షేర్ మార్కెట్: 360 పాయింట్ల లాభంలో సెన్సెక్స్, 11,000 మార్క్ దాటిన నిఫ్టీ
ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఆటోమొబైల్ రంగంలో వాహన విక్రయాలు భారీగా తగ్గడానికి తోడు అంతర్జాతీయ మార్కెట్ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో మంగళవారం మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. బుధవారం కాస్త లాభాల్లో ప్రారంభమయ్యాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.70.92 వద్ద కొనసాగుతోంది.
ఆస్ట్రేలియాలో ఇన్ఫోసిస్ సరికొత్త రికార్డ్, కానీ షాక్ తప్పదా
ఉదయం తొమ్మిది నలభై నిమిషాల సమయంలో సెన్సెక్స్ 106 పాయింట్ల లాభంతో 37,064 వద్ద ట్రేడ్ కాగా, నిఫ్టీ 33 పాయింట్ల లాభంతో 10,959 వద్ద ట్రేడ్ అయింది. మార్కెట్ అలాగే పుంజుకుంది. ఆ తర్వాత మధ్యాహ్నానికి నిఫ్టీ 101 పాయింట్లు ఎగబాకి 11,026 మార్క్ దాటింది. సెన్సెక్స్ 360 పాయింట్ల వరకు ఎగబాకి 37,317.49 వద్ద టేర్డ్ అయింది.
నిఫ్టీలో జీ ఎంటర్టైన్మెంట్, టాటా స్టీల్, వేదాంత, ఇండియాబుల్స్ హౌసింగ్, యస్ బ్యాంక్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇండియాబుల్స్ హెచ్ఎస్జీ, విప్రో, కోల్ ఇండియా, సిప్లా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. రంగాలవారీగా చూస్తే లోహ, ఆటో, బ్యాంకు, ఇంధన, మౌలిక రంగాల షేర్లు లాభాల్లో ట్రేడ్ అవగా, ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఫార్మా షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.
రెండు రోజుల క్రితం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో గిగాఫైబర్, ఆరామ్కో, బీపీతో ఒప్పంద అంశాల గురించి వెల్లడించారు. ఈ నేపథ్యంలో మంగళవారం మార్కెట్లు నష్టాల్లో ఉన్నప్పటికి రిలయన్స్ షేర్లు మాత్రం భారీ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. బుధవారం కూడా మధ్యాహ్నం సమయానికి 13 పాయింట్ల లాభంతో 1,288 వద్ద ట్రేడ్ అయింది.