100 ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారుల రుణాలు రూ.84,632 కోట్లు, టాప్ 10 వీరే...
భారత్లోని టాప్ 100 ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారులు మార్చి 2020 నాటికి వివిధ బ్యాంకుల నుండి రూ.84,632 కోట్ల రుణాలు తీసుకున్నారు. టాప్ 10లో గీతాంజలి జెమ్స్, విన్సమ్ డైమండ్స్ అండ్ జ్యువెల్లరీ, కింగ్ఫిషర్ ఎయిర్ లైన్స్ రుణ వాటానే 32 శాతంగా ఉంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) డేటా వెల్లడిస్తోంది. రూ.84000 కోట్లకు పైగా రుణాలు ఉండగా, ఇందులో రూ.62వేల కోట్లకు పైగా రుణాలను బ్యాంకులు రైటాఫ్ చేశాయి. 2019 మార్చి నాటికి టాప్ 100 రుణాలు రూ.80,344 కోట్లు కాగా, ఏడాదిలో 5.34 శాతం పెరిగాయి.
కేంద్రం పెట్రోల్ ధరలు తగ్గించినా... లాభంలేదు! నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే
డిఫాల్టర్స్... టాప్ 10 రుణాలు
టాప్ 10 ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారులకు చెందిన రుణాలు ఇలా ఉన్నాయి. గీతాంజలి జెమ్స్ రూ.5,693 కోట్లు, ఆర్ఈఐ ఆగ్రో రూ.4,403 కోట్లు, విన్సమ్ డైమండ్స్ రూ.3,375 కోట్లు, ఖుదోస్ కెమీ రూ.2,326 కోట్లు, రోటోమాక్ గ్లోబల్ రూ.2,028 కోట్లు, జూమ్ డెవలపర్స్ రూ.1,927 కోట్లు, ఏబీజీ షిప్యార్డ్ రూ.1,875 కోట్లు, ఫ్రోస్ట్ ఇంటర్నేషనల్ రూ.1,840 కోట్లు, ఫరెవర్ ప్రీసియస్ జ్యువెల్లర్స్ రూ.1,715 కోట్లు, కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ రూ.1663 కోట్ల రుణాలు ఉన్నాయి.
బ్యాంకులకు రుణాలు....
పంజాబ్ నేషనల్ బ్యాంకు నుండి గీతాంజలి జెమ్స్ రూ.4,644 కోట్ల విలువైన రుణాలు తీసుకుంది. ఇవి ఎన్పీఏలుగా ఉన్నాయి. గిలి ఇండియాకు చెందిన రూ.1447 కోట్లు, నక్షత్ర బ్రాండ్స్కు చెందిన రూ.1109 కోట్లు PNBకి రుణదాతలు. టాప్ 10 ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారుల్లోని ఏబీజీ గ్రూప్... ప్రభుత్వరంగ ఎస్బీఐ నుండి రూ.1875 కోట్ల రుణాలు తీసుకుంది. ఈ మొత్తాన్ని ఎస్బీఐ రైటాఫ్ చేసింది. యూకో బ్యాంకు నుండి ఆర్ఈఐ ఆగ్రో రూ.1970 కోట్ల రుణాలు తీసుకుంది.
టాప్ 100 ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారులు..
మార్చి 2020 నాటికి బ్యాంకులు టాప్ 100 ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారులకు చెందిన దాదాపు రూ.62,000 కోట్ల రుణాలను రైటాఫ్ చేసింది. రుణాల రైటాఫ్ అంటే లోన్ మాఫీ చేసినట్లు కాదు. బ్యాంకులు తమ అకౌంట్ బుక్స్ను క్లియర్ చేసుకోవడానికి ఉపకరిస్తుంది. అలాగే తక్కువ ఎన్పీఏ రేషియోను చూపించుకునే అవకాశం కల్పిస్తుంది. అధిక ఎన్పీఏ నిష్పత్తి కలిగిన బ్యాంకు క్రెడిబులిటీ కోల్పోతోంది. అందుకే టెక్నికల్గా బ్యాంకు క్రెడిబులిటీ కోసం లోన్ రైటాఫ్ ఉపయోగపడుతుంది. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ.62,000 కోట్ల రుణాలను రైటాఫ్ చేసినట్లు సమాచార హక్కు చట్టం కింద సమాచార హక్కుల కార్యకర్త బిశ్వనాథ్ గోస్వామి ద్వారా వెల్లడైంది.