోవడానికి ప్రధాన కారణాల్లో మొదటిది వేతనాల కోత లేదా వేతనాలు ఆలస్యం కావడం. ఉద్యోగులు సాధారణంగా ప్రతి నెల వేతనం తేదీని బట్టి అన్నింటిని ప్లాన్ చేసుకుంటారు. కానీ వేతన కోత, వేతనాలు ఆలస్యం కావడం వల్ల కమిట్మెంట్స్ కోసం లేదా కుటుంబ పోషణ కోసం రుణాలు చేయవలసి వచ్చింది. ముఖ్యంగా మధ్య తరగతి వారికి రుణాలు మించిన ఆప్షన్ లేదు. 27 శాతం మంది వేతనాల కోత లేదా ఆలస్యం వల్ల రుణాలు తీసుకున్నారు.
రెండో కారణం ఈఎంఐ
భారతీయులు ఎక్కువమంది రుణాలు తీసుకోవడానికి మరో కారణం. ఈఎంఐ చెల్లింపులు. ఉద్యోగులు పర్సనల్ లోన్, వెహికిల్ లోన్, హోమ్ లోన్ వంటివి తీసుకుంటుంటారు. అప్పటికే ఉన్న రుణాలపై ఈఎంఐ చెల్లింపులు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం లోన్ మారటోరియం అవకాశం కల్పించినప్పటికీ ఆ తర్వాత భారంగా మారుతుందనో లేదా మరో కారణంతోనో రుణాలు తీసుకొని ఈఎంఐలు చెల్లించారు.
ఉద్యోగ కోత వల్ల 14 శాతంమంది రుణబాట
ఇక, మరో ప్రధాన కారణం ఉద్యోగాలు పోవడం. కరోనా కారణంగా ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు. వీరంతా తమ కుటుంబ పోషణ కోసం లేదా అప్పటికే తీసుకున్న లోన్లకు సంబంధించి ఈఎంఐలు చెల్లించేందుకు రుణాలు తీసుకునే పరిస్థితి. మిడిల్ క్లాస్ కుటుంబాలపై ఎక్కువగా ప్రభావం పడింది. నివేదిక ప్రకారం కరోనా కాలంలో 14 శాతం మంది భారతీయులు ఉద్యోగాలు కోల్పోయి రుణాలు తీసుకున్నారు.
స్నేహితులు, బంధువుల నుండి రుణాలు తీసుకోవడం ఎక్కువగా ముంబై (27 శాతం), భోపాల్ (27 శాతం), ఢిల్లీ (26 శాతం), పాట్నా (25 శాతం) ఉంది.