గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్: బ్యాంకులో డిపాజిట్ చేసిన బంగారానికి వడ్డీ
దేశంలోని ప్రజల వద్ద పెద్ద మొత్తంలో ఉన్న బంగారాన్ని వినియోగంలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా గోల్డ్ మానిటైజేషన్ పథకాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ పథకం ద్వారా బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసి, వడ్డీ పొందొచ్చు. అంతేకాదు మీకు వచ్చిన వడ్డీకి పన్ను మినహాయింపు కూడా ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రతిపాదించింది.
ఇందుకు సంబంధించిన మార్గదర్శక సూత్రాలను ఆర్ధిక శాఖ విడుదల చేసింది. ఈ పథకం అమలు చేయడంలో బ్యాంకులు కీలకపాత్ర పోషించనున్నాయి కాబట్టి వాటికీ కూడా రాయితీలను కల్పించనుంది. దీనిపై జూన్ 2 లోగా అటు ప్రజలను, ఇటు సంస్ధలను తమ అభిప్రాయాలను తెలపాల్సిందిగా కేంద్ర ఆర్ధిక శాఖ కోరింది.
గోల్డ్ మానిటైజేషన్ పథకం మార్గ దర్శకాలు:
* ఈ పథకం కింద దేశంలోని వ్యక్తులు, సంస్థలు తమ దగ్గరున్న బంగారంలో కనీసం 30 గ్రాములు లేదా అంతకు మించిన మొత్తాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేయవచ్చు. వీటిపై వచ్చే వడ్డీకి ఆదాయపు పన్ను, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లాంటివి ఉండవు.
* ఇందులో కోసం గాను తమ వద్ద ఉన్న నగల విలువను భారత ప్రమాణాల సంస్థ (బిఐఎస్) గుర్తింపు పొందిన ఏదైనా హాల్మార్క్ కేంద్రంలో వెల కట్టించి బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చు. బ్యాంకులో బంగారం సేవింగ్స్ ఖాతా ప్రారంభించి, డిపాజిట్ చేయాలి.
* బంగారం డిపాజిట్ చేయడానికి కాల వ్యవధి కనీసం ఏడాది. దీనిపై వచ్చే వడ్డీని సైతం బంగారం రూపంలో తీసుకోవచ్చు. కాకపోతే ఎలా తీసుకునేది డిపాజిట్ చేసే సమయంలో ఖాతాదారులే ఎంచుకోవాలి.
* అయితే ఈ పథకం కింద డిపాజిట్పై ఎంత వడ్డీ చెల్లించాలనే విషయం బ్యాంకులే నిర్ణయించుకోవాలని ప్రభుత్వం తెలిపింది.
బ్యాంకులకు ప్రత్యేక రాయితీలు:
* గోల్డ్ మానిటైజేషన్ పథకం కింద బంగారం డిపాజిట్లు సేకరించే బ్యాంకులకు సైతం ప్రభుత్వం అనేక రాయితీలు కల్పించనుంది. బ్యాంకులు తమ వద్ద డిపాజిట్ అయిన బంగారాన్ని నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్), ఎస్ఎల్ఆర్ కోసం కూడా ఉపయోగించుకోవచ్చు.
* ప్రస్తుతం బ్యాంకులు తాము సేకరించే డిపాజిట్ల నగదులో కొంత భాగాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దగ్గర సిఆర్ఆర్, ఎల్ఎల్ఆర్ రూపంలో డిపాజిట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
* ఈ వాటాను తగ్గించి, గోల్డ్ సేవింగ్స్ ఖాతా కింద సేకరించిన బంగారంలో కొంత భాగాన్ని ఆర్బిఐ దగ్గర డిపాజిట్ చేసేలా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అలా చేయడం వల్ల బ్యాంకులకు మరిన్ని నిధులు అందుబాటులోకి వస్తాయి.
* బ్యాంకులు ఈ బంగారాన్ని విదేశీ మారక ద్రవ్యం కోసం విక్రయించుకోవచ్చు. దాని ద్వారా వచ్చిన విదేశీ కరెన్సీని ఎగుమతి/దిగుమతి దార్లకు రుణాలు ఇచ్చేలా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
* అంతే కాదు తమ వద్ద డిపాజిట్గా చేసిన బంగారాన్ని నాణేలుగా మార్చి, విక్రయించవచ్చు. దీంతో పాటు నగల వ్యాపారులకు అమ్మడం ద్వారా అదనపు నిధులు సమీకరించేందుకు సైతం అనుమతించే అవకాశం ఉన్నట్టు తెలిసింది.
* దీంతో బంగారం దిగుమతి తగ్గడంతో పాటు దేశంలో వృధాగా పడి ఉన్న రూ. 60 లక్షల కోట్ల విలువైన 20,000 టన్నుల బంగారాన్ని, దేశ ఆర్థిక అభివృద్ధికి ఉపయోగించుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.