పేటీఎం సహా ఈ ఇన్వెస్టర్లు రూ.1.5 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు
నాలుగు నెలల క్రితం ఐపీవోకు వచ్చిన ఐపీవో మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ షేర్ ధర భారీగా పతనమైంది. క్రితం సెషన్లో దాదాపు రెండు శాతం క్షీణించింది. గత ఐదు రోజుల్లో దాదాపు 7 శాతం, గత నెల రోజుల్లో 22 శాతం పడిపోయింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు గత కొద్ది రోజులుగా భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ ఆల్ టైమ్ గరిష్టం 62,245 పాయింట్లు కాగా, ప్రస్తుతం 53,500 పాయింట్లకు దిగువనే ఉంది. అన్ని రంగాలు కూడా నష్టాల్లోనే ఉన్నాయి. యుద్ధం తీవ్రతరమవుతున్నా కొద్ది స్టాక్స్ నష్టాలు పెరుగుతున్నాయి. అయితే తాజాగా ఉక్రెయిన్ చేతులెత్తేసిన పరిస్థితికి వచ్చిందనే వార్తలు నేడు మార్కెట్ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా పేటీఎం స్టాక్ మాత్రం ఐపీవో నుండి భారీగా పతనమైంది.
మార్కెట్ క్యాప్ రూ.50 వేల కోట్ల దిగువకు
పేటీఎం షేర్లు ఆల్ టైమ్ కనిష్టానికి చేరుకున్నాయి. ఆల్ టైమ్ గరిష్టం నుండి 66 శాతం వరకు పడిపోయాయి. పేటీఎం షేర్లు నిన్న ఓ సమయంలో మూడు శాతానికి పైగా క్షీణించి రూ.728.50 స్థాయికి పడిపోయాయి. బీఎస్ఈలో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.50 వేల కోట్ల దిగువకు పడిపోయింది. పేటీఎం షేర్ ఆల్ టైమ్ గరిష్టం రూ. 1,961.05 నుంచి 63 శాతం దిగువన ట్రేడవుతోంది. బీఎస్ఈలో అంతకుముందు సెషన్ ముగింపు ధర రూ.753.45 తో పోలిస్తే నిన్నటి సెషన్లో 1.89 శాతం క్షీణించి, రూ.739.20 వద్ద ముగిసింది. ఈ స్టాక్ స్టాక్ డౌన్ వర్డ్ ట్రెండ్లో కనిపిస్తోంది. షేర్లు 5 రోజులు, 20 రోజులు, 50 రోజులు, 100 రోజుల చలన సగటు కంటే తక్కువస్థాయిలో ఉన్నాయి.
రూ.2150 నుండి రూ.750 దిగువకు
పేటీఎం ఇష్యూ ధర రూ.2150 కాగా, ఇప్పుడు రూ.750 దిగువన ఉంది. ఓ సమయంలో మార్కెట్ క్యాప్ రూ.1.40 లక్షల కోట్లు ఉండగా, ఇప్పుడు రూ.50వేల కోట్ల దిగువకు పడిపోయింది. గత ఐదు సెషన్లలోనే ఈ స్టాక్ దాదాపు ఏడు శాతం క్షీణించింది. పేటీఎంతో పాటు ఇటీవల ఐపీవోకు వచ్చిన పాలసీ పజార్, జోమాకో, నైకా కూడా ఇన్వెస్టర్లకు నష్టాన్ని మిగిల్చాయి.
లక్షన్నర కోట్ల సంపద
గత ఐదారు నెలల్లో లిస్ట్ అయిన టెక్ కంపెనీల షేర్లు అంతకంతకూ పడిపోతున్నాయి. వీటిలో ఐపీవో సమయంలో ఇన్వెస్ట్ చేసిన వారు భారీ నష్టాలను మూటగట్టుకున్నారు. జొమాటో, పేటీఎం, నైకా, పాలసీ బజార్... ఈ నాలుగు కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన వారి సంపద దాదాపు రూ.1.50 లక్షల కోట్లకు పైగా పోయింది. లిస్టింగ్ రోజున ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.3.58 లక్షల కోట్లు. ప్రస్తుతం ఇది రూ.2.14 లక్షల కోట్లకు పడిపోయింది. ఇందులో ఇన్వెస్టర్ల సంపదను అధికంగా హరించిన కంపెనీ పేమెంట్. ఈ కంపెనీ షేర్ రూ.2,150 ధరతో పబ్లిక్ ఆఫర్ కాగా, ఆఫర్ ధర కంటే తక్కువగా రూ.1,955 వద్ద లిస్ట్ అయింది. నిన్న రూ.739కి పడిపోయింది. ఐపీవో ధర వద్ద ఈ కంపెనీ మార్కెట్ వ్యాల్యూ రూ.1.39 లక్షల కోట్లు. లిస్టింగ్ రోజైన 2021 నవంబర్ 18న రూ.1.01 లక్షల కోట్లు కాగా, ఇప్పుడు రూ.47.84 కోట్లుగా ఉంది. ఈ నాలుగు నెలల్లో రూ.60 వేల కోట్ల సంపదను హరించుకుపోయింది.