స్టాక్ మార్కెట్లపై ఆసక్తి.. జోరుగా పెరుగుతున్న డీమ్యాట్ ఖాతాలు
దేశీయ స్టాక్ మార్కెట్ల ఉత్తానపతనాలు పత్రికల్లో ప్రధాన శీర్షికలుగా మారుతున్నాయి. ఒక్క రోజులో లక్షల కోట్ల రూపాయల సంపద పెరుగుతోంది, తగ్గుతోంది. ఈ వార్తలు పత్రికలోనే కాకుండా టీవీల్లో, యూట్యూబ్ లోను ఎక్కువగా కనిపిస్తుండటంతో పట్టణాల్లోని వారే కాకుండా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలోని వారు కూడా స్టాక్ మార్కెట్ పెట్టుబడుల గురించి ఆలోచిస్తున్నారు. ఈక్విటీ మార్కెట్లో రిస్క్ ఎంత ఉంటుందో రివార్డ్ కూడా అంతే ఉంటుంది. అయితే చాలా మంది తమ లక్కును స్టాక్ మార్కెట్లో పరీక్షించు కోవాలనుకుంటున్నారు. వస్తే లాభం పోతే అనుభవం అన్న ధోరణితో చాలా మంది ఉంటున్నారు. చిన్న చిన్న పట్టణాల్లోనూ స్టాక్ మార్కెట్ బ్రోకింగ్ సంస్థలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేస్తూ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు అవసరమైన డీమ్యాట్ ఖాతాలను తెరుస్తున్నాయి. అందుకే వీటి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఖాతాలను ప్రారంభించడంలో సౌలభ్యం కూడా వీటి సంఖ్య పెరిగేందుకు దోహదపడుతోంది.
HDFC హెచ్చరిక: మీ డబ్బు దొంగిలిస్తారు.. ఇలా చేయకండి!
41 లక్షల డీమ్యాట్ ఖాతాలు
* సంపద పెంచుకోవడానికి స్టాక్ మార్కెట్లు దోహద పడతాయని చాలా మంది ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.
* ఈ నేపథ్యంలో డిపాజిటరీల వద్ద జూన్ 30 తో ముగిసిన ఏడాది కాలానికి 41 లక్షల మంది ఇన్వెస్టర్లు డీమ్యాట్ ఖాతాలను తెరిచారు. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సంఖ్య దాదాపు 3.65 కోట్లకు చేరుకున్నట్టయింది.
* ఇక్కడ ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే 2011 సంవత్సరం తర్వాతి నుంచి ఈ స్థాయిలో ఎన్నడూ డీమ్యాట్ ఖాతాలు ప్రారంభం కాలేదు.
ఇది లెక్క
* 2017 సంవత్సరంలో 25 లక్షలు, 2018 సంవత్సరంలో 35 లక్షల కొత్త డీమ్యాట్ ఖాతాలను ఇన్వెస్టర్లు తెరిచారు.
* 2011లో డీమ్యాట్ ఖాతాల సంఖ్య 1.89 కోట్లకు పైగా ఉంది.
* డైరెక్ట్ మార్కెట్ ఇన్వెస్ట్ మెంట్లు, మ్యూచువల్ ఫండ్స్ కొనుగోళ్లు, ఎన్సీడీలు కొనే వారు కూడా ఎక్కువవుతున్నారు.
* దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో ఎక్కువ మంది స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు ఉంటున్నారు. తర్వాతి స్థానాల్లో ఐటీ కి కేంద్రాలుగా మారిన బెంగళూరు, హైదరాబాద్ ఉండటం విశేషం.
* ఈక్విటీ మార్కెట్లో హైదరాబాద్ వాటా 2013 ఆర్ధిక సంవత్సరంలో 1.4 శాతం ఉండేది. ఇప్పుడిది 3.3 శాతానికి పెరిగింది.
ఎందుకిలా?
* ఎన్నికల సంవత్సరం కాబట్టి దేశీయ స్టాక్ మార్కెట్లో తీవ్ర ఒడిదొడుకులు నమోదయ్యాయి. మొత్తంగా చూస్తే గత జూన్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు మార్కెట్లు కేవలం ఏడూ శాతం వృద్ధిని నమోదు చేసుకున్నాయి.
* గత అయిదేళ్ల కాలాన్ని పరిశీలిస్తే ఇతర ఆస్తుల్లో పెట్టుబడులకన్నా స్టాక్ మార్కెట్ పెట్టుబడుల్లోని ఎక్కువ వృద్ధి కనిపించడం వల్ల ఇన్వెస్టర్లు ఈ మార్కెట్ వైపు మళ్లుతున్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
* గత ఐదేళ్లలో రియల్ ఎస్టేట్ గానీ బంగారం గానీ అంతగా రాబడులను పెంచలేక పోయాయి.
* 2016 నుంచి చూస్తే సెన్సెక్స్ 70 శాతం పెరిగింది. అప్పటినుంచి లెక్కిస్తే కనీసం 20 శాతం వార్షిక రిటర్న్ ఇచ్చినట్టే.