బ్యాంకులకు కొత్త తలనొప్పి: డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్లపై ఆర్బీఐ నిషేధం
భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్లను వినియోగించుకోకుండా నిషేధం విధించడంతో బ్యాంకులు తల పట్టుకుంటున్నాయి. ఈ ఏజెంట్లు బ్యాంకుల రిటైల్ రుణాలు, రుణ గ్రహీతలకు సంబంధించిన పత్రాలను ఫిజికల్ గా తనిఖీ చేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు వీరిపై నిషేధం విధించడంతో బ్యాంకుల్లో కొత్త ఆందోళన మొదలైంది. రిటైల్ రుణాల జారీకి ఇది కొత్త విఘాతమని విఘాతమని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. రుణం తీసుకోవాలని భావించే వారి వివరాలు తస్కరణకు గురి కాకుండా ఉండటానికి, బ్యాంకుల నిర్వహణపరమైన రిస్క్ ను తగ్గించడానికి ఆర్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. అయితే ఆర్బీఐ నిర్ణయం వల్ల వినియోగదారు రుణాలు, క్రెడిట్ కార్డుల వ్యాపారంలో మందగమనానికి అవకాశం ఏర్పడుతుందని బ్యాంకులు అంటున్నాయి. ఇదే విషయాన్నీ అటు ఆర్బీఐ, ఇటు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని బ్యాంకులు భావిస్తున్నాయి.
ఏజెంట్లదే కీలక పాత్ర
బ్యాంకింగ్ రంగానికి డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్లు కీలకంగా మారుతున్నారు. పర్సనల్ రుణాలు, క్రెడిట్ కార్డులు, వినియోగదారుల క్రెడిట్ విషయంలో వీరి పాత్ర కీలకమైనది. ఈ యంత్రంగా గత దశాబ్ద కాలంగా వ్యవస్థీకృతమైంది. బ్యాంకులు రిటైల్ రుణాలు పెరగడంలో ఈ వ్యవస్థ ప్రధానంగా ఉంది. అయితే ఇప్పుడు ఈ ఏజెంట్లపై నిషేధం విధించడం వల్ల బ్యాంకులు ఒత్తిడికి లోనవుతున్నాయి.
* అయితే భారత రిజర్వ్ బ్యాంకు మాత్రం ఏజెంట్లు పరిమిత పాత్రనే పోషించాలని అంటోంది. రుణ గ్రహీతల ఒరిజినల్ పత్రాలను బ్యాంకు అధికారులే తనిఖీ చేయాలనీ, ఈ పనిని మరొకరికి అప్పగించ వద్దని అంటోంది. ఇలాంటి పని వేరే వారు చేయడం వల్ల దుర్వినియోగం చేసిన ఉదంతాలు ఉన్నట్టు ఆర్బీఐ దృష్టికి వచ్చి ఉంటుందని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి.
అంత ఈజీ కాదు..
ఇక బ్యాంకులు నియమించుకునే ఏజెంట్లు, బిజినెస్ కరెస్పాండెంట్ల్స్ రుణ గ్రహీతలకు సంబంధించిన ఈ కేవైసీ ప్రక్రియను లేదా బయో మెట్రిక్ రీడర్లు ద్వారా కస్టమర్ల ఐడెంటిటీని వెరిఫికేషన్ వెరిఫికేషన్ చేసే అవకాశం ఉండవచ్చు. కానీ ఇందుకు అవసరమైన రీడర్లను సమ కూర్చడం, కనెక్టివిటీ సదుపాయాన్ని కల్పించడం అంత సులభం ఏమీ కాదని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే బ్యాంకుల రుణ వితరణ తగ్గిపోతోంది. వడ్డీ రేట్లు దిగివస్తున్నప్పటికే రుణాలు తీసుకుందుకు వినియోగదారులు ముందుకు రావడం లేదు. వివిధ రకాల కొనుగోళ్ల విషయంలో, ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో రుణ వితరణపై మరింత ప్రభావం పడుతుందని బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి.