వ్యవస్థలోకి రూ.20,000 కోట్లు, ధరలు మరింతగా పెరగొచ్చు: వడ్డీరేట్లపై RBI వ్యాఖ్య
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (OMP) కింద ప్రభుత్వ సెక్యూరిటీల విక్రయ కొనుగోళ్లను చేపట్టనుంది. రెండు దశల్లో సగటున రూ.20,000 కోట్ల మొత్తానికి ఈ ప్రక్రియ జరగనుంది. ఆగస్ట్ 27, సెప్టెంబర్ 3వ తేదీల్లో రూ.10,000 కోట్ల చొప్పున రెండు దశల్లో వేలం వేస్తామని తెలిపింది. కరోనా నుండి ఆర్థిక వ్యవస్థ గాడిన పడాలంటే భారీ సంస్కరణలు కావాలని, డిమాండ్ పెరగడానికి సమయం పట్టవచ్చునని ఆర్బీఐ తన వార్షిక నివేదికలో తెలిపింది. ద్రవ్య స్థిరీకరణకు స్పష్టమైన వ్యూహం అవసరమని తెలిపింది. కీలక వడ్డీ రేట్లను బ్యాంకులు కస్టమర్లకు బదలాయించడంపై స్పందిస్తూ పర్వేలేదని తెలిపింది. అలాగే నగదు చెలామణి పెరిగిందని వెల్లడించింది.
లిక్విడిటీ తగినంత అందుబాటులో ఉంచేందుకు
వ్యవస్థలో లిక్విడిటీ తగినంత ఉండడానికి ఆర్బీఐ ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా నిర్వహించనున్న రెండుదశల బాండ్స్ కొనుగోలు ప్రక్రియతో వ్యవస్థలోకి రూ.20,000 కోట్లను పంప్ చేయాలని నిర్ణయించింది. ఆగస్ట్ 27న రూ.10,000 కోట్లకు బాండ్స్ వేలం నిర్వహిస్తుంది. సెప్టెంబర్ 3న మరో దశ వేల ప్రకటన ఉంటుంది. వ్యవస్థలో ద్రవ్య లభ్యతకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటోంది.
ధరలు పెరగొచ్చు
ఆహారం, తయారీ వస్తువుల సరఫరాల్లో ఇబ్బందుల కారణంగా రానున్న కొద్ది నెలల కాలంలో ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2019-20 చివరి నెలల్లో పెరుగుతూ వచ్చిన ద్రవ్యోల్బణం 2020-21 తొలి 6 నెలల్లో నిర్దేశిత స్థాయిల్ని దాటింది. ఫైనాన్షియల్ మార్కెట్లలో ఒడిదుడుకులే కారణం. కూరగాయలు, పప్పు దినుసులు, చేపలు, మాంసం వంటి ఆహార ధరలు పెరుగుదల వల్ల రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో 6.93%కు పెరిగింది. ఆహార నిల్వల నిర్వహణ సవాల్ అని పేర్కొంది.
జనవరి నుండి వృద్ది బాట
భారత ఆర్థిక వ్యవస్థ జనవరి నుండి వృద్ధి బాట పట్టవచ్చునని ఆర్బీఐ తన నివేదికలో తెలిపింది. సెప్టెంబర్ వరకు మందగమనం పరిస్థితులు, డిసెంబర్ నాటికి రికవరీ దశ ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి-మార్చి) నుండి ఆర్థిక రంగం వృద్ధి బాటలోకి వెళ్లే అవకాశముంది. దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉందని, నిలకడైన వృద్ధికి మరిన్ని భారీ సంస్కరణలు అవసరమని తెలిపింది. భూ, కార్మిక, విద్యుత్ రంగాల్లో జీఎస్టీ తరహా కౌన్సిల్ ఏర్పాటు చేయాలని సూచించింది. ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడంలో ప్రభుత్వానిదే కీలక పాత్ర అని, వాతావరణ మార్పులు వ్యవసాయ రంగానికి కాస్త దెబ్బ అని తెలిపింది.
వినియోగం కీలకం.. వడ్డీ రేట్లు అందుబాటులో ఉండాలి
ఆర్థిక వ్యవస్థ కరోనా నుండి బయటపడి పూర్వస్థితికి చేరుకోవాలంటే ప్రభుత్వ వినియోగమే కీలకమని పేర్కొంది ఆర్బీఐ నివేదిక. రాబోయే కొన్నేళ్లలో ద్రవ్య స్థిరీకరణ విషయంలో స్పష్టమైన నిష్క్రమణ వ్యూహం ప్రభుత్వానికి ఉండాలని పేర్కొంది. కరోనా కారణంగా ద్రవ్య లక్ష్యాలను చేరడం సవాల్ అని పేర్కొంది. ఆర్బీఐ తగ్గించిన రెపో రేట్లకు అనుగుణంగా బ్యాంకులు కస్టమర్లక మార్పులు చేయడం మెరుగుపడిందని నివేదికలో తెలిపింది. వడ్డీ రేట్లు అందుబాటులో ఉంటేనే నిధుల ప్రవాహానికి ఊరట లభిస్తుందని, తద్వారా పెట్టుబడులు పెరుగుతాయని ఆర్బీఐ పేర్కొంది. కరోనాకు ముందు కూడా రుణాల వృద్ధి తగ్గిందని పేర్కొంది.
బ్యాంకింగ్ మోసాలు
బ్యాంకుల్లో మోసం జరిగిన తేదీకి, ఆ విషయాన్ని పసిగట్టడానికి మధ్య సగటున రెండేళ్ల సమయం కనిపించిందని ఆర్బీఐ పేర్కొంది. ఈ మోసాలు రెట్టింపు కావడం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 2018-19లో రూ.71,500 కోట్ల బ్యాంకింగ్ మోసాలు జరిగితే, ఆ తర్వాత 2020 జూన్ నాటికి ఈ మొత్తం రూ.1.85 లక్షల కోట్లకు చేరింది. ఫ్రాడ్ కేసులు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో వార్షికంగా 234% పెరిగితే, ప్రయివేటురంగ బ్యాంకుల్లో 500% పైగా ఉంది. డిజిటల్ చెల్లింపుల్లో గత మూడేళ్లలో 18 శాతం పెరుగుదల ఉన్నట్లు తెలిపింది. గత మూడేళ్లలో నకిలీ నోట్లు 43 శాతం మేర తగ్గాయని తెలిపింది. డిజిటల్ చెల్లింపులు గత మూడేళ్లలో సంఖ్యా పరంగా 135 శాతం కాగా, వ్యాల్యూ పరంగా 18.48 శాతంగా ఉంది.