గంటల్లోనే రూ.900 కోట్లు పెరిగిన రాకేష్ ఝున్ఝున్వాలా సంపద
బిగ్బుల్ రాకేష్ ఝున్ఝున్వాలా కొద్ది గంటల్లోనే కోట్లాది రూపాయలు ఆర్జించారు. నేడు టైటాన్ స్టాక్ భారీగా లాభపడిన విషయం తెలిసిందే. నేడు ఈ స్టాక్ పది శాతానికి పైగా లాభపడింది. దీంతో స్టాక్ గురువారం 226.35 (10.54%) శాతం లాభపడి రూ.2,374.00 వద్ద ముగిసింది. నేటి టాప్ గెయినర్స్ జాబితాలో టైటాన్ ముందు ఉంది. గత ఐదు సెషన్లలో 11.36 శాతం లాభపడింది. ఏడాదిలో దాదాపు 90 శాతం ఎగిసింది. అయితే రాకేష్ ఝున్ఝున్వాలా టైటాన్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ స్టాక్స్ జంప్ చేయడంతో ఝున్ఝున్వాలా సంపద భారీగా పెరిగింది. ఓ సమయంలో ఆయన సంపద రూ.913 కోట్లు పెరిగింది. ఈ టాటా గ్రూప్ కంపెనీ అప్పర్ సర్క్యూట్ను తాకింది. 52 వారాల గరిష్టం రూ.2,361ని కూడా తాకింది.
నిమిషాల్లో రూ.850 కోట్లు
నేడు టైటాన్ స్టాక్ భారీగా లాభపడటంతో రాకేష్ ఝన్ఝున్వాలా సంపద అమాంతం పెరిగింది. టైటాన్ లాభంతో బిగ్ బుల్ సంపద నేడు రూ.850 కోట్లు పెరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ఈ స్టాక్ పదినిమిషాల్లోనే భారీగా లాభపడింది. అంటే ఈ కొద్ది నిమిషాల్లోనే సంపద పెరిగింది. కేవలం 10 నిమిషాల్లో టైటాన్ మార్కెట్ క్యాప్కు మరో రూ.17,770 కోట్లను ఈ కంపెనీ జోడించింది. ట్రేడింగ్ ప్రారంభంలో టైటాన్ షేర్లు 9.32% పెరిగి లాభపడి రూ.2,347 రికార్డు స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత ఏ స్థాయిలోను తగ్గలేదు. చివరకు పది శాతం లాభంతో ముగిసింది.
బిగ్ బుల్ వాటా
టైటాన్ కంపెనీలో బిగ్ బుల్ వాటా 4.26 శాతంగా ఉంది. రాకేష్ ఝున్ఝున్వాలా, ఆయన సతీమణి వాటా కలిపి ఇది 4.81 శాతంగా ఉంది. టైటాన్ షేర్ ధర బుధవారం రూ.2,146.80 వద్ద ముగిసింది. అప్పుడు రాకేష్ పెట్టుబడి మొత్తం వ్యాల్యూ రూ.9156 కోట్లుగా ఉంది. ఉదయం స్టాక్ జంప్ చేసిన తర్వాత ఆయన వాటా రూ.879 కోట్లు పెరిగి రూ.10,069 కోట్లకు చేరుకుంది. ఇంట్రాడేలో రూ.2,08,350 కోట్ల మార్కెట్ క్యాపిటల్ టైటాన్ చేరుకుంటే, ఆ సమయంలో టైటాన్ గ్రూప్ కంపెనీలో రాకేష్ వాటా రూ.10,000 కోట్లను దాటింది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఆభరణాల తయారీ వ్యాపార ట్రాన్సాక్షన్స్ కరోనా ముందుస్థాయికి చేరుకున్నాయి. అలాగే రాబోయే పండుగ సీజన్ నేపథ్యంలో ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు పెట్టినట్లు నిపుణులు చెబుతున్నారు. టాటా గ్రూప్ ఈ త్రైమాసికంలో కొత్తగా మరో 13 దుకాణాలను తెరిచింది.
డిమాండ్ పెరిగి, బలమైన రికవరీ
కరోనా సెకండ్ వేవ్ అనంతర త్రైమాసికంలో డిమాండ్ పెరిగి, బలమైన రికవరీ కనిపిస్తోందని టైటాన్ కంపెనీ తెలిపింది. టైటాన్ కంపెనీ చాలా దుకాణాల్లో సేల్స్ కరోనా ముందుస్థాయికి చేరుకున్నట్లు చెబుతోంది. జ్యువెల్లరీ వ్యాపారం 78 శాతం వృద్ధి, వాచీలు, వియరబుల్ వ్యాపార వృద్ధి 73 శాతం పెరిగినట్లు తెలిపింది. ఇతర బిజినెస్సెస్ ఏడాది ప్రాతిపదికిన 121 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు తెలిపింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం (అక్టోబర్ 7) భారీ లాభాల్లో ముగిశాయి. గతవారం భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు, ఈ వారం రెండు ప్రారంభ సెషన్లలో లాభపడ్డాయి. సోమ, మంగళవారం సెషన్స్లో సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా లాభపడినప్పటికీ, నిన్నటి సెషన్లో 500 పాయింట్లకు పైగా నష్టపోయింది. నేడు తిరిగి లాభాల్లోకి వచ్చింది.