ఈ వారం ప్రాఫిట్ బుకింగ్.. మార్కెట్ ర్యాలీ కొనసాగేనా? ఐటీ స్టాక్స్పై కన్ను
గత శుక్రవారం వరుసగా ఏడో రోజు మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఐదు సెషన్లలో రెండు సూచీలు 4 శాతానికి పైగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 40,000 మార్క్ను(4.6 శాతం లాభం) దాటగా, నిఫ్టీ 11,900 పాయింట్లకు(4.3 లాభం) చేరుకుంది. ఏడు రోజులపాటు వరుస లాభాల నేపథ్యంలో, ప్రస్తుత పరిస్థితుల్లో ఈవారం ప్రాఫిట్ బుకింగ్స్ కొట్టి పారేయలేమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గతవారం టీసీఎస్ ఫలితాలు మార్కెట్లు పుంజుకోవడానికి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇతర దిగ్గజ కంపెనీల ఫలితాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించారు.
జపాన్ను దాటి 3వ ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా భారత్! నరేంద్ర మోడీ కల ఆలస్యం..
జోష్.. లేదా ప్రాఫిట్ బుకింగ్
కంపెనీల సెప్టెంబర్ త్రైమాసికం ఫలితాల ఆధారంగా పుంజుకోవడం లేదా ప్రాఫిట్ బుకింగ్ ఈ వారం కొనసాగవచ్చుననేది విశ్లేషకుల మాట. ప్రధానంగా ఐటీ దిగ్గజాల ఫలితాలపై దృష్టి సారిస్తున్నారు. విప్రో ఈరోజు (12వ తేదీ), ఇన్ఫోసిస్ 14వ తేదీన, హెచ్సీఎల్ టెక్నాలజీస్ 16వ తేదీన రెండో త్రైమాసికం ఫలితాలను ప్రకటించనుంది. సెప్టెంబర్ ఫలితాలతో పాటు ఈ కంపెనీలు ప్రకటించనున్న మూడో త్రైమాసికం(అక్టోబర్-డిసెంబర్) ఆదాయ అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును ప్రభావితం చేస్తుందని అంటున్నారు. విప్రో బైబ్యాక్ షేర్లను ఇన్వెస్టర్లు గమనిస్తున్నారు.
ఆటో స్టాక్స్ లాభాల్లో ఉండవచ్చు..
ఆయా రంగాల్లోని దిగ్గజ కంపెనీల ఫలితాలను బట్టి ఆయా రంగాల స్టాక్స్ ముందుకు కదలవచ్చు. సెప్టెంబర్ మాసంలో ఆశాజనక విక్రయాలకు తోడు రాబోయే పండుగ సీజన్ నేపథ్యంలో ఆటో, ఆటో సంబంధ స్టాక్స్ లాభాలను చూడవచ్చు. అలాగే, ఆర్బీఐ ప్రకటించిన ద్రవ్య లభ్యత, రుణ వృద్ధి చర్యల కారణంగా నిఫ్టీ బ్యాంకు సూచీ లాభాలు కొనసాగించే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.
బ్యాంకింగ్, ఫార్మా షేర్లు...
ఎఫ్ఎంసీజీ, లోహ, గనుల స్టాక్స్, సిమెంట్ కంపెనీల షేర్లు లాభాల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. పోస్ట్ పెయిట్ కస్టమర్ల కోసం రిలయన్స్ జియో తెచ్చిన కొత్త ఫీచర్ ఈ రంగంలో పోటీకి దారి తీస్తుంది. దీంతో టెల్కో స్టాక్స్ ఊగిసలాట ధోరణిలో ఉండవచ్చు. 13న కర్ణాటక బ్యాంకు, 16న ఫెడరల్ బ్యాంకు ఫలితాలు ఉన్నాయి. ఆ ఫలితాల ఆధారంగా ఫైనాన్షియల్ స్టాక్స్ కదలాడుతుందని చెబుతున్నారు. ఫార్మా షేర్లు మరింతకాలం రాణించే అవకాశాలు ఉన్నాయి.