ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చా? నష్టపోయాక.. ఆందోళన కాదు.. ఇలా చేయండి
ఇటీవలి మార్కెట్లు భారీ నష్టాల్లో కనిపించి, గత నాలుగు సెషన్లుగా లాభాల్లోకి వచ్చాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ గెలవడం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ వాతావరణం తగ్గడం వంటి అంశాలు మార్కెట్ దూకుడుకు కలిసి వచ్చాయి. అయితే రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్త పరిస్థితులు అప్పుడే అధికారికంగా చల్లబడలేదు. మరోవైపు, అంతర్జాతీయ ద్రవ్యోల్భణ భయాలు కమ్ముకొని ఉన్నాయి. దీనికి తోడు ఇటీవలి భారీ కనిష్టాల వద్ద ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఇలా అన్నీ కలిసి వచ్చి మార్కెట్లు లాభాల్లో కనిపించాయి. మొన్నటి వరకు పరుగెత్తిన సూచీలు, ప్రస్తుతం మందకోడిగా ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్ ఎలా ఉంటుంది, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం ముగిసినట్లేనా, ద్రవ్యోల్భణ భయాలు ఎలా ఉంటాయి? అనే ఆందోళన ఇన్వెస్టర్లను వెంటాడుతోంది. ప్రస్తుత కనిష్టాల వద్ద స్టాక్ మార్కెట్లో కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఇప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చా, లేదా అనే ప్రశ్న కూడా చాలామందిలో ఉంది.
ఇప్పుడు ఇలా చేయండి
ప్రస్తుతం చాలామంది మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు తమ పోర్ట్పోలియోలో నష్టాలను చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం కంటే, ఇప్పటికే ఉంటే కనుక అలాగే కొనసాగించాలని, అలాగే పెట్టుబడి పెట్టాలనుకుంటే మాత్రం నిఫ్టీ 50 ఫండ్స్ను చూడవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఊగిసలాటలో ఉన్నాయని అంటున్నారు. పెట్టుబడులపై కనీస హామీ కలిగిన స్కీంలు లేదా స్టాక్స్ వైపు చూస్తున్నట్లుగా చెబుతున్నారు.
నష్టపోయాక బాధపడుతున్నారు.. కానీ
మ్యూచువల్ ఫండ్స్ నిపుణుల ప్రకారం కొంతమంది మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లు, ముఖ్యంగా కొత్త, మొదటిసారి పెట్టుబడిదారులు ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్ రుచిని (క్లిష్ట పరిస్థితిని) చూస్తున్నారని చెబుతున్నారు. కొన్ని నెలల క్రితం వీరు బుల్లిష్గా ఉన్నారని, అన్ని రిస్క్లకు సిద్ధంగా కనిపించారని, కానీ ప్రస్తుత ప్రపంచ సంక్షోభ పరిస్థితుల్లో పెట్టుబడులపై ఆందోళన చెందుతున్న వారు ఎందరో అని అంటున్నారు. పెట్టుబడి పెట్టే ముందు పెట్టుబడి ప్రాథమిక సూత్రాలను విస్మరించకూడదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పెట్టుబడిదారులు తమ లక్ష్యాలు, పెట్టుబడి హోరిజోన్, రిస్క్ ప్రొఫైల్ను ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. వాటి ఆధారంగానే ఇన్వెస్ట్ చేయాలి.
మార్కెట్ కోలుకోవడానికి సమయం
రెండేళ్ల క్రితం కరోనా ప్రారంభంనుండి మార్కెట్ తీవ్ర ఒడిదుడుకుల్లో కనిపిస్తోంది. ద్రవ్యోల్భణం పెరగకుండా, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఆయా దేశాలు వడ్డీ రేట్ల తగ్గింపు, వివిధ రంగాలకు భారీ సహకారం వంటి ఈజీ మనీ పాలసీలు ఇచ్చాయి. ఉదాహరణకు భారత ప్రభుత్వం లిక్విడిటీ మద్దతుకు తోడు వివిధ కారణాలతో సూచీలు ఇటీవల ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి.
ఇప్పుడు క్రమంగా ఆర్థిక రికవరీ కనిపిస్తున్నందున కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచేందుకు సిద్ధమయ్యాయి. పరిస్థితుల అంశాన్ని పక్కన పెడితే ఇన్వెస్ట్ చేసేవారు తమ లక్ష్యం, పెట్టుబడి హోరిజోన్, రిస్క్ ప్రొఫైల్ పట్ల పూర్తి అవగాహనతో ఉండాలి. అప్పుడే ఇన్వెస్ట్ చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్ కోలుకోవడానికి కాస్త సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని, అంచనాలపై ఆధారపడవద్దని సూచిస్తున్నారు. మార్కెట్ను కచ్చితంగా అంచనా వేయడం సాధ్యం కాదని అంటున్నారు.