బంగారం వ్యాపారులకు షాక్: ఈసారి అమ్మకాలు భారీగా తగ్గుతాయట.. కారణం ఏమిటంటే?
పండగల సీజన్ వచ్చిందంటే బంగారం దుకాణాలు కస్టమర్లతో కళకళలాడిపోతాయి. ఈ సీజన్లోనే అమ్మకాలు భారీగా పెరుగుతాయి. పర్వదినాల్లో విక్రయాలు మరింత అధికంగా ఉంటాయి. పెళ్లిళ్ల సీజన్, దసరా, దంతెరస్, దీపావళి సందర్భంగా బంగారం కొనుగోళ్లు జరిపేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతారు. అయితే ఈసారి మాత్రం బంగారం అమ్మకాలపై ఆశలు అంతంత మాత్రంగా ఉన్నాయని వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా అధిక విక్రయాలు జరిగే దంతెరస్ సందర్భంగా ఈసారి బంగారం విక్రయాలు సగానికి సగం తగ్గవచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఇందుకు ప్రధానమైన కారణం అధిక ధారాలేనని అంటున్నారు. గత కొంతకాలంగా బంగారం ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే.
బంగారం
* ప్రస్తుతం పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.38,200 స్థాయిలో ఉంది. అధిక ధరల వల్ల బంగారం కొనుగోళ్లు తగ్గినట్టు ఇప్పటికే వ్యాపారవర్గాలు చెబుతున్నాయి.
* ఈ ధరల ప్రభావం ఈసారి దంతెరస్ అమ్మకాలపై ఉంటుందని భావిస్తున్నామని ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (ఐ బీ జే ఏ) నేషనల్ సెక్రటరీ సురేందర్ మెహతా చెబుతున్నారు.
40 టన్నులు
దంతెరస్ సందర్భంగా ప్రతి ఏడాది బంగారం అమ్మకాలు దాదాపు 40 టన్నులు ఉంటాయని, ఈసారి డిమాండ్ బలహీనంగా ఉన్నందువల్ల ఈ ఏడాది అమ్మకాలు 50 శాతం తగ్గవచ్చని సురేందర్ మెహతా చెబుతున్నారు.
భారీగా తగ్గిన దిగుమతులు
ప్రభుత్వం బంగారం దిగుమతులపై సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచింది. దీనివల్ల ధరలు పెరిగాయి. ఇదే తరుణంలో రూపాయి విలువ తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడం వల్ల దేశీయ మార్కెట్లో ధరలు పెరిగాయి. దీంతో డిమాండ్ తగ్గిపోయింది. గత సెప్టెంబర్లో భారత్ కేవలం 27 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది. అంతకు ముందు ఏడాది ఇదే నెలతో పోల్చితే బంగారం దిగుమతులు 68.18 శాతం తగ్గాయి. సాధారణంగా బంగారం మార్కెట్లో పెళ్లిళ్ల డిమాండ్, పండగల డిమాండ్, రెగ్యులర్ డిమాండ్ ఉంటుంది. అయితే ఇప్పటికే రెగ్యులర్ గా జరిగే డిమాండ్ తగ్గిపోయిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అధిక ధరల మూలంగా బంగారంలో పెట్టుబడులు పెట్టడానికి కూడా చాలా మంది విముఖత చూపుతున్నారని అంటున్నారు. పండగల సీజన్ లో డిమాండ్ తక్కువగా ఉండవచ్చని భావిస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో సుస్థిరం
* అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం, వివిధ దేశాల్లో చోటుచేసుకంటున్న రాజకీయ, ఆర్ధిక పరిణామాల కారణంగా స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు బంగారం కొనుగోళ్ళకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో ఔన్స్ పసిడి ధర 1,500 డాలర్ల స్థాయిలో ఉంది. ఇంకా పెరగవచ్చని చెబుతున్నారు. ఇదే జరిగితే దేశీయ మార్కెట్లో ధరలు ఇంకా పెరగడానికి అవకాశం ఉందని మార్కెట్ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.