ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి, సెన్సెక్స్ 1158 పాయింట్లు డౌన్
స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో ముగిశాయి. డాలర్ మారకంతో రూపాయి ఆల్ టైమ్ కనిష్టానికి చేరుకుంది. సూచీలు వరుసగా ఐదో సెషన్లో నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ బలహీన సంకేతాలు, ద్రవ్యోల్భణ భయాలు సూచీలను కిందకు లాగాయి. దీంతో గురువారం నాటి ట్రేడింగ్లో మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 1158 పాయింట్లు క్షీణించింది. నిఫ్టీ 16వేల కీలక మైలురాయిని కోల్పోయింది.
సెన్సెక్స్ నేడు 53,608 పాయింట్ల వద్ద ప్రారంభమై రోజంతా నష్టాల్లోనే కదలాడింది. 52,702.30 పాయింట్ల వద్ద కనిష్టాన్ని, 53,632.55 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది. చివరకు 1,158.08 (2.14%) పాయింట్లు నష్టపోయి 52,930.31 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 359.10 (2.22%) పాయింట్లు క్షీణించి 15,808.00 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. ఆర్థిక మాంద్యం భయాలు, ద్రవ్యోల్భణం పెరుగుదల ఆందోళనతో అమెరికా మార్కెట్లు కుప్పకూలాయి. ఈ ప్రభావం మనపై పడింది. దీనికి తోడు ఎఫ్ఐఐలు గత కొద్ది రోజులుగా పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు.
ఇక డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ పడిపోయింది. ఈ వారంలోనే రూపాయి రెండుసార్లు ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయింది. ఓ సమయంలో 77.63ను తాకింది. రూపాయి 78కి సమీపంలో ఉంది. ఇదే పరిస్థితి ఉంటే మరింత క్షీణించి 80కి చేరుకోవచ్చునని ఆందోళన వ్యక్తమవుతోంది.