స్టాక్ మార్కెట్లు కకావికలం ! బ్యాంకులు బోల్తా
స్టాక్ మార్కెట్లు మళ్లీ కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన నిరుత్సాహక సంకేతాలకు తోడు దేశీయంగా కూడా అనేక కారణాలు మార్కెట్లను కుదేలయ్యాలా చేస్తున్నాయి. బడ్జెట్ నాటి నుంచి నిఫ్టీ ఏకంగా 650 పాయింట్లు పతనమైంది. ఎఫ్ఐఐలు పెద్ద ఎత్తున అమ్మకాలు జరుపుతూనే ఉన్నారు. ఇటు దేశీయంగా సరైన వర్షపాతం లేకపోవడం కూడా సెంటిమెంట్ను మరింత బలహీనపరుస్తోంది. దీంతో నిఫ్టీ ఈ రోజు 11400 పాయింట్లను కూడా బ్రేక్ చేసి ఒక దశలో 11300 పాయింట్ల మార్కు వరకూ చేరింది. అయితే అక్కడ బలమైన మద్దతు ఉన్న నేపధ్యంలో అక్కడి నుంచి కొద్దిగా రికవర్ అయింది. అయినా ఈ రోజు ప్రధానంగా హెవీ వెయిట్ స్టాక్స్లో సెల్లింగ్ వచ్చింది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్సియల్ స్టాక్స్ కుప్పకూలాయి. ఇంతకాలం మార్కెట్లను నిలబెడ్తూ వచ్చిన హెచ్ డి ఎఫ్ సి ట్విన్స్, బజాజ్ ట్విన్స్ 5 శాతానికి పైగా పతనమయ్యాయి. చివరకు నిఫ్టీ 73 పాయింట్లు దిగొచ్చి 11346 దగ్గర క్లోజైంది. సెన్సెక్స్ 306 పాయింట్లు దిగొచ్చి 38031 దగ్గర స్థిరపడింది. బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 485 పాయింట్లు పడి 29285 దగ్గర క్లోజైంది.
యెస్ బ్యాంక్, వేదాంతా, ఇండియాబుల్స్ హౌసింగ్, హిందాల్కో, జీ ఎంటర్టైన్మెంట్ స్టాక్ టాప్ ఫైవ్ గెయినర్స్ జాబితాలో చేరాయి. బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్ డి ఎఫ్ సి, ఐషర్ మోటార్స్, హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్ లూజర్స్ జాబితాలో చేరాయి.
ఇక ఇండెక్సుల పరంగా చూస్తే.. మిడ్ క్యాప్ 0.37 శాతం, స్మాల్ క్యాప్ 1.34 శాతం దిగొచ్చింది. మిగిలిన వాటిల్లో మీడియా, మెటల్, ఆటో మినహా అన్ని రంగాలూ దిగొచ్చాయి. ముఖ్యంగా ఫిన్ సర్వ్ రెండున్నర శాతం పతనం కాగా, ఎఫ్ఎంసిజి, రియాల్టీ ఒకటిన్నర శాతం వరకూ దిగొచ్చాయి.
యెస్ బ్యాంక్ తేరుకుంది
డిహెచ్ఎఫ్ఎల్ తన అప్పులను తీర్చుకునేందుకు వివిధ మార్గాలను అన్వేషిస్తోందనే వార్తలు యెస్ బ్యాంక్లో కొద్దిగా ఉత్సాహాన్ని నింపాయినీ. డిహెచ్ఎఫ్ఎల్ మొండిబకాయిలతో ఇబ్బంది పెడ్తున్న యెస్ బ్యాంక్కు ఇది కొద్దిగా ఊరటనిచ్చే వార్త. ఈ నేపధ్యంలో స్టాక్ 10 శాతం వరకూపెరిగింది. దీంతో మళ్లీ రూ.90 వరకూ చేరింది స్టాక్.
హెచ్ డి ఎఫ్ సి బ్యాంకుకు నష్టాలు
దేశంలోని ఈ ప్రధాన బ్యాంక్ రిజల్ట్స్ తర్వాత స్టాక్ పతనమైంది. శనివారం విడుదలైన ఫలితాల్లో సంస్థ నికర లాభం 21 శాతం పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 22.9 శాతం వృద్ధి చెందింది. ప్రొవిజన్స్ ఏకంగా 60 శాతం పెరిగి రూ.2613 కోట్లకు చేరాయి. దీంతో స్టాక్ వరుసగా రెండో రోజూ పతనమైంది. ఈ రోజు 4 శాతం వరకూ తగ్గిన స్టాక్ చివరకు రూ.2297 దగ్గర క్లోజైంది.
రిలయన్స్ లీడర్
రిలయన్స్ ఇండస్ట్రీస్ శుక్రవారం రాత్రి త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. ఆదాయంలో 5.6 శాతం, నికర లాభంలో సుమారు 6 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఎబిటా అర శాతం తగ్గినప్పటిక రిలయన్స్ జియో దన్నుగా నిలిచింది. దీంతో ఇంతటి నష్టాల మార్కెట్లో కూడా స్టాక్ 2.5శాతం పెరిగింది. చివరకు రూ.1280 దగ్గర క్లోజైంది.
ఇండిగో ఫ్లయింగ్
త్రైమాసిక ఫలితాల్లో ఆదాయం 45 శాతం, నికర లాభం 43 శాతం పెరగడం ఇండిగోకు కలిసొచ్చింది. జెట్ ఎయిర్ మూతబడడం వంటివి ఇండిగోకు బాగా కలిసొచ్చాయి. దీంతో స్టాక్ ఈ రోజు కూడా 4 శాతం వరకూ పెరిగింది. చివరకు రూ.1518 దగ్గర క్లోజైంది.
హిందుస్తాన్ మీడియా వెంచర్స్ హై జంప్
సంస్థ ప్రకటించిన ఫలితాల్లో నికర లాభం ఏకంగా మూడు రెట్లు పెరిగి రూ.39.7 కోట్లకు చేరింది. కానీ ఆదాయం మాత్రం 4 శాతం తగ్గింది. ట్రేడింగ్ వాల్యూమ్స్ ఏకంగా 40 రెట్లు పెరిగింది. దీంతో స్టాక్ 11 శాతం పెరిగి రూ.91 దగ్గర క్లోజైంది.