వెండికి పండగ కళ ... జోరుగా గిరాకీ
వెండికి పండగ కళ వచ్చింది. సాధారణ కొనుగోళ్లతో పాటు పెట్టుబడులు కూడా జోరుగా పెరుగుతున్నాయి. గత కొంత కాలంగా బంగారం, వెండి ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. వెండి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ.46,000 స్థాయిలో ఉంది. పండగ డిమాండ్ నేపథ్యంలో వెండి ధరలు మరింత బలపడుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
30 శాతం పెరుగుదల
వెండి ధరలు దాదాపు రెండేళ్ల పాటు స్థిరంగా ఉన్నాయి. అయితే ఇటీవలే కాలంలో బంగారం ధరలు భారీగా పెరగడం మొదలు కావడంతో వెండి ధరలకు కూడా ఊపు వచ్చింది. గత జులై నుంచి వెండి ధరలు పెరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బంగారం ధర అధికంగా ఉండటం వల్ల దానికి బదులుగా వెండిని కొనుగోలు చేస్తున్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. బంగారం తో పోల్చితే వెండి ధర దాదాపు ఎనభై రేట్లు తక్కువ. అంటే పసిడికన్నా ఇది చాలా చవకైనది. కాబట్టి దీన్ని కొనుగోలు చేయడం చాలా సులభమైనది. అందుకే రజతానికి గిరాకీ పెరుగుతున్నట్టు బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో వెండికి ఎక్కువ గిరాకీ ఉంది. వెండి నాణాలు, బార్లు ఎక్కువ కొనుగోలు చేస్తున్నారు.
మరింత పెరగవచ్చు..
వెండి ధరలు రానున్న కాలంలో మరింత పెరగడానికి అవకాశాలు ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. పట్టణ, గ్రామీణ డిమాండ్ తో పాటు పరిశ్రమలు, కాయిన్ల తయారీ దారుల నుంచి కూడా వెండికి గిరాకి పెరుగుతోంది. కాబట్టి ధరలు మరింత ముందుకు వెళ్ళడానికే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి ధర 17.58 డాలర్ల స్థాయిలో కదలాడుతోంది. మార్కెట్లో ధర పెరిగితే దాని ప్రభావం మన మార్కెట్లోనూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఆర్ధిక వ్యవస్థలో మందగమన ప్రభావం వెండిపై కనిపిస్తోందని, ఇంతకు ముందు కార్పొరేట్ బహుమతులలో ఎక్కువగా కనిపించే వెండి ఇప్పుడు తగ్గిపోయిందని అంటున్నారు.
ప్లాస్టిక్ బదులు.. వెదురు నీళ్ల బాటిల్స్, ధర ఎంతో తెలుసా?
పెరిగిన దిగుమతులు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల కాలంలో వెండి దిగుమతులు భారీగానే పెరిగాయి. ఆగస్టులో దిగుమతులు 72 శాతం వృద్ధి చెంది 543.2 టన్నులకు చేరుకున్నాయి. అంతకు ముందు ఏడాది ఆగస్టులో దిగుమతులు 315.4 టన్నులుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో వెండి దిగుమతులు 3,826.8 టన్నులుగా ఉన్నాయి. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే దిగుమతులు 25.52 టన్నులుగా ఉన్నాయి.
ఎగుమతి మార్కెట్లో కూడా వెండి ఆభరణాలు మంచి పనితీరును కనబరిచాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో వెండి ఆభరణాల ఎగుమతులు 76.12 శాతం పెరిగాయి. చేతులతో చేసే వెండి ఆభరణాలకు అంతర్జాతీయ మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంటోంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ప్రథమార్థంలో జెమ్స్ అండ్ జ్యూవెలరీ ఎగుమతులు 7.43 శాతం తగ్గాయి.