ఎగుమతులు, విదేశీ పెట్టుపడులు..: 100రోజుల యాక్షన్ ప్లాన్
ప్రధాని నరేంద్ర మోడీ మే 30వ తేదీన రెండోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన పరిశ్రమల, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహకాల విభాగం (DPIIT) వంద రోజుల ప్రణాళికను ప్రతిపాదించిందని సమాచారం. ప్రతి ఏడాది 100 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలని భావిస్తున్నారు. ఇందుకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వియత్నాం వంటి దేశాల్లో కార్పోరేట్ పన్ను తక్కువగా ఉంటుంది. నాలుగున్నరేళ్ల పాటు పన్ను మినహాయింపు వంటివి ఉన్నాయి. మొత్తంగా విదేశీ పెట్టుబడుల ఆకర్షణ కోసం ప్రత్యేక ప్రోత్సాహకాలు, పద్ధతులతో ముందుకు వెళ్లనున్నారు.
ప్రోత్సాహకాలతో పెట్టుబడులు
కేంద్ర, రాష్ట్ర పన్నులు, సుంకాల రీఫండ్ ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా ఎగుమతులకు తోడ్పాటునిచ్చే దిశగా ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టాలని చూస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎగుమతుల వృద్ధికి ఇది తోడ్పడుతుందని భావిస్తున్నారు. ఇందులో భాగంగా వాణిజ్య శాఖ 100 రోజుల అజెండాలో 10 సూత్రాల కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసింది. వాటిని రెండోసారి ఏర్పడనున్న మోడీ ప్రభుత్వానికి అందజేయనుంది. భారత్ మర్చంటైజ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ ఇండియా (MEIS) విధానంపై అమెరికా అసంతృప్తి వ్యక్తం చేస్తోన్న విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త స్కీం ప్రవేశపెట్టనున్నారని అధికారులు చెబుతున్నారు. దీనిని కేంద్ర, రాష్ట్ర పన్నులు, సుంకాల పథకంగా వ్యవహరించే అవకాశముందని చెబుతున్నారు. ఎలక్ట్రానిక్స్, తయారీ, రసాయనాలు, ఆహార ప్రాసెసింగ్ తదితర రంగాల్లో ప్రోత్సాహకాల వల్లే పెట్టుబడులు వస్తాయని అధికారులు చెబుతున్నారు.
కొత్త పథకం
అన్ని రంగాల ఎగుమతుల్లో వినియోగించిన ఇన్పుట్లపై విధించే ఆన్ రిబేటెడ్ సెంట్రల్, స్టేట్ లెవీలు, పన్నుల రీఫండ్స్ను వేగవంతంగా పొందే అవకాశం కల్పిస్తారు. కేంద్ర, రాష్ట్ర పన్నుల రీఫండ్లతో కూడిన పథకాన్ని ఇందులో పొందుపరిచింది. కొత్త పథకానికి సెంట్రల్ అండ్ స్టేట్ ట్యాక్సెస్ అండ్ లెవీస్ స్కీమ్గా పేరు పెట్టే అవకాశముందని చెబుతున్నారు. అన్ని రంగాల్లోని ఎగుమతులకు సంబంధించిన ముడిపదార్థాలపై విధించే రిబేట్ లేని కేంద్ర, రాష్ట్ర సుంకాలు, పన్నులన్నింటికి రిఫండ్ లభించేలా కొత్త పథకం చూస్తుంది.
మరిన్ని ప్రతిపాదనలు
వాణిజ్య శాఖ ముఖ్యంగా పది ప్రతిపాదనలు చేసింది. ప్రోత్సాహక పన్ను విధానం, ఉద్యోగాల సృష్టి, చిన్న వ్యాపారులకు మద్దతు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు వంటివి ఉన్నాయి. పెట్రోలియం ఉత్పత్తులు, సహజ వాయువు, విద్యుత్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ప్రతిపాదించారు. అలాగే, కార్పోరేట్ వ్యాపారేతర సంస్థలకు విడి పన్ను కూడదని చెబుతున్నారు. గవర్నమెంట్ ఈ-మార్కెట్ ప్లేస్ పోర్టల్కు విస్తృత ప్రచారం కల్పించడం, ఎస్ఈజెడ్ పునరుద్ధన చర్యలు ఉన్నాయి. జాతీయ రవాణా విధానం, మల్టీమోడల్ రవాణా విధానం, ఏకీకృ,త జాతీయ రవాణా ప్రణాళిక పథకం వంటి వాటిని తీసుకురావాలని భావిస్తున్నారు. మరోవైపు, WTOకు సమ్మతించేలా ఓ ఉత్పత్తి ఆధారిత మద్దతు పథకాన్ని మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఎలక్ట్రానిక్స్, టెలికాం, హైటెక్ ఇంజినీరింగ్, వైద్య పరిరాలు, ఔషధ, జౌళి తదితరాల ఎగుమతి ఆధారిత రంగాలకు ఉద్దేశించిన ఈ స్కీంపై అన్ని వర్గాల స్పందనను వాణిజ్య విభాగం కోరుతోంది.