అబ్బే.. అదేం లేదు, గూగుల్ 5 శాతం వాటా కొనుగోలుపై వొడాఫోన్-ఐడియా క్లారిటీ..
వొడాఫోన్-ఐడియాలో గూగుల్ వాటా కొంటుందని, 5 శాతం షేర్ కొనేందుకు సుముఖంగా ఉంది అని నిన్న ఫైనాన్సియల్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. అయితే ఆ వార్తలను వొడాఫోన్-ఐడియా తోసిపుచ్చింది. ఇప్పటివరకు తమ బోర్డును గూగుల్ సంప్రదించలేదని తెలిపింది. దీంతో గూగుల్ వాటా కొనుగోలు చేసే అంశం ఊహాగానాలేనని అర్థమవుతోంది.
కంపెనీ విలువను పెంచడానికి గల అవకాశాలను నిరతంరం అంచనా వేస్తామని.. కానీ తమకు ఒక కంపెనీ నుంచి వాటా కొనుగోలు సమాచారం రాలేదని వొడాఫోన్ ఐడియా పేర్కొన్నది. సెబీ నిబంధనల ప్రకారం బోర్డు డైరెక్టర్లు వాటా కొనుగోలు అంశాలను బహిర్గతం చేయాల్సి ఉంది అని.. అలాంటి పరిస్థితి ఉంటే చేస్తామని పేర్కొన్నది.
వొడాఫోన్ ఐడియాలో గూగుల్ షేర్ కొనుగోలు చేస్తుందన్న ఊహాగానాలతో శుక్రవారం ప్రారంభంలో వొడాఫోన్ ఐడియా షేర్ విలువ పెరిగింది. గత సెషన్లో 5.83 క్లోజ్ అవగా35 శాతం పెరిగి 7.85 వద్ద ఆగింది. గత ఐదురోజుల నుంచి 32.97 శాతం పెరగగా ఒక్కరోజే 35 శాతం పెరగడం విశేషం. వొడాఫోన్ ఐడియా ఇంట్రాడే ట్రేడ్ 0.74 పాయింట్లు పెరిగాయి.
ముఖేశ్ అంబానీకి చెందిన జియోలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ 5.7 బిలియన్ డాలర్లు 9.9 శాతం వాటాను తీసుకుంది. తర్వాత జనరల్ అట్లాంటిక్, సిల్వర్ లేక్ పార్టనర్స్, కేకేఆర్ తదితరులు జియోలో పెట్టుబడి పెట్టారు. ఫేస్ బుక్ పోటీదారు గూగుల్.. వొడాఫోన్ ఐడియాలో 5 శాతం వాటా కొనుగోలు చేస్తుందని వార్తలొచ్చాయి. కారీ దానిని వొడాఫోన్ ఐడియా తోసిపుచ్చింది.