గోల్డ్ ఈటీఎఫ్ జపం చేస్తున్న సంపన్నులు: అదే బాటలో సాధారణ ఇన్వెస్టర్లు
ఈక్విటీ మార్కెట్లలో ఉత్తాన పతనాలు నమోదవుతున్నాయి. ఇన్వెస్టర్ల సొమ్ము గాల్లో దీపంలా మారిపోతోంది. అంతర్జాతీయంగా చూస్తే కూడా ప్రతికూల పరిణామాలే కనిపిస్తున్నాయి. భౌగోళిక రాజకీయ పరిణామాలతో పలు దేశాల స్టాక్ మార్కెట్లు ఎగసిపడుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి సంభంధించిన అంచనాలు కూడా తీవ్ర నిరాశాపూరితంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లకు ఎడారిలో ఒయాసిస్సులా బంగారం ఎక్స్చేంజి ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) కనిపిస్తున్నాయి. .
వీటిలో పెట్టుబడులు పెట్టడం వల్ల తమ పెట్టుబడులకు రక్షణ ఉంటుందని భావిస్తున్నారు ఇన్వెస్టర్లు. ఇలాంటివారిలో సంపన్నులే కాదు సాధారణ ఇన్వెస్టర్లు కూడా ఉంటున్నారు. అందుకే గత కొంత కాలంగా బంగారం ఈటీఎఫ్ లలో పెట్టుబడులు పుంజుకుంటున్నాయి. విదేశాల్లోనూ పెద్ద ఈటీఎఫ్ లు ఇదే పనిలో ఉన్నాయి. గత కొంత కాలంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. రానున్న కాలంలో మరింత పెరగవచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో గోల్డ్ ఈటీఎఫ్ లకు గిరాకీ మరింత ఎక్కువ అవుతోంది.
పెట్టుబడులు ఎలా ఉన్నాయంటే...
* గత ఏప్రిల్ నెలలో గోల్డ్ ఈటీఎఫ్ ల నుంచి రూ. 9.70 కోట్ల పెట్టుబడులు తరలి పోయాయి. తర్వాత ఆగష్టు నుంచి పెట్టుబడులు పెరుగుతున్నాయి. భారత మ్యూచువల్ ఫంక్స్ అసోసియేషన్ విల్లడించిన గణాంకాల ప్రకారం తొమ్మిది నెలల తర్వాత ఆగష్టు నెలలో గోల్డ్ ఈటీఎఫ్ లలోకి పెట్టుబడులు వచ్చాయి. ఈ నెలలో వచ్చిన పెట్టుబడులు రూ.145 కోట్లు. సెప్టెంబర్లో వచ్చిన పెట్టుబడులు రూ.44 కోట్లు. సెప్టెంబర్ చివరి నాటికీ గోల్డ్ ఈటీఎఫ్ ల నిర్వహణలో ఆస్తులు రూ.5,613 కోట్లకు చేరుకున్నాయి.
* ఇక బంగారం ధరల విషయానికి వస్తే.. ఏప్రిల్ ప్రారంభంలో రూ.32, 700 స్థాయిలో ఉన్న బంగారం ధర సెప్టెంబర్ ప్రారంభంలో రూ.40,000 స్థాయికి చేరుకుంది. ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నప్పటికీ మరీ ఎక్కువ తక్కువ మాత్రం ఏమీ లేదు.
10 శాతం మించవద్దంటున్న నిపుణులు
* బంగారం ధరలను అంచనా వేయడం కష్టమని కొంతమంది మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. కొన్నాళ్ల పాటు పెరుగుతూ వెళ్లే బంగారం ధరలు కొంతకాలం పాటు స్థిరంగా ఉంటాయని ఈ నేపథ్యంలో ఆచితూచి వ్యవహరించాలని సూచిస్తున్నారు.
* ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్లో బంగారం వాటాను 10 శాతం మించకుండా చూసుకుంటే బాగుంటుందని అంటున్నారు.
బంగారం ఫండ్స్
* రిటైల్ ఇన్వెస్టర్లు బంగారం లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే బంగారం ఫండ్స్ లోని సిప్ ల ద్వారా పెట్టుబడులు పెట్టే ఆలోచన చేయాలని సలహా ఇస్తున్నారు.
* మార్కెట్లు ఆనిచ్చితిలో ట్రేడ్ అవుతున్నందువల్ల బంగారం ఈటీఎఫ్ లకు ప్రాధాన్యం ఏర్పడుతోందని అయితే ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో కొంతకాలం పాటు వీటిలో పెట్టుబడులు పెరగడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు.