ఆటో దెబ్బ, 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్, దూసుకెళ్ళిన అంబానీ కంపెనీ షేర్లు
ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం సాయంత్రం మూడు గంటల సమయానికి భారీ నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్ 624 పాయింట్లు కోల్పోయి 36,957.09 వద్ద ట్రేడ్ అయింది. ఆ తర్వాత కాస్త కోలుకొని 600 పాయింట్లు కోల్పోయి 36,982 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 176 పాయింట్లు కోల్పోయి 10,933 వద్ద ట్రేడ్ అయింది. ఉదయం నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. మార్కెట్ క్లోజింగ్కు ముందు సాయంత్రానికి మరింత నష్టాలకు చేజారుకుంది. మార్కెట్లపై ప్రధానంగా ఆటో షేర్ల ప్రభావం బాగా పడింది. వరుసగా తొమ్మిదో నెల.. జూలైలో కూడా ఆటో అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. ఈ సెక్టార్లో ఉద్యోగాలు కూడా పెద్ద ఎత్తున కోల్పోతున్నారు.
ఉదయం నష్టాలతో ప్రారంభం...
స్టాక్ మార్కెట్లు మంగళవారం ఉదయం నష్టాల్లో ట్రేడ్ను ప్రారంభించాయి. సెన్సెక్స్ ఉదయం 209 పాయింట్ల నష్టంతో ఉంది. మధ్యాహ్నం సమయానికి కాస్త కోలుకోని 194 పాయింట్ల నష్టంతో 37,400 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ మధ్యాహ్నం సమయానికి 49 పాయింట్ల నష్టంతో 11,060 వద్ద ట్రేడ్ అయింది. డాలర్తో రూపాయి మారకం విలువ రూ.71.09 వద్ద ట్రేడ్ అయింది.
జూలై నెలలో డొమెస్టిక్ పాసింజర్ వెహికిల్స్ 30 శాతానికి పైగా తగ్గాయి. ఈ నేపథ్యంలో ఆటో షేర్లు ఈ రోజు నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. డొమెస్టిక్ కారు సేల్స్ 36 శాతం తగ్గాయి. మోటార్ సైకిల్స్ షేర్లు కూడా తగ్గుముఖం పట్టాయి. ఉదయం గం.9.46 నిమిషాలకు నిఫ్టీ ఆటో ఇండెక్స్ 1.46 శాతం నష్టంతో ట్రేడ్ అయింది. సెన్సెక్స్ 214 పాయింట్లు తగ్గింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్, గెయిల్ ఇండియా, బీపీసీఎల్, యస్ బ్యాంకు, ఇండియా బుల్స్ హౌసింగ్, జీ ఎంటర్టైన్మెంట్, వొడాఫోన్ ఐడియా, టాటా మోటార్స్ తదితర కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఎన్టీపీసీ, భారతీ ఎయిర్ టెల్, బ్రిటానియా ఇండస్ట్రీస్, వేదాంత, ఎం అండ్ ఎం, పవర్ గ్రిడ్, హెచ్డీఎఫ్సీ, హెచ్యూఎల్, టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.
ఇంధన రంగం మినహా మిగతా రంగాల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లు ఒకశాతం లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లు 10 శాతం లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సోమవారం నాటి ఏజీఎం సమావేశం అనంతరం ఈ కంపెనీ షేర్లు దూసుకెళ్తున్నాయి.