గోల్డ్ స్కీములపై కొత్త చట్టం.. ! 12 నెలలు దాటి డిపాజిట్లు చేస్తే వాటి పనంతే ..
హైదరాబాద్ : గోల్డ్ స్కీమ్. ప్రస్తుతం మిడిల్ క్లాస్ జనాలను అత్యధికంగా ఆకర్షిస్తున్న స్కీమ్. వివిధ జ్యూవెల్లరీ సంస్థలు ఆఫర్ చేస్తున్న ఈ పథకాలతో గోల్డ్ కొనాలనుకునే వాళ్లకు నిజంగా ఓ మంచి ఆప్షన్. పిల్లల పెళ్లిళ్లు సహా వివిధ కార్యక్రమాలకు ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు కట్టి గోల్డ్ కొనలేని వాళ్లు.. ఈ పథకం ద్వారా గోల్డ్ను జమ చేసుకుని ఒకేసారి తీసుకుంటారు. వాస్తవానికి అతిపెద్ద జ్యువెల్లరీ సంస్థలకు కూడా ఈ స్కీములు మంచి వ్యాపారాన్ని తెచ్చిపెడ్తాయి. అయితే తాజాగా వచ్చిన ఓ కొత్త ఆర్డర్ జనాలను - కంపెనీలనూ ఇరకాటంలో పడేస్తోంది.
కొత్త ఆర్డర్ ఏంటీ ?
కొత్తగా వచ్చిన ఆర్డర్ ప్రకారం గోల్డ్ జ్యువెల్లరీ సంస్థలు గోల్డ్ స్కీమ్లో భాగంగా 12 నెలలకు మించి డబ్బులు వసూలు చేయడానికి లేనేలేదు. 365 రోజులలోపే కస్టమర్లకు జ్యువెల్లరీని ఇచ్చేయాలి. అంతకు మించి ఒక్క రోజు కూడా వాళ్ల దగ్గర జ్యువెల్లరీని హోల్డ్ చేయడానికి వీల్లేదని సదరు ఫెడరల్ ఆర్డర్ చెబుతోంది.
అన్రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్స్ యాక్ట్ 2019 ప్రకారం ఒక్క నెల డబ్బులను సంస్థ యాజమాన్యం చెల్లించే పద్ధతికి కూడా పుల్ స్టాప్ పెట్టాల్సి ఉంది. ఒక వేళ 12నెలలకు మించి గోల్డ్ స్కీమ్ కొనసాగించినా, లేకపోతే ఒక నెల వాయిదా డబ్బును కంపెనీ యాజమాన్యం చెల్లించినా కొత్త యాక్ట్ పరిధిలోకి వాళ్లు వస్తారు. అప్పుడది చట్టరీత్యా నేరంగా పరిగణిస్తారు.
చట్టం ఏం చెబుతోంది
బంధువుల దగ్గరి నుంచి ఏ ఇతరుల దగ్గరి నుంచి డిపాజిట్లను సేకరించడానికి వీల్లేదు. అయితే ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెల్లరీ కౌన్సిల్ లెక్క మాత్రం మరోలా ఉంది. భవిష్యత్తులో కొనబోయే ఓ వస్తువుకు ముందస్తు కిస్తీని వాళ్లు కడ్తున్నారని, ఇది ఎటువంటి పరిస్థితుల్లోనూ డిపాజిట్ కాదనేది వాళ్ల మాట.
ఇప్పుడేం ఏం చేయాలి
కొత్తగా అమల్లోకి రాబోతున్న ఆర్డినెన్స్ ప్రకారం 12 నెలలకులోపు ఉన్న గోల్డ్ స్కీమ్స్నే చూడండి. ఆ పైన స్కీమ్ వాళ్లు కొనసాగిస్తే మీ డబ్బుకు గ్యారెంటీ ఉండబోదు. అంతే కాదు సదరు జ్యువెల్లరీ సంస్థ మీకు ఒక నెల డబ్బును వాళ్లే ఫ్రీగా చెల్లించే పద్ధతి ఉన్నా కూడా జాగ్రత్తగా ఉండండి. ప్రస్తుతం కొన్ని సంస్థలు మీరు 11 నెలలు కడితే వాళ్లు 12వ నెలను బోనస్గా ఇచ్చి మీకు గోల్డ్ ఇస్తారు. ఇంకొంత మంది 12 నెలలపాటు మీరు చెల్లిస్తే.. 13 నెల డబ్బును వాళ్లు చెల్లించి గోల్డ్ను ఇస్తారు. ఇప్పుడు ఇవన్నీ చట్టం ముందు నిలబడవు. 12 నెలలలోపే గోల్డ్ స్కీమ్ ముగియాలి.. అందులోనూ వాళ్లూ ఎలాంటి ఫ్రీ స్కీమ్నూ ప్రకటించకూడదు.
కేంద్రం తెచ్చిన ఈ కొత్త ఆర్జినెన్స్ నేపథ్యంలో జ్యువెల్లరీ కంపెనీలు కూడా తమ బుర్రలకు పదును పెట్టాయి. చట్టానికి లోబడి ఉన్న మార్గాలను వెతుకుతూ మరో తరహాలో స్కీమ్లను లాంఛ్ చేయడానికి చూస్తున్నాయి. ఎందుకంటే ఇంత పెద్ద మాస్ మార్కెట్ను పోగొట్టుకోవడం ఎవరికీ ఇష్టం ఉండదు కదా.. !!