సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అమెరికా షాకిచ్చింది! ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతులు మే 2వ తేదీలోపు పూర్తిగా ఆపేయాలని భారత్, చైనా సహా ఎనిమిది దేశాలకు అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. భారత్ ప్రత్యామ్నాయాలు పరిశీలిస్తోంది. అయితే ముందుముందు ఈ ప్రభావం ఎలా ఉంటుందనే ఆందోళన ఉంది. ట్రంప్ చర్య ఎనిమిది దేశాలకు ఇబ్బందికరంగా మారింది. దేశంలో కొద్ది రోజుల క్రితం ఆయిల్ ధరలు చర్చనీయాంశంగా మారాయి. అంతర్జాతీయ మార్కెట్ను అనుసరించి ఈ ధరల్లో పెరుగుదల, తగ్గుదల ఉంటోంది. అయితే గత కొన్ని నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయిల్ ధరల సంక్షోభం ఇది రెండోసారి. ఇప్పుడు ఏకంగా ఎన్నికల సమయంలో ధరల సంక్షోభం నెలకొంది. ఇందుకు కారణం డొనాల్డ్ ట్రంప్!

ఇండియాకు ఊహించని దెబ్బ.. రూపాయి బలహీనపడొచ్చు
మే 2వ తేదీలోపు ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతులు ఉండకూడదని ట్రంప్ హెచ్చరికలపై భారత్ తర్జన భర్జన పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రభావం పడనుంది. అప్పుడు క్రూడాయిల్ ధర బ్యారెల్కు 80-85 డాలర్లకు పెరగవచ్చునని అంచనా వేస్తున్నారు. అమెరికా ఆదేశాలు ఆయిల్ దిగుమతి చేసుకునే దేశాలకు తీవ్ర ఆందోళనకరంగా మారింది. ఉదాహరణకు ఆయిల్ బ్యారెల్కు 74.51 డాలర్ల వద్ద ఉంటోంది. గత ఏడాది డిసెంబర్ 31వ తేదీన ఇది 54.57 డాలర్లుగా ఉంది. 37 శాతం పెరిగింది. అమెరికా ఆదేశాల నేపథ్యంలో ఇది 80 డాలర్లు దాటవచ్చునని అంటున్నారు. ఇరాన్ నుంచి గత ఏడాది 24 మిలియన్ టన్నుల క్రూడాయిల్ భారత్ దిగుమతి చేసుకుంది. ఇరాన్ ఆయిల్తో మనకు చాలా లాభాలు ఉన్నాయి. 60 రోజుల క్రెడిట్ ఫ్రీ, ఫ్రీ ఇన్సురెన్స్, షిప్పింగ్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి. అమెరికా ఆంక్షలతో ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు పెరిగితే అది మన రూపాయిపై కూడా ప్రభావం పడుతుంది. డాలర్కు డిమాండ్ పెరగడం వల్ల రూపాయి బలహీనమవుతుంది. ఈ ప్రభావం భారతీయ మార్కెట్లకు తగులుతుంది.

