భారీ లాభాల నుండి నష్టాల్లోకి, రూ.1.7 లక్షల కోట్ల సంపద ఆవిరి
ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు, మధ్యాహ్నం నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత ఏ దశలోను కోలుకోలేదు. సానుకూల సంకేతాలతో నేడు ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్న సూచీలు మధ్యాహ్నం తర్వాత కుప్పకూలాయి. ఇన్వెస్టర్లు గరిష్టాల వద్ద లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో మార్కెట్లు నష్టపోయాయి. ఉదయం భారీ లాభాల్లో, మధ్యాహ్నం ఊగిసలాట ధోరణితో కనిపించి చివరి గంటలో నష్టపోయింది. సెన్సెక్స్ కీలక మైలురాయి 59,000, నిఫ్టీ 17,500 పాయింట్లను నిలబెట్టుకున్నాయి.
డాలర్ మారకంతో రూపాయి మారకం విలువ 73.48 వద్ద ముగిసింది. సెన్సెక్స్ నేడు దాదాపు 900 పాయింట్ల మేర పైకి, కిందకు కదలాడింది. 59,409.98 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, 59,737.32 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 58,871.73 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,709.65 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,792.95 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,537.65 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 125.27 (0.21%) పాయింట్లు నష్టపోయి 59,015.89 పాయింట్ల వద్ద, నిఫ్టీ 44.35 (0.25%) క్షీణించి 17,585.15 పాయింట్ల వద్ద ముగిసింది.
ప్యాకేజీ ఎఫెక్ట్ కానీ...
కేంద్ర కేబినెట్ ఆటో, టెలికం రంగాలకు ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. దీంతో ఈ రంగాల స్టాక్స్ పరుగులు తీశాయి. ఈ స్టాక్స్ వరుసగా జంప్ చేస్తున్నాయి. ఎయిర్టెల్ షేర్ నేడు కూడా 1.39 శాతం లాభపడింది. బ్యాడ్ బ్యాంకుకు ప్రభుత్వ గ్యారెంటీ నేపథ్యంలో బ్యాంకింగ్ రంగ షేర్లు దూసుకెళ్లాయి. ఇటీవల గరిష్ఠాలకు చేరిన మెటల్ రంగ షేర్లు అధికంగా నష్టపోయాయి. ఆ తర్వాత రియాల్టీ, బేసిక్ మెటీరియల్స్, ఇంధన, విద్యుత్ రంగ షేర్లు నష్టపోయాయి.
గెయినర్స్, లూజర్స్
సెన్సెక్స్ 30 స్టాక్స్లో 12 షేర్లు లాభపడ్డాయి. కొటాక్ మహీంద్రా బ్యాంక్ అత్యధికంగా 5.63 శాతం లాభపడింది. HDFC బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, మారుతీ, యాక్సిస్ బ్యాంక్, నెస్ట్లే, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఆటో, ఐటీసీ షేర్లు లాభపడ్డాయి. టాటా స్టీల్, ఎస్బీఐ, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్, ఐసీఐసీఐ బ్యాంక్, HUL, ఇన్ఫోసిస్ నష్టపోయాయి. స్మాల్, మిడ్ సైజ్ క్యాప్స్ రాణించలేకపోయాయి. నేడు నష్టపోవడంతో మూడు రోజుల లాభాలకు బ్రేక్ పడింది.
రూ.1.7 లక్షల కోట్లు ఆవిరి
స్టాక్ మార్కెట్లు నేడు నష్టపోవడంతో ఇన్వెస్టర్లు నేడు రూ.1.7 లక్షల కోట్ల మేర నష్టపోయారు. ప్రాఫిట్ బుకింగ్ ప్రభావం చూపింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,58,96,243.91 కోట్లుగా ఉంది. రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ.1515380.48 కోట్లు, టీసీఎస్ రూ.1416903.13 కోట్లుగా నమోదయింది.