వారాంతంలో నీరసం, నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్
ముంబై: వారాంతంలో స్టాక్ మార్కెట్లు నీరసించాయి. అంతకు ముందు వారమంతా భారీ లాభాలతో పరుగులు తీసి ఉత్సాహంతో ఉరకలేసిన సూచీలు మెల్లిగా సర్దుకుంటున్నాయి. వచ్చే వారం ఎఫ్ అండ్ ఓ ఎక్స్పైరీ ఉండడంతోపాటు కొద్దిగా ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగారు. ఈ రోజు సూచీలు భారీ నష్టాల్లో ఉన్నప్పటికీ వారం ప్రారంభంలో వచ్చిన లాభాలు మాత్రం నిలిచే ఉన్నాయి. కానీ నిఫ్టీ కీలకమైన 11500 పాయింట్ల సెంటిమెంట్ మార్కు దిగువకు పడిపోయింది. రూపాయి నీరసించడం, ఎఫ్ఐఐ నిధులు కాస్త మందగించడం, అమెరికాలో వృద్ధి అంతంతమాత్రంగా ఉండడం వంటివన్నీ మార్కెట్లను కిందపడేశాయి.
లాభాల్లో స్టాక్ మార్కెట్లు: బలపడిన రూపాయి, 13పైసలు పెరిగి రూ. 68.70 వద్ద ప్రారంభం
అయితే వరుసగా ఐదో వారమూ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీలు రికార్డ్ క్రియేట్ చేశాయి. చివరకు 222 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 38164 దగ్గర క్లోజైంది. నిఫ్టీ 64 పాయింట్లు కోల్పోయి 11456 వద్ద ముగిసింది.
ఎన్టీపీసీ, ఎల్ అండ్ టి, జెఎస్డబ్ల్యు స్టీల్, ఏషియన్ పెయింట్స్, హిందాల్కో టాప్ 5 గెయినర్స్గా నిలిచాయి. ఇన్ఫ్రాటెల్, టాటా మోటార్స్, బిపిసిఎల్, హెచ్ పి సి ఎల్, రిలయన్స్ స్టాక్స్ లూజర్స్ జాబితాలో చేరాయి.
బ్యాంక్ నిఫ్టీ 30కె రికార్డ్: బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు ఇంట్రేడాలో 30,008 పాయింట్ల ఆల్ టైం హై మార్కును తాకింది. మొదటిసారి 30 వేల పాయింట్ల మార్కును క్రాస్ చేసిన నిఫ్టీ బ్యాంక్ ప్రారంభ లాభాలను నిలబెట్టుకోలేకపోయింది. వరుసగా మూడు వారాల నుంచి జోరు మీదున్న సూచీల్లో అనూహ్యమైన ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. దీంతో గరిష్ట నుంచి ఏకంగా 400 పాయింట్లు కోల్పోయింది. ప్రధానంగా బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి స్టాక్స్ 4 శాతానికి పైగా కోల్పోయాయి. చివరకు 250 పాయింట్స్ నష్టంతో 29582 దగ్గర క్లోజైంది.
రియాల్టీ తప్ప: ఈ రోజు ట్రేడ్లో ఒక్క రియాల్టీ ఇండెక్స్ మినహా అన్ని సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. ప్రధానంగా మీడియా, పీఎస్యూ బ్యాంక్స్, ఆటో, ఫార్మా రంగ కౌంటర్లలో అమ్మకాల ఒత్తిడి నమోదైంది. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు కూడా 1 శాతం వరకూ నష్టపోయాయి.
టైటాన్ విలువ రూ. లక్ష కోట్లు: ప్రముఖ జ్యువెలర్, వాచ్ తయారీ కంపెనీ టైటాన్ మార్కెట్ విలువ సుమారు రూ.లక్ష కోట్లకు చేరువైంది. ఇంట్రాడేలో స్టాక్ రూ. 1124 ఆల్ టైం హై మార్కును తాకింది. కానీచివర్లో వచ్చిన లాభాల స్వీకరణ దెబ్బతో స్టాక్ పావు శాతం నష్టపోయి రూ.1104 దగ్గర క్లోజైంది.
ఫెడరల్ మొగుల్కు ఓపెన్ ఆఫర్ దెబ్బ: యూఎస్కు చెందిన టెన్నికో సంస్థ.. ఓపెన్ ద్వారా ఫెడరల్ మొగుల్లో 25.02 శాతం వాటాను కొనుగోలు చేయాలని భావించింది. అయితే ఇందుకు సెబీ రూ.608.46 ధరను నిర్ణయించింది. చివరి ట్రేడింగ్ సెషన్ ధరతో పోలిస్తే 6 శాతం ఎక్కువగా ధరను నిర్ణయించింది. దీన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోని మార్కెట్లు, చివరకు స్టాక్ 3.63 శాతం నష్టపోయి రూ.555 దగ్గర క్లోజైంది.
స్పైస్ జెట్ ఫ్లయింగ్ కలర్స్: జెట్ ఎయిర్ ఫ్లైట్స్ నానాటికీ తగ్గిపోవడం, రుణాల దెబ్బతో విమానాలు హ్యాంగర్లకే పరిమితం కావడం స్పైస్ జెట్కు కలిసొస్తోంది. వీటికి తోడు ఆగిన విమానాలను స్పైస్ జెట్కు ఇచ్చి వ్యాపారాన్ని నిర్వహింపజేసే యోచనలో కేంద్రం ఉన్నట్టు వార్తలొచ్చాయి. వీటితో స్టాక్ 7 శాతం పెరిగి రూ.98.10 దగ్గర క్లోజైంది. నాలుగో రోజు కూడా స్టాక్ లాభపడి 8 నెలల గరిష్టానికి చేరడం గమనించాల్సిన అంశం.
జీఎస్టీ నిబంధనలు, రీట్స్ కలిసొచ్చాయి: రియల్ ఎస్టేట్కు జీఎస్టీ విషయంలో ఈ మధ్య కౌన్సిల్ కొన్ని నిబంధనలను సడలించడం ఈ రంగ స్టాక్స్కు కలిసొస్తోంది. ప్రెస్టేజ్ ఎస్టేట్స్ ఏకంగా ఈ రోజు కూడా లాభపడి 6 శాతం గెయిన్స్తో రూ.268 దగ్గర క్లోజైంది. ఒబెరాయ్ రియాల్టీ 4 శాతం, గోద్రెజ్ ప్రాపర్టీస్ 3.5 శాతం పెరిగాయి. అయితే ఇదే రంగానికి చెందిన ఐబీ రియల్ ఎస్టేట్ మాత్రం 7 శాతం నష్టపోయింది.
లాభాల స్వీకరణ: గత రెండు వారాల నుంచి భారీగా పెరిగిన స్టాక్స్లో ఈ రోజు లాభాల స్వీకరణ నమోదైంది. వాటిల్లో ముఖ్యంగా సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్లో 7 శాతం, దిలీప్ బిల్డ్ కాన్ 6 శాతం, సిండికెట్ బ్యాంక్ 4 శాతం, జెఎం ఫైనాన్స్ 3.5 శాతం నష్టపోయాయి. స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో విఏ టెక్ వాబాగ్ 6 శాతం, సీక్వెంట్ సైంటిఫిక్ 6 శాతం, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ 6 శాతం నష్టపోయాయి. వీటికి తోడు అనిల్ అంబానీ గ్రూప్ స్టాక్స్లో ఒక్క రిలయన్స్ కమ్యూనికేషన్స్ మినహా మిగిలిన అన్ని స్టాక్స్ 5 శాతం వరకూ కోల్పోయాయి.