ఉబెర్ ఫౌండర్... భారత్లో కొత్త వెంచర్: సక్సెస్ అయ్యేనా?
ప్రముఖ రైడ్ హైలింగ్ కంపెనీ ఉబెర్ కో-ఫౌండర్ ట్రావిస్ కాలానిక్ భారత్ లో తన కొత్త వెంచర్ ను ప్రారంభించబోతున్నారు. అది కూడా ఫుడ్ డెలివరీ విభాగంలో. కొంత కాలంగా అయన క్లౌడ్ కిచెన్స్ అనే సంస్థను భారత్ లో విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీని యాజమాన్య సంస్థ ఐన సిటీ స్టోరేజ్ సిస్టమ్స్ అనే కంపెనీ లో కాలానిక్ మెజారిటీ వాటాలు కొనుగోలు చేశారు. అమెరికా లోని లాస్ ఏంజెల్స్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ ప్రస్తుతం భారత్ సహా వివిధ దేశాల్లో కార్యకలాపాలను విస్తరించే ప్రయత్నంలో ఉంది. ఇందుకోసం కొన్ని కంపెనీలను కొనుగోలు చేస్తోంది.
ఈ మేరకు ఇప్పటికే ఇండియా లోనూ ఒక కంపెనీలో వాటాలు కొనుగోలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉబెర్ కంటే కూడా ఫుడ్ డెలివరీ రంగంలోనే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని, అందుకే తమ సంస్థ సిటీ స్టోరేజ్ సిస్టమ్స్ నడిపించే క్లౌడ్ కిచెన్స్.. ఉబెర్ కంటే పెద్ద సంస్థగా ఆవిర్భవిస్తుందని కాలానిక్ భావిస్తున్నారు. పలు ఆరోపణల నేపథ్యంలో ట్రావిస్ కాలానిక్ ఉబెర్ నుంచి 2017లోనే బయటకు వచ్చారు. అప్పుడు కంపెనీలో తనకున్న వాటాల విక్రయంతో 1.4 బిలియన్ డాలర్ల (సుమారు రూ 9,800 కోట్లు) నిధులను సమీకరించారు. వాటితో క్లౌడ్ కిచెన్స్ మాతృ సంస్థలో మెజారిటీ వాటా కొనుగోలు చేసి, ప్రస్తుతం దానిని ప్రపంచవ్యాప్తంగా విస్తరించే పనిలో పడ్డారు.
అమెరికా-చైనా ట్రేడ్ వార్: బంగారం వెలుగులు తగ్గిపోతాయా?
క్లౌడ్ కిచెన్స్ ఏం చేస్తుందంటే...
ప్రస్తుతం మనం ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన ఫుడ్ ... మనకు దగ్గరలోని ఒక హోటల్ లేదా రెస్టారెంట్ నుంచి డెలివరీ అవుతుంది. కానీ క్లౌడ్ కిచెన్స్ లో అలా జరగదు. దీనికి ఒక చోట ప్రత్యేకంగా హోటల్ లేదా రెస్టారెంట్ లాంటింది ఏమీ ఉండదు. కానీ సిటీ లోని ఒక ప్రదేశంలో ఒక వంట గది (సెంట్రల్ కిచెన్) ఉంటుంది. ఆన్లైన్ లో ఇచ్చిన ఆర్డర్ ను అక్కడినుంచే డెలివరీ చేస్తారు. ఆ కిచెన్ లో కూర్చొని తినే వెసులుబాటు ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కేవలం ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసేందుకు ఉద్దేశించిన హోటల్ లాంటిది. సిటీ లో ఒక హోటల్ లేదా రెస్టారెంట్ నెలకొల్పాలంటే చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది. అది బాగా పాపులర్ అయ్యి లాభాలు వచ్చేందుకు కొన్నేళ్లు పడుతుంది. కానీ సెంట్రల్ కిచెన్ ప్రాసెస్ ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయానికి ఆస్కారం ఉందని అంచనా వేస్తున్నారు.
