భారత్తో రూ.20,000 కోట్ల వివాదం: విజయం సాధించిన వొడాఫోన్
అంతర్జాతీయ ఆర్బిట్రేషన్లో టెలికం దిగ్గజం వొడాఫోన్కు అనుకూలంగా తీర్పు వచ్చింది. భారత ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.20,000 కోట్ల పన్ను వివాదంలో అంతర్జాతీయ న్యాయస్థానంలో తాము విజయం సాధించినట్లు వొడాఫోన్ శుక్రవారం ప్రకటించింది. బకాయిలు రూ.12,000 కోట్లు, రూ.7,900 కోట్ల పెనాల్టీ చెల్లింపులపై ఉపశమనం లభించినట్లు వొడాఫోన్ తెలిపింది. ఎయిర్ వేవ్స్, లైసెన్స్ ఫీజులకు సంబంధించి వివాదం తలెత్తింది. దీంతో వొడాఫోన్ 2016లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ను ఆశ్రయించింది.
వొడాఫోన్ పైన భారత్ మోపిన పన్నుభారాలు భారత్-నెదర్లాండ్స్ మధ్య కుదిరిన పెట్టుబడి ఒప్పందానికి విరుద్ధమని ట్రైబ్యునల్ రూలింగ్ ఇచ్చినట్లు వొడాఫోన్ తెలిపింది. ఇప్పటికే నష్టాలతో ఈ టెలికం సంస్థకు ఇది మరో ఊరట. ఎందుకంటే ఇటీవల వొడాఫోన్-ఐడియా (వీఐ)కి సుప్రీం కోర్టులో ఏజీఆర్ బకాయిలపై స్వల్ప ఊరట లభించింది. బకాయిలను పదేళ్లలో చెల్లించాలని భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఇప్పుడు రూ.20,000 కోట్ల పన్ను వివాదంలో విజయం సాధించినట్లు తెలిపింది.
మరో బ్రిటన్ కంపెనీ కొనుగోలు చేసేందుకు ముఖేష్ అంబానీ యత్నం!
కాగా, అంతర్జాతీయ న్యాయస్థానంలో వొడాఫోన్ విజయం సాధించినట్లు వెల్లడించడంతో వొడాఫోన్ ఐడియా షేర్లు లాభపడ్డాయి. నిన్నటి వరకు భారీగా నష్టాలను చవిచూసిన ఈ షేర్ ధర ఈ రోజు 12 శాతం లాభపడి రూ.10.20 వద్ద ముగిసింది.