జీడీపీ దెబ్బ: రెపో ప్రకటన తర్వాత భారీ నష్టాల్లో మార్కెట్లు
ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.50 సమయానికి సెన్సెక్స్ 198 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 44 పాయింట్ల లాభంతో ట్రేడ్ అయింది. డాలరుతో రూపాయి మారకం విలువ 70.96 వద్ద ట్రేడ్ అయింది. గురువారం కూడా మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. కానీ ఆర్బీఐ మానిటరీ పాలసీ ప్రకటన సానుకూలంగా ఉంటుందనే అంచనాలతో శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత కాస్త నష్టాల్లోకి జారుకున్నాయి.
ఆర్బీఐ రెపో రేటు తగ్గింపు తర్వాత మధ్యాహ్నం గం.12.52 నిమిషాలకు మార్కెట్లు నష్టాల్లోనే ఉన్నాయి. సెన్సెక్స్ 85.40 (0.22%) పాయింట్లు కోల్పోయి 38,021.47 వద్ద, నిఫ్టీ 37.15 (0.33%) పాయింట్లు నష్టపోయి 11,276.85 వద్ద ట్రేడ్ అయింది. అనంతరం గం.1 సమయానికి సెన్సెక్స్ 61.65 (0.54%) పాయింట్లు కోల్పోయి 11,252.35 వద్ద, సెన్సెక్స్ 198.70 (0.52%) కోల్పోయి 37,908.17 వద్ద ట్రేడ్ అయింది.
మళ్లీ కీలక వడ్డీరేట్లు తగ్గించిన ఆర్బీఐ, 25 పాయింట్ల కట్తో 5.15 శాతానికి పరిమితం
ఆర్బీఐ రెపో రేటును తగ్గించినప్పటికీ 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను జీడీపీ వృద్ధిరేటు అంచనాను 6.9 శాతం నుంచి 6.1 శాతానికి తగ్గించింది. దీంతో మార్కెట్లు నష్టాలను చవి చూశాయి. కేంద్ర ప్రభుత్వం ఉద్దీపన ప్రకటనలు చేసినప్పటికీ అంతర్జాతీయ ప్రభావం సహా వివిధ కారణాలతో మార్కెట్లు కొద్ది రోజులుగా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. రెపో రేటు నేపథ్యంలో లాభాల్లోకి వస్తుందనుకుంటే జీడీపీ వృద్ధి రేటు అంచనా ఇన్వెస్టర్లకు ఆందోళన కలిగించింది.
టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్..
మధ్యాహ్నం సమయానికి టాప్ గెయినర్స్ లిస్టులో సిప్లా, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండస్ ఇండ్బ్యాంకు, ఇన్ఫోసిస్, విప్రో ఉన్నాయి. ఇవి 1 శాతం నుంచి 2 శాతానికి పైగా లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. టాప్ లూజర్స్ జాబితాలో కొటక్ మహీంద్రా, గ్రాసిమ్, బీపీసీఎల్, టైటాన్ కంపెనీ, అల్ట్రా టెక్ సిమెంట్ ఉన్నాయి. అత్యధికంగా నష్టపోయిన వాటిలో కొటక్ మహీంద్రా, గ్రాసిమ్ ఉన్నాయి. ఇవి 3 శాతం నుంచి మూడున్నర శాతానికి పైగా నష్టపోయాయి.