వెయ్యి పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, ఎల్ఐసీ ఇన్వెస్టర్లకు షాక్
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం (మే 17) లాభాలతో ప్రారంభమయ్యాయి. వరుసగా ఆరు సెషన్ల పాటు నష్టాల్లో ముగిసిన సూచీలు, నిన్న మాత్రం స్వల్పలాభాల్లోకి వచ్చాయి. నేడు సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా లాభాల్లో ట్రేడ్ అవుతోంది. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు, ఆద్యంతం లాభాల్లోనే ఉన్నాయి. మధ్యాహ్నం గం.1.30 సమయానికి సెన్సెక్స్ ఉదయం 53,285.19 పాయింట్ల వద్ద ప్రారంభమై, 54,015.00 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 53,176.02 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 301 పాయింట్లు ఎగిసి 16,143 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. సెన్సెక్స్ ఓ సమయంలో 1000 పాయింట్లకు పైగా క్షీణించింది.
ఆసియా పసిఫిక్ సూచీలు నేడు సానుకూలంగా కదలాడుతున్నాయి. అమెరికా ఫ్యూచర్స్ స్వల్ప లాభాల్లో ఉన్నాయి. మరోవైపు లాక్ డౌన్ కారణంగా ఏప్రిల్ నెలలో చైనాలో పారిశ్రామిక, ఉత్పత్తి కార్యకలాపాలు నెమ్మదించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నేడు ఎల్ఐసీ ఐపీవో షేర్లు ఎక్స్చేంజీల్లో లిస్ట్ అయ్యాయి. ఇన్వెస్టర్లు ప్రధానంగా దీనిపై దృష్టి సారించారు. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 77.72 వద్ద కొనసాగుతోంది.
ఎల్ఐసీ ఐపీవో నిరాశపరిచింది. కోట్లాదిమంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ భారీ ఆశలతో దరఖాస్తు చేసుకున్న ఇన్వెస్టర్లకు నిరాశ తప్పలేదు. లిస్టింగ్ గెయిన్స్ కోసం బిడ్స్ దాఖలు చేసిన ఇన్వెస్టర్లు షాక్ అయ్యారు. ఎన్ఎస్ఈలో ఈ షేర్ ధర రూ.949తో పోలిస్తే 8.11 శాతం క్షీణించి రూ.872 వద్ద లిస్ట్ అయింది. ఈ లెక్కన 15 షేర్లతో కూడిన ఓ లాట్ను రూ.14,235కు కొనుగోలు చేస్తే ఇన్వెస్టర్లకు రూ.1155 లిస్టింగ్ లాస్ అయింది.