ఓపెన్ ఆఫర్లతో జాగ్రత్త: ట్విట్టర్లో సెబీ ట్వీట్
న్యూఢిల్లీ: షేర్ల కొనుగోలు కోసం కంపెనీలు ప్రకటించే ఓపెన్ ఆఫర్లపై అప్రమత్తంగా వ్యవహరించాలని మదుపర్లకు, మార్కెట్ నియంత్రణ సంస్ధ సెబీ సూచించింది. స్టాక్ ఎక్సెంజ్ల నుంచి ఏదైనా లిస్టెడ్ కంపెనీని టెకోవర్ చేయాలన్నా, ఆ కంపెనీ షేర్లను డీలిస్ట్ చేయాలన్నా, వాటాదారుల నుంచి షేర్లు కోనుగోలు చేయాలన్నా ఓపెన్ ఆఫర్ ప్రకటించాల్సి ఉంటుంది.
కంపెనీలు ఈ విషయాన్ని పత్రికల్లో ప్రకటించడంతో పాటు స్టాక్ ఎక్సేంజ్ల్లో తెలపాలి. షేర్ల డీ లిస్టింగ్, ఓపెన్ ఆఫర్లు ఆ కంపెనీల వాటాదారుల ప్రయోజనంపై పెద్ద ప్రభావం చూపించే అవకాశం ఉన్నందున ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సెబి ట్వీట్ చేసింది.
ఏదైనా నమోదిత సంస్ధలో ఎవరైనా 25 శాతం వాటా కోనుగోలు చేస్తే, అదనంగా మరో 26 శాతం వాటాను ఓపెన్ ఆఫర్ ప్రకటించి జనరల్ పబ్లిక్ నుంచి కొనుగోలు చేయాలి. అంతేకాదు లిస్టెడ్ కంపెనీని డీ లిస్ట్ చేయాలంటే కనీసం 25 శాతం మంది మైనారిటీ వాటాదారులు సైతం అందులో పాల్గొనాలా ప్రమోటర్లు చర్యలు తీసుకోవాలి.
లేకపోతే కంపెనీకి చెందిన 100 శాతం వాటాదారులను సంప్రదించినట్లు రుజువులు చూపాలి. దీంతో పాటు ‘మా పథకాల్లో ఇన్వెస్ట్ చేయండి. అత్యధిక రాబడులతో తక్కువ కాలంలోనే కోటీశ్వరుల కండి' అని వచ్చే ప్రకటనలపైనా జాగ్రత్తగా ఉండాలని సెబి హెచ్చరించింది.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శారదా కుంభకోణం వెలుగులోకి వచ్చాక కూడా దేశంలో ఇంకా చాలా కంపెనీలు ఇలాంటి పథకాల పేరుతో పెట్టుబడిదారుల నుంచి వేల కోట్ల రూపాయలు సేకరంచాయని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెబీ మరోసారి మదుపరులను అప్రమత్తం చేసింది.
మోసపూరిత ప్రకటనల ద్వారా, వేల కోట్ల రూపాయలును ఆయా సంస్ధలు సమీకరిస్తున్న నేపథ్యంలో సెబీ ఈ హెచ్చరికలు చేసింది. అంతేకాదు అప్పు చేసి స్టాక్ మార్కెట్లో మదుపు చేయవద్దని ఇటీవలే ట్విట్టర్ మదుపరులను ఉద్దేశించి ట్వీట్ చేసింది.