నిన్న ఒక్కరోజులోనే.. రూ.15,000 ఇన్వెస్ట్ చేస్తే రూ.36,000 లాభం: దీనిని కొనుగోలు చేయవచ్చా?
సిగాచీ ఇండస్ట్రీస్ ఆరంభంలోనే అదరగొట్టింది. కంపెనీ స్టాక్ మర్కెట్లో లిస్ట్ అయిన రోజునే ఇన్వెస్టర్లకు లాభాలను పండించింది. ఐపీవోలో భాగంగా కంపెనీ ఒక్కో షేర్ను రూ.163 ధరతో జారీ చేసింది. సోమవారం బీఎస్ఈలో 270 శాతం వరకు లాభపడి రూ.603.75కు చేరుకుంది. బీఎస్ఈలో స్టాక్ రూ.575 వద్ద, ఎన్ఎస్ఈలో రూ.570 వద్ద ప్రారంభమైంది. చివరకు రూ.598 వద్ద ముగిసింది. సబ్స్క్రిప్షన్లో మంచి ఆదరణ పొందిన ఈ స్టాక్ 100 ప్రీమియంతో లిస్ట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. కానీ ఈ అంచనాలకు మించి రాణించింది. దీంతో ఇన్వెస్టర్ల పంటపండింది.
రూ.15వేలు పెడితే రూ.36వేలు లాభం
సిగాచీ ఇండస్ట్రీస్ ఐపీవోలో ఒక లాట్కు 90 షేర్లను నిర్ణయించారు. ఇష్యూ ధర రూ.163 ప్రకారం ఒక లాట్కు పెట్టుబడి రూ.14,490. బీఎస్ఈలో నమోదు ధర (రూ.575) ప్రకారం ఈ పెట్టుబడి విలువ రూ.51,300కి పెరిగింది. అంటే ఆరంభంలో ఒక లాట్పై రూ.36,810 లాభం వచ్చింది.
అంటే ఒక సెషన్లోనే ఏకంగా రెండున్నర రెట్ల కంటే ఎక్కువగా లాభం పొందారు. బలమైన ఫండమెంటల్స్, ఆకర్షణీయమైన వ్యాల్యుయేషన్ నేపథ్యంలో సిగాచీ ఇండస్ట్రీస్ 250 శాతం కంటే పైగా లాభాలు నమోదు చేసిందని, దీంతో బంపర్ లిస్టింగ్ చూసిందని, మన దేశంలో, MCC(మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్) తయారీలో అగ్రగామిగా నిలిచిందని చెబుతున్నారు.
స్టాక్ కొనుగోలు చేయవచ్చా?
దీర్ఘకాలంలో MCCకి డిమాండ్ నిలకడగా ఉంటే ఐపీవో తర్వాత కంపెనీ విస్తరణ కార్యక్రమం ఆదాయ వృద్ధిని అందిస్తుందని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం షేర్ హోల్డర్స్ రూ.480 వద్ద స్టాప్ లాస్ పెట్టుకొని స్టాక్స్ను అట్టిపెట్టుకోవచ్చునని అంటున్నారు. అదే సమయంలో కొత్త ఇన్వెస్టర్లు మాత్రం ఈ స్టాక్ దూకుడు కాస్త తగ్గే వరకు వేచి చూడటం మంచిదని అంటున్నారు. సిగాచీ ఇండస్ట్రీస్ స్టాక్ టార్గెట్ ధర రూ.800కు పైన, స్టాప్ లాస్ రూ.550 వద్ద పెట్టుకొని కూడా కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు.
కొనుగోలు చేసినవారు ఇలా చేయండి!
ఐపీవోలో పాల్గొన్నవారు పూర్తిగా ప్రాఫిట్ బుకింగ్ చేయడం సరికాదని మార్కెట్ నిపుణుల సూచన. 70 శాతం నుండి 75 శాతం వరకు అట్టిపెట్టుకొని, మిగతా స్టాక్ విక్రయిస్తే మీ మొత్తం మీ చేతికి వస్తుందని అంటున్నారు. లేదా 50 శాతం మేర విక్రయించి మరో యాభై శాతం అట్టిపెట్టుకోవాలని సూచిస్తున్నారు.
స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి రిస్క్తో కూడిన వ్యవహారం. కాబట్టి ఇన్వెస్ట్ చేయడానికి ముందు నిపుణుల సలహాలు, స్టాక్ పైన పూర్తి అవగాహనతో ఉండాలి.
ఇదీ సిగాచీ ఇండస్ట్రీస్
ఐపీవో ద్వారా వచ్చిన మొత్తంతో సిగాచీ ఇండస్ట్రీస్ వ్యాపార విస్తరణ చేయనుంది. ఇష్యూ ద్వారా రూ.125 కోట్లు సమీకరించింది. ఈ రాబడిని గుజరాత్లోని దహేజ్ అండ్ ఝగాడియాలో MCC ఉత్పత్తి సామర్థ్య విస్తరణ కోసం, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో క్రోస్కామెల్లోస్ సోడియం (CCS) తయారీకి మూలధన వ్యయంగా ఉపయోగపడుతోంది. ఈ కంపెనీ మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్(MCC)ని తయారు చేస్తోంది. ఇది ఔషధ పరిశ్రమలో పూర్తయిన మోతాదుకు ఎక్స్పియంట్గా విస్తృతంగా ఉపయోగిస్తారు. MCC ఫార్మాస్యూటికల్స్, ఫుడ్, న్యూట్రిస్యూటికల్స్, కాస్మెటిక్ పరిశ్రమలో వైవిధ్యమైన అప్లికేషన్స్ను కలిగి ఉంది.