ఆదాయపన్నుపై ఎప్పుడైనా గుడ్న్యూస్? సామాన్యుడికి ధరల ఊరట!
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గత శుక్రవారం కార్పోరేట్ పన్నును తగ్గిస్తూ కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటనను కంపెనీలు స్వాగతించాయి. దీంతో శుక్రవారం మార్కెట్లు దూకుడు ప్రదర్శించాయి. ఏకంగా ఒక్క రోజే సెన్సెక్స్ 2000 పాయింట్లకు పైగా లాభాలను మూటగట్టుకుంది. ఆర్థికమాంద్యం నేపథ్యంలో కేంద్రం వరుసగా ఉద్దీపన చర్యలు చేపట్టింది. ఈ చర్యల్లో భాగంగా సామాన్యుడి నుంచి ఐటీ వరకు కూడా కేంద్రం ఊరటనిస్తుందా అనే చర్చ సాగుతోంది.
వ్యక్తిగత ఆదాయ పన్ను ఊరట ఉంటుందా?
ఉద్దీపన చర్యల్లో భాగంగా వ్యక్తిగత ఆదాయ పన్నుకు కూడా ఊరటనిస్తుందా? ఐటీలోను వరాలు ప్రకటిస్తారా? అనే ఆశలు మొలకెత్తుతున్నాయి. కేంద్రం వివిధ రంగాలకు వరుసగా ఉద్దీపన చర్యలు ప్రకటిస్తోంది. ఈ నేపథ్యంలో వ్యక్తిగత ఆదాయ పన్నులో కొన్ని రాయితీలు కల్పించే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కిందటి నెలలోనే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు నివేదిక సమర్పించింది.
కార్పోరేట్లతో పాటు సామాన్యులకూ వరాలు
ఈ నివేదిక అమలు చేయడానికి ముందు దీనిపై చర్చ జరగాలని కేంద్రం యోచిస్తోంది. దీనిపై ఆర్థికమంత్రి నిపుణులతో చర్చిస్తున్నారట. ఉద్దీపన చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం వరాలు కార్పోరేట్లకే కాకుండా సామాన్యులకు కూడా అందించే ఉద్దేశ్యంలో భాగంగా మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చునని అంటున్నారు.
వ్యక్తిగత ఆదాయ పన్నుపై డిమాండ్లు
వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లపై ఎన్నో డిమాండ్లు ఉన్నాయి. దీనిపై ఆర్థికమంత్రి స్పందించారు. ఆదాయపన్ను రేటు హేతుబద్దీకరణ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆలోచించలేదని స్పష్టం చేశారు. డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ టాస్క్ఫోర్స్ రిపోర్ట్ దీనిపై రిపోర్ట్ సిద్ధం చేస్తోందని, పన్ను నిర్మాణ సరళీకరణ, హేతుబద్దీకరణకు సంబంధించి పలు సిఫార్సులు చేసిందని తెలిపారు.
రాయితీలపై కేంద్రం పరిశీలన
అయితే వ్యక్తిగత ఆదాయ పన్నుల్లో కొన్ని రాయితీలు కల్పించే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందట. వరాలు కార్పోరేట్లకేనా.. సామాన్యులకు ఉండవా అనే విమర్శలు సహజం. ఈ నేపథ్యంలో సామాన్యులకు త్వరలో గుడ్ న్యూస్ చెప్పే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఇప్పటికే సూపర్ రిచ్కు సర్ఛార్జీ ఊరటనిచ్చారు.
వీరికి లభించని ఊరట...
అయితే వేతనాలు, అద్దెలు, వృత్తిపరమైన ఆర్జన ద్వారా వ్యక్తిగతంగా రూ.2 కోట్లకు పైబడి ఆదాయం ఉన్న వారిపై విధిస్తున్న సర్ ఛార్జీని మాత్రం యథాతథంగా ఉంచారు. దీనిని కొన్నాళ్లపాటు నిలుపుదల చేయాలని నిపుణులు సూచిస్తున్నారట.
పండుగ సీజన్లో తగ్గింపు... వినియోగదారులకు లాభం
మరోవైపు, పండుగ సీజన్లో కార్పోరేట్ పన్ను భారీగా తగ్గించిన నేపథ్యంలో వినియోగదారులకు భారీగా లాభించవచ్చునని భావిస్తున్నారు. త్వరితగతిన విక్రయమయ్యే నిత్యావసరాలు, వినియోగ సరుకుల రంగానికి ఇది ఊతమిస్తుందని భావిస్తున్నారు. పన్ను తగ్గింపు వల్ల ధరలు తగ్గుతాయని, ఫలితంగా డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నారు. ఇది వినియోగ వ్యయానికి దారి తీస్తుందని అంచనా. ప్రజలు నిత్యం వాడే సరుకుల మీద జీఎస్టీ తగ్గితే సహజంగా కొనుగోళ్ళు పెరుగుతాయని అంటున్నారు.
ఆ లాభాలు కస్టమర్కు...
బిస్కట్స్, సబ్బులు మొదలైన వాటి విక్రయాలు కొద్దినెలలుగా దారుణంగా పడిపోయాయి. బ్రిటానియా, హిందూస్థాన్ యూనీలీవర్ లాంటి కంపెనీలు తమ లాభాల్లో 28 శాతం నుంచి 35 శాతం వరకు కార్పొరేట్ పన్నును చెల్లిస్తున్నాయి. ఈ పన్ను తగ్గుతుంది కాబట్టి ఆ లాభాన్ని వినియోగదారులకు మళ్లించవచ్చునని, ధరలు తగ్గించవచ్చుననేది విశ్లేషకుల మాట.