రూపాయిపై డాలర్ ప్రభావం ఎలా అంటే?
ఆయిల్ సంక్షోభం నేపథ్యంలో డాలర్కు డిమాండ్ పెరిగితే.. ఆయిల్ ధరలు ఒక డాలర్ పెరిగితే అప్పుడు మన దిగుమతుల బిల్లు రూ.10,500 కోట్లు ఎక్కువ అవుతుందట. అదే కనుక 4 నుంచి 5 డాలర్లు పెరిగితే మరింత సమస్య అవుతుంది. ఇది భారత్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ (సీఏడీ)పై ప్రభావం చూపుతుంది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇప్పుడు లేదా ముందు ముందు చమురు ధరలు పెరగడం మాత్రం ఖాయమని అంటున్నారు. అమెరికా చమురు ధరల స్థిరీకరణకు ప్రయత్నాలు చేసినప్పటికీ పెరగడం మాత్రం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
భారత్ ఇంధన అవసరాలు 80 శాతానికి పైగా విదేశీ దిగుమతుల ద్వారానే తీరుతోంది. ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్న క్రూడాయిల్ మొత్తం భారత్ ముడి చమురు దిగుమతుల్లో పదో వంతుగా ఉంది. సౌదీ అరేబియా, ఇరాక్ల తర్వాత ఇరాన్ నుంచే భారత్కు ఎక్కువ ముడి చమురు వస్తోంది. పెరిగే ఇంధన ధరలు దేశ ఆదాయ,వ్యయాలను భారీగా ప్రభావితం చేస్తాయని అంటున్నారు. పెట్రో ఉత్పత్తులపై అధిక పన్నుల కారణంగా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని, అలాగే రవాణా ఖర్చులు పెరిగి వ్యయం కూడా మితిమీరుతుందని హెచ్చరిస్తున్నారు. పాత పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాల ప్రభావం నుంచి కోలుకుంటున్న భారత జీడీపీని అమెరికా ఆంక్షలు మళ్లీ దిగజార్చుతాయనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికల తర్వాత ట్రంప్ నిర్ణయం ప్రభావం
దేశంలో ప్రస్తుతం ఎన్నికలు ఉన్నందున మే 2వ తేదీన ట్రంప్ తీసుకునే నిర్ణయం ప్రభావం అప్పటికప్పుడు కనిపించకపోవచ్చునని, కానీ దేశీయ మార్కెట్లపై మాత్రం ఈ ప్రభావం కచ్చితంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మార్చి 10వ తేదీ నుంచి అంటే ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభం నుంచి ఢిల్లీ, కోల్కతా, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి పట్టణాల్లో పెట్రోల్ ధరలు కేవలం 40 నుంచి 45 పైసలు మాత్రమే పెరిగింది. డీజిల్ ధరలు పెరగలేదు. కానీ ప్రపంచమార్కెట్లో బ్యారెల్ చమురు ధర మాత్రం 7 డాలర్లు పెరిగింది. ఈ ప్రభావం ఎన్నికల అనంతరం ఉంటుందని భావిస్తున్నారు. గత ఏడాది కర్నాటక ఎన్నికల సమయంలో వరుసగా 19 రోజులు పెట్రోల్, డీజిల్ రేట్లలో మార్పు లేదు. కానీ ఎన్నికల తర్వాత వరుసగా 16 రోజులు పెరిగింది. రూ.3 రూపాయలకు పైగా పెరిగింది. 2017లో గుజరాత్ ఎన్నికల సమయంలోను ఇలాగే జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు పూర్తయ్యే మే 19 లేదా ఫలితాలు వచ్చే మే 23న ధరలు పెరగవచ్చునని అంటున్నారు.

భారత్ సహా పలు దేశాలను కుదిపేయనుందా?
ట్రంప్ నిర్ణయం భారత్ వంటి చమురు దిగుమతి ఆధారిత దేశాల ఆర్థిక వ్యవస్థల్ని పెద్ద ఎత్తున కుదిపేయనున్నాయని భావిస్తున్నారు. కరెంట్ ఖాతా లోటు, డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనం, ద్రవ్యోల్బణం వంటి వాటికి దారి తీయవచ్చని కేర్ రేటింగ్స్ అభిప్రాయపడింది.
మెజారిటీ ఇంధన అవసరాలు దిగుమతుల ద్వారానే తీరుతున్న నేపథ్యంలో సహజంగానే దేశ ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయ నిర్ణయాల ప్రభావం ఉంటుంది. ఈ క్రమంలో స్వదేశీ ఇంధన వనరుల వినియోగంపై దృష్టి పెట్టాలని, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని నిపుణులు అంటున్నారు. ఇరాన్ క్రూడ్ పై ఆధారపడటం తగ్గించి, ఇతర దేశాల నుంచి పెంచుకోవాలని, దేశీయంగా ఉత్పత్తినీ వృద్ధి చేసుకోవాలని నిపుణులు అంటున్నారు.
More From GoodReturns

యుద్ధాన్ని వదిలి బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..

భారత్ టైర్ పరిశ్రమను కుదిసేస్తున్న ఇరాన్ యుధ్ద ప్రభావం.. కీలకమైన హెచ్చరిక చేసిన CLSA

Iran war: ఇరాన్లో హై అలర్ట్: ఖమేనీ అంత్యక్రియలు వాయిదా.. ఏం జరుగుతోంది?

Iran war: ఇరాన్ సంచలన నిర్ణయం.. అణు బాంబు తయారీ ఆపేస్తాం! కానీ ఆ ఒక్క కండిషన్!

ఇరాన్ మీద దాడులు.. బట్ట బయలైన అమెరికా కుట్రలు.. ప్రపంచానికి నిజాన్ని తెలిపిన స్పెయిన్..

ఇరాన్పై యుద్ధంతో ఖాళీ అవుతున్న అమెరికా ఖజానా.. తొలి 24 గంటల్లోనే రూ. 7 వేల కోట్లకు పైగా ఖర్చు..

మిత్రుడిని అమెరికా చంపేస్తుంటే మౌనంగా చూస్తుండిపోయిన చైనా.. సైలెంట్ వెనక మిస్టరీ ఇదే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

భారత ఆర్థిక వ్యవస్థని కుదిపేస్తున్న గల్ఫ్ యుద్ధ మంటలు.. ప్రమాదంలో 9 కోట్ల మంది పంపే డబ్బు ..

ఎర్ర సముద్రంలో కల్లోలం..భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్..తడిసిమోపెడవుతున్న ఛార్జీలు..

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications