వరుసగా ఏడో వారమూ లాభాల్లోనే ముగింపు!
వారాంతంలో స్టాక్ మార్కెట్లు మళ్లీ లాభాల బాట పట్టాయి. వరుసగా ఏడో వారం కూడా లాభాల్లో ముగియడం 14 నెలల తర్వాత మళ్లీ ఇప్పుడే చూస్తున్నాం. సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత మార్కెట్లో ఒక్కసారిగా మొమెంటం మారిపోవడం, కనిష్ట స్థాయిల నుంచి అత్యంత వేగంగా సూచీలు పుంజుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. విదేశీ నిధులు వెల్లువలా మన మార్కెట్లోకి రావడం కూడా కలిసొచ్చింది. ఇక ఈ రోజు ప్రైవేట్ బ్యాంక్స్ నిఫ్టీ బ్యాంక్ను ముందుకు నడిపిస్తే, హెచ్ డి ఎఫ్ సి ట్విన్స్ నిఫ్టీని దౌడు తీయించాయి. చివరకు నిఫ్టీ 68 పాయింట్లు లాభపడి 11,666 దగ్గర క్లోజైంది. సెన్సెక్స్ 177 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 180 పాయింట్లు లాభపడ్డాయి.
పీఎస్యూ బ్యాంక్స్, ఎఫ్ ఎం సి జి మినహా ఈ రోజు అన్ని రంగాల కౌంటర్లలోనూ కొనుగోళ్లతో కళకళలాడాయి. ప్రధానంగా ఐటీ, మెటల్, రియాల్టీ రంగ కౌంటర్లకు అధిక కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రైవేట్ బ్యాంక్ స్టాక్స్ కూడా తమ వంతు లాభాలను పంచాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1 శాతం, స్మాల్ క్యాప్ 0.88 శాతం మెరుగైంది.
టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, వేదాంతా, ఐషర్ మోటార్స్ టాప్ 5 గెయినర్స్గా నిలిచాయి. బ్రిటానియా, పవర్ గ్రిడ్, ఎస్బీఐ, జీ ఎంటర్టైన్మెంట్, హీరో మోటో కార్ప్ లూజర్స్ జాబితాలో ఉన్నాయి.
లక్ష్మీవిలాస్ బ్యాంక్ - ఐబీ హౌసింగ్ జట్టు
ఐబీ హౌసింగ్ - లక్ష్మీ విలాస్ బ్యాంక్ మధ్య విలీన చర్చలు నడుస్తున్నాయనే వార్తలు ఈ స్టాక్స్లో కొద్దిగా కదలిక తెచ్చాయి. వాస్తవానికి గత కొద్ది రోజుల ఈ రెండు స్టాక్స్ 50 శాతం వరకూ పెరిగాయి. అయితే ఇప్పుడు ఈ విలీన చర్చల విషయం బయటకు పొక్కింది. అయితే దీనిపై ఇరు సంస్థలూ నోరుమెదపలేదు. ఐబీ హౌసింగ్ స్టాక్లో పెద్దగా మార్పు లేకపోయినప్పటికీ, లక్ష్మీవిలాస్ బ్యాంక్ స్టాక్ మాత్రం 5 శాతం లాభపడింది.
జ్యోతీ ల్యాబ్స్ మెరుపు
ప్రముఖ రీసెర్చ్ అండ్ బ్రోకరేజ్ సంస్థ మాక్వెరీ.. జ్యోతీ ల్యాబ్స్ స్టాక్పై కవరేజ్ను ఇనిషియేట్ చేయడంతో పాటు ఔట్పర్ఫార్మ్ రేటింగ్ ఇచ్చి తన టార్గెట్ను రూ.250కి పెంచింది. దీంతో ఈ స్టాక్ ఈ రోజు 6.2 శాతం లాభపడి రూ.194 దగ్గర క్లోజైంది.
త్రివేణీ అప్పర్ సర్క్యూట్
రాజమండ్రి యూనిట్ను అమ్మేసేందుకు బోర్డ్ అంగీకరించిన నేపధ్యంలో త్రివేణి గ్లాస్ స్టాక్ 5 శాతం అప్పర్ సీలింగ్ దగ్గర లాక్ అయింది. అలహాబాద్ ప్లాంట్లో కూడా కొద్ది భూమి అమ్మకానికి పెట్టామని, ఇది పూర్తైతే రుణరహిత కంపెనీ అవుతుందని యాజమాన్యం తెలిపింది. ఈ స్టాక్ ఇంట్రాడేలో రూ.4.94 శాతం లాభపడి రూ.12.31 దగ్గర క్లోజైంది.
జెట్కు ఫ్యూయల్ కట్
తమకు బకాయిపడిన సొమ్మును వెంటనే తీర్చకపోతే ఈ రోజు నుంచి ఏటీఎఫ్ సరఫరాను కూడా నిలిపేస్తామని జెట్ ఎయిర్కు ఇండియన్ ఆయిల్ వంటి సంస్థలు అల్టిమేటం ఇచ్చాయి. వీటికి తోడు మరికొందరు రుణదాతలు కూడా విమానాలను నిలిపేసేందుకు సిద్ధపడ్తున్నారు. దీంతో ఈ స్టాక్ 1.5 శాతం నష్టపోయి రూ.256 దగ్గర క్లోజైంది.