ముంబై తో మొదలు...
ఇండియా లో మొట్ట మొదటగా క్లౌడ్ కిచెన్స్ ను ముంబై నగరంలో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇందుకోసం ఇప్పటికే వివిధ సంస్థలతో సంప్రదింపులు జరుగుతున్నాయని ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో పేర్కొంది. ఇందుకోసం ఆశిష్ సక్సేనా అనే వ్యక్తిని జనరల్ మేనేజర్ గా నియమించినట్లు తెలిపింది. భారత్ లో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ అత్యంత వేగంగా విస్తరించిన అంశం క్లౌడ్ కిచెన్స్ ను బాగా ఆకర్షించింది. ఇక్కడ స్విగ్గి, జొమాటో ల విస్తరణ వారిని ఆకట్టుకొంది. అందుకే క్లౌడ్ కిచెన్స్ విస్తరణ కోసం ప్రముఖంగా భారత్ పై ఫోకస్ పెట్టింది. అందుకే తొలుత ముంబై తో మొదలు పెట్టి హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు నగరాలకు కూడా కార్యకలాపాలు విస్తరించనుంది.
స్విగ్గి, జొమాటో తో జట్టు...
భారత్ లో తమ కార్యకలాపాల విస్తరణ కోసం క్లౌడ్ కిచెన్స్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గి, జొమాటో తో కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. క్లౌడ్ కిచెన్స్ కు ప్రధానంగా ఫుడ్ ను డెలివరీ చేసే సంస్థలే కీలకం. అందుకే వీటితో చర్చిస్తోంది. ఇందులో ఉబెర్ ఈట్స్ కూడా ఉండటం గమనార్హం. అదే సమయంలో వివిధ రెస్టారెంట్లు, రియల్ ఎస్టేట్ పార్టనర్స్ తో నూ సంప్రదింపులు జరుపుతోంది. క్లౌడ్ కిచెన్స్ విస్తరణ కోసం ఒక్కో సిటీ లో కొన్ని అనుబంధ కిచెన్స్, ఒక సెంట్రల్ కిచెన్ అవసరం ఉంటుంది. ఉద్యోగులు కూడా చాలా తక్కువ మందే ఉంటారు. కేవలం డెలివరీ ఓన్లీ ప్రాతిపదికన ప్రస్తుతం బెంగళూరులో నడుస్తున్న ఫస్సోస్, ఒవేన్ స్టోరీ వంటి ఆన్లైన్ సంస్థల నిర్వాహక కంపెనీ రెబెల్ ఫుడ్స్ లో కూడా కాలానిక్ కొంత మొత్తం ఇన్వెస్ట్ చేశారట.
టెక్నాలజీ వినియోగం...
ట్రావిస్ కాలానిక్ అభివృద్ధి చేస్తున్న క్లౌడ్ కిచెన్స్ లో ... టెక్నాలజీ ని అధికంగా ఉపయోగించనున్నారు. ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అనలిటిక్స్ ను వినియోగిస్తారు. ఫుడ్ ప్రిపేర్ చేసేందుకు కూడా ఆధునిక భారీ తయారీ యంత్రాలను వాడే అవకాశం ఉంది. తద్వారా ఆహారాన్ని చాలా వేగంగా తయారు చేయగలుగుతారు. అదే సమయంలో ఎక్కువ మొత్తంలో ఫుడ్ ప్రేపరషన్ కు కూడా టెక్నాలజీ ఉపకరించనుంది. ఇదిలా ఉండగా... ఉబెర్ లాగే స్థాపించిన కొద్దీ కాలంలోనే క్లౌడ్ కిచెన్స్ దూసుకుపోతోంది. ఇప్పటికే ఇది 5 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ సాధించింది. ఇటీవలే ఈ కంపెనీ 400 మిలియన్ డాలర్ల (సుమారు రూ 2,800 కోట్లు) పెట్టుబడి సమీకరించింది.