ప్రధాని మోడీకి అతిపెద్ద సవాల్: మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థను ఎలా డీల్ చేస్తారు: ఫిక్కీ
భారత్లో ఆర్థిక వ్యవస్థ మందగించడం ఆందోళన కలిగిస్తోంది. తిరిగి ఆర్థిక వ్యవస్థ గాడిలో పడాలంటే ప్రభుత్వం వెంటనే పన్నులను ఇతర వడ్డీరేట్లపై కోత విధించాల్సిందే అని ఓ పారిశ్రామిక సంస్థ తెలిపింది. గతేడాది డిసెంబర్ నాటికి ఆర్థిక వ్యవస్థ కేవలం 6.6 శాతం మాత్రమే వృద్ధిని నమోదు చేసుకుంది. ఐదు త్రైమాసికాలకు గాను ఇది చాలా తక్కువనే చెప్పాలి. అంతేకాదు దేశీయ వినియోగం కూడ వేగంగా పుంజుకోలేకపోవడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత ఆర్థిక వ్యవస్త నిలదొక్కుకోలేక పోయిందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ట్రీ పేర్కొంది.
మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థ
ఈ మధ్యకాలంలో ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్నాయన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందుకు కారణం పెట్టుబడులు మందగించడం, వినియోగ డిమాండ్ క్షీణించడం వంటివి కారణంగా కనిపిస్తున్నాయని ఎఫ్ఐసీసీఐ తెలిపింది.ఈ క్రమంలోనే మరో నెలలో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెడుతున్నందున ఫిక్కీ పలు సూచనలు ప్రభుత్వానికి చేసింది. మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థతో భారత్ ప్రమాదంలో పడే అవకాశముందన్న ఫిక్కీ...ఇప్పుడు కనుక జాగ్రత్త చర్యలు తీసుకోకుంటే దీర్ఘకాలంలో దీని ప్రభావం చాలా అధికంగా ఉంటుందని అభిప్రాయపడింది.
వ్యవసాయ రంగంలో ఆర్థిక ఇబ్బందులు
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ అఖండ విజయాన్ని సాధించింది. వ్యవసాయ రంగంలో ఆర్థిక ఇబ్బందులు, పూర్తి స్థాయిలో లేని ఉద్యోగాలు, ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులు లాంటి సమస్యలు ఉన్నప్పటికీ బీజేపీ ఘన విజయం సాధించింది. అయితే ఈ సమస్యలను అధిగమించేందుకు సరైన ఆర్థిక శాఖ మంత్రి అవసరం అని ఫిక్కీ భావిస్తోంది. అంతేకాదు తగ్గిన పారిశ్రామిక ఉత్పత్తి, తయారీ వృద్ది , కార్లు మరియు ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో తగ్గుదల, విమానంలో ప్రయాణికుల ట్రాఫిక్ తగ్గడంలాంటివి ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఫిక్కీ పేర్కొంది.
పన్నులు, వడ్డీ రేట్లు తగ్గిస్తే కొంత ఉపశమనం
ఇక కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టాలంటే కార్పోరేట్ పన్నులతో పాటు వ్యక్తిగత పన్నులను తగ్గించాలని, అదేసమయంలో రైతులకు ఏడాదికి రూ.6వేలు అందిస్తే వినియోగ డిమాండ్ పెరిగేందుకు ఇది దోహదపడుతుందని ఫిక్కీ సూచించింది. ఇక ఆర్థిక వ్యవస్థ బలపడాలంటే ఆదాయపు పన్ను తగ్గించి, అన్నిరంగాల్లో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించి ఎగుమతి దారులకు ఇన్సెంటివ్లను ప్రకటిస్తే బాగుంటుందని సూచించింది కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అనే మరో సంస్థ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వడ్డీ రేట్లను తగ్గించాలని ఫిక్కీ పేర్కొంది.2014లో మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు నాడు ఆయిల్ ధరలు తగ్గిపోయాయని కానీ రెండో సారి ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్న సమయంలో చమురు ధరలు తారాస్థాయికి చేరుకుంటున్నాయని ఫిక్కీ గుర్తు చేసింది. ఇది కచ్చితంగా ఇబ్బందుల్లోకి నెడుతుందని అభిప్రాయం ఫిక్కీ వ్యక్తం చేసింది.
ఇప్పటికే అమెరికా చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్దం ప్రభావం కచ్చితంగా భారత ఎగుమతులపై పడే అవకాశం ఉందని ఫిక్కీ చెబుతోంది. ఇన్ని ఇబ్బందుల మధ్య ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయాలంటే ఇందుకు మూలాలైన కొన్ని అంశాలను సీరియస్గా పరిగణించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఫిక్కీ భావిస్తోంది.ఇందుకు సరైన అవకాశం రానున్న బడ్జెట్ సమావేశాలే అని వెల్లడించింది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఫిక్కీ, ఇతర పారిశ్రామిక సంస్థలతో ప్రభుత్వం బడ్జెట్ పై చర్చలు ప్రారంభించింది.