ఇంట్రాడే చేస్తున్నారా? కొత్త పీక్ మార్జిన్ నిబంధనలు ఇవే.. దశలవారీగా
మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) కొత్త పీక్ మార్జిన్ ట్రేడింగ్ నిబంధనలను తీసుకు వచ్చింది. మంగళవారం, డిసెంబర్ 1వ తేదీ నుండి ఇవి అమలులోకి వచ్చాయి. దీంతో ఇంట్రాడే మార్జిన్ ట్రేడింగ్ కోసం, బ్రోకర్లు తమ ఖాతాదారులకు అప్పుగా ఇచ్చే మొత్తం గణనీయంగా తగ్గుతుంది. ఇంట్రాడే ట్రేడింగ్ ద్వారా జరిగే భారీ స్పెక్యులేషన్ ట్రాన్సాక్షన్స్కు చెక్ పెట్టేందుకు సెబి కొత్త నిబంధనలు ఉపయోగపడతాయని అంటున్నారు. అదే సమయంలో స్వల్పకాలంలో ట్రేడింగ్ ట్రాన్సాక్షన్స్ను దెబ్బతీస్తుందని బ్రోకర్లు చెబుతున్నారు.
పీక్ మార్జిన్ రూల్స్
సెబి పీక్ మార్జిన్ నిబంధనలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో క్లయింట్స్ నుండి ముందస్తు మార్జిన్ సేకరణను తప్పనిసరి చేశాయి. ఇదివరకు ఉన్న మార్జిన్ నిబంధనలకు, కొత్త పీక్ మార్జిన్ నిబంధనలకు వ్యత్యాసం ఉంటుంది. ఇదివరకు నిబంధనల ప్రకారం ట్రేడింగ్ డే మొత్తం మీద స్టాక్ ఎక్స్చేంజీలే నాలుగుసార్లు ర్యాండమ్ పద్ధతిలో స్నాప్ షాట్స్ తీసుకొని పీక్ మార్జిన్ మొత్తాన్ని నిర్ణయిస్తాయి. పీక్ మార్జిన్ నిబంధనలు దశల వారీగా అమలు చేస్తారు.
నాలుగు దశల్లో..
25 శాతంగా ఉన్న పీక్ మార్జిన్ మొత్తాన్ని దశలవారీగా వంద శాతానికి పెంచుతారు. మొదటి దశలో భాగంగా 2020 డిసెంబర్ 1వ తేదీ నుండి 2021 ఫిబ్రవరి 28వ తేదీ వరకు మార్జిన్ ట్రేడింగ్ చేయాలనుకునే వారి ఖాతాలో 25 శాతం అప్ ఫ్రంట్ మార్జిన్ నిధులు అవసరం.
రెండో దశలో భాగంగా 2021 మార్చి 1వ తేదీ నుండి 2021 మే 31వ తేదీ వరకు ట్రేడింగ్ మార్జిన్ ట్రేడింగ్ చేసే వారి ఖాతాలో 50 శాతం అప్ ఫ్రంట్ మార్జిన్ నిధులు ఉండాలి.
మూడో దశలో భాగంగా 2021 జూన్ 1వ తేదీ నుండి 2021 ఆగస్ట్ 31వ తేదీ వరకు ట్రేడింగ్ మార్జిన్ ట్రేడింగ్ చేసే వారి ఖాతాలో 75 శాతం అప్ ఫ్రంట్ మార్జిన్ నిధులు ఉండాలి.
నాలుగో దశలో భాగంగా 2021 సెప్టెంబర్ 1వ తేదీ నుండి మార్జిన్ ట్రేడింగ్ చేసే వారి ఖాతాలో 100 శాతం అప్ ఫ్రంట్ మార్జిన్ నిధులు తప్పనిసరి.
ఇదీ మార్పు
ఇదివరకు మార్జిన్లు ముందస్తుగా సేకరించి, అదే రోజు ముగింపు పొజిషన్ ఆధారంగా లెక్కించేవారు. ఇంట్రాడే పొజిషన్లకు బ్రోకర్లు.. క్లయింట్స్కు నిధులు సమకూర్చేవారు. ఇప్పుడు రూల్స్ మారాయి. ఉదాహరణకు ఓ ట్రేడర్ రూ.10వేలు మార్జిన్ను ట్రేడర్ వద్ద కలిగి ఉంటే అతను పలుమార్లు ఇంట్రాడే చేయవచ్చు. ఆ రోజు ముగిసే వరకు రూ.10వేలు నష్టపోనంత వరకు ట్రేడింగ్ చేయవచ్చు. ఇప్పుడు డిసెంబర్ 1 నుండి సెబి దీనిని రద్దు చేసింది. ఇక నుండి ట్రేడింగ్ డే మొత్తం మీద స్టాక్ ఎక్స్చేంజీలే నాలుగుసార్లు ర్యాండమ్ పద్ధిలో స్నాప్ షాట్స్ తీసుకొని పీక్ మార్జిన్ మొత్తాన్ని నిర్ణయిస్తాయి.