బడ్జెట్ టైంలో ఈ 5 స్టాక్స్ రిఫర్! నేడు మార్కెట్ దూకుడు, రూ.3 లక్షల కోట్ల సంపద పెరిగింది
బడ్జెట్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ పరుగు పెట్టింది. కేంద్ర బడ్జెట్కు ముందు మార్కెట్ భారీ కరెక్షన్ లేదా భారీగా లాభపడటం జరుగుతుంది. నిన్న 800 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్, నేడు (ఫిబ్రవరి 1) ప్రారంభ సెషన్లో దాదాపు అంతేస్థాయిలో ఎగిసిపడింది. బడ్జెట్ ప్రసంగం అనంతరం కాస్త నష్టపోయినప్పటికీ, తిరిగి కోలుకొని, 848 పాయింట్ల లాభాల్లో ముగిసింది. గతవారం వరకు వరుసగా ఏడెనిమిది సెషన్లలో దాదాపు 4వేల పాయింట్లకు పైగా సెన్సెక్స్ నష్టపోయింది. బడ్జెట్కు ముందు భారీ దిద్దుబాటుగా కనిపించింది. అయితే బడ్జెట్ కాస్త సానుకూలంగా ఉంటుందనే వార్తలు, ఆ తర్వాత నిన్న వచ్చిన ఎకనమిక్ సర్వే ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. దీంతో రెండో రోజు మార్కెట్ దూకుడు కొనసాగించింది. అయితే డిఫెన్స్ రంగానికి అత్యధిక కేటాయింపులు ఉంటాయనే వార్తల నేపథ్యంలో ఈ రంగంలోని షేర్లు ఎగిసిపడ్డాయి. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ నిపుణులు వివిధ స్టాక్స్ను సూచించారు.
కోవింద్ కీలక వ్యాఖ్యలు
బడ్జెట్ 2022 ప్రసంగానికి ముందురోజు పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 209 డిఫెన్స్ ఐటమ్స్ దిగుమతిని నిలిపివేయాలని, వీటని భారత్లోనే తయారు చేసుకోవాల్సి ఉందని స్పష్టం చేశారు. ఇది డిఫెన్స్ స్టాక్స్కు ఊతమిస్తోంది. బడ్జెట్లో రక్షణ రంగానికి స్థానికంగానే ఊతమిచ్చే ప్రకటనలు ఉంటాయని మార్కెట్ నిపుణులు అంచనా వేసినట్లుగానే నిర్మలమ్మ ప్రాధాన్యత ఇచ్చారు. ముందే నిపుణులు వివిధ డిఫెన్స్ స్టాక్స్నూ రిఫర్ చేశారు.
ఈ స్టాక్స్ రిఫర్ చేశారు..
భారత్ ఎలక్ట్రానిక్స్, భారత్ డైనమిక్స్, హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL), భారత్ ఫోర్జ్, లార్సన్ టర్బో వంటి రక్షణ రంగ స్టాక్స్కు ఊతమిస్తోంది. అయితే పలు స్టాక్స్ లాభపడినప్పటికీ, కొన్ని స్టాక్స్ ప్రస్తుతం దాదాపు స్థిరంగా ఉన్నాయి. అయితే భారత్ భారత్ ఎలక్ట్రానిక్స్ నేడు 1.19 శాతం, భారత్ డైనమిక్స్ 1.39 శాతం, హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 0.60 శాతం నష్టపోగా, భారత్ ఫోర్జ్ 2.24 శాతం, లార్సన్ అండ్ టర్బో 4.49 శాతం లాభాల్లో ముగిశాయి.
నేడు మార్కెట్
నేడు ప్రారంభ సెషన్లో సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా లాభపడింది. ఓ సమయంలో వెయ్యి పాయింట్లకు పైగా ఎగిసింది. అలాగే, నిర్మలమ్మ ప్రసంగం అనంతరం ఓ సమయంలో 250 పాయింట్లకు పైగా క్షీణించింది. కాసేపటికే దూసుకెళ్లింది. చివరకు సెన్సెక్స్ 848.40 (1.46%) పాయింట్లు లాభపడి 58,862.57 పాయింట్ల వద్ద ముగిసింది. 58,672.86 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, 59,032.20 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 57,737.66 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 237.00 (1.37%) పాయింట్లు ఎగిసి 17,576.85 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 17,529.45 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,622.40 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,622.40 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మార్కెట్ భారీ లాభాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు నేడు ఒక్కరోజు రూ.3 లక్షల కోట్లు ఆర్జించారు.