వడ్డీరేట్లు యథాతథం: రెపో రేటు 4%, రివర్స్ రెపో 3.35%
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన కమిటీ(MPC) మంగళవారం నుండి గురువారం వరకు వివిధ అంశాలపై చర్చించింది. ఆర్బీఐ కమిటీ తీసుకున్న నిర్ణయాల గవర్నర్ శక్తికాంత దాస్ నేడు (ఆగస్ట్ 6) మీడియాకు వెల్లడించారు. ఆర్థిక నిపుణులు అంచనా వేసినట్లుగా రెపో రేటును తగ్గించలేదు. రెపో రేటును 4 శాతం వద్ద, రివర్స్ రెపో రేటును 3.35 శాతం వద్ద యథాతథంగా ఉంచినట్లు ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు.
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందని తెలిపారు. ఫైనాన్షియల్ మార్కెట్లు పుంజుకుంటున్నట్లు తెలిపారు. మంచి వర్షాలు, ఖరీఫ్ విత్తనాల విస్తీర్ణంతో వ్యవసాయ రంగ అవకాశాలు మెరుగుపడినట్లు చెప్పారు.
బ్యాంకు రేటు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటును యథాతథంగా ఉంచింది ఆర్బీఐ. వీటి రేటు 4.25 శాతంగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో వరుసగా నాలుగో నెల మర్చంటైజ్డ్ ఎగుమతులు క్షీణించాయని చెప్పారు శక్తికాంత దాస్. 2020-21 ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో ద్రవ్యోల్భణం పెరిగే అవకాశముందని చెప్పారు. అయితే రెండో అర్ధ సంవత్సరంలో కోలుకుంటుందన్నారు. కరోనా నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు ప్రతికూలంగా ఉండవచ్చునని ఆర్బీఐ అంచనా వేసింది. అంతక్రితం సర్వేతో పోలిస్తే జూలైలో వినియోగదారుల విశ్వాసం మరింత సన్నగిల్లినట్లు చెప్పారు.