9 నెలల గరిష్టానికి బంగారం డిస్కౌంట్, రూ.49,000 పైన క్లోజ్
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వినియోగం తగ్గడంతో గోల్డ్ డీలర్ల్స్ భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. లోకల్ మార్కెట్లో తక్కువ డిమాండ్, ఓవర్సీస్లో ధరల దిద్దుబాటు నేపథ్యంలో గత తొమ్మిది నెలల కాలంలో ఇదే భారీ డిస్కౌంట్. గోల్డ్ డీలర్ల్స్ డిస్కౌంట్ ఔన్స్కు 12 డాలర్ల వరకు ఉంది. సెప్టెంబర్ 2020 మధ్య కాలం నుండి ఇదే గరిష్టం. బంగారంపై 10.75 శాతం దిగుమతి, 3 శాతం సేల్స్ సుంకం ఉంటుంది. అంతకుముందు వారం 10 డాలర్ల డిస్కౌంట్ ఉండగా, ఈసారి 12 డాలర్లకు పెరిగింది.
భారీ డిస్కౌంట్
చైనాలో గోల్డ్ డీలర్లు భారీ డిస్కౌంట్ ఇస్తున్నారు. 20 డాలర్ల నుండి 50 డాలర్ల వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. ఇంటర్నేషనల్ స్పాట్ ధరలు ప్రీమియం 6 డాలర్ల నుండి 7 డాలర్ల వరకు ఉన్నాయి. కరోనా తిరిగి పుంజుకోవడం, కొత్త ఆంక్షలు చైనా డీలర్లకు దెబ్బతీశాయి. గౌంగ్జూ ప్రాంతంలో కొవిడ్ 19 కేసులు తిరిగి పెరిగాయని, ఇది లాక్ డౌన్కు కారణమైందని, బంగారం తయారీదారులపై ప్రభావితం పడిందని చెబుతున్నారు.
రూ.49వేల పైన ముగిసిన బంగారం
బంగారం ధరలు గతవారం పది గ్రాములు 49 వేలు దాటాయి. పలుమార్లు ఈ మార్కు పైకి, కిందకు తచ్చాడినప్పటికీ ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ చివరకు 49,020 వద్ద ముగిశాయి. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.49,307 వద్ద క్లోజ్ అయింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.71543.00 వద్ద, సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.72697.00 వద్ద క్లోజ్ అయింది. బంగారం ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో రూ.7200 వరకు తక్కువగా ఉంది. వెండి రూ.7000 తక్కువగా ఉంది.
1900 డాలర్లు క్రాస్ చేసినా
అంతర్జాతీయ మార్కెట్లో గతవారం పసిడి ధరలు 1900 డాలర్లు దాటి 1950 డాలర్ల దిశగా పరుగు పెట్టినట్లు కనిపించింది. అయితే ఆ తర్వాత క్షీణించి ఈ మార్కు దిగువకు వచ్చింది. చివరి సెషన్లో 1894 డాలర్ల వద్ద ముగిసింది. చివరి సెషన్లో 20 డాలర్లు పెరిగినప్పటికీ 1900 డాలర్ల దిగువనే ముగిసింది. ఇక వెండి 27.922 డాలర్ల వద్ద ముగిసింది.