రాకేష్ ఝున్ఝున్వాలాకు భారీ షాక్: కుప్పకూలిన ఫేవరేట్ స్టాక్స్, రూ.కోట్ల సంపద హుష్కాకి!
ముంబై: గత ఆరు రోజులుగా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. మార్కెట్ నష్టాలు చిన్న ఇన్వెస్టర్ల నుండి మొదలు పెద్ద ఇన్వెస్టర్ల వరకు అందరిపై భారీ ప్రభావం చూపించాయి. బిగ్ బుల్ రాకేష్ ఝున్ఝున్వాలా ఇన్వెస్ట్ చేసిన పలు స్టాక్స్ కుప్పకూలాయి. ఇందులో కొన్ని స్టాక్స్ 24 శాతం మేర క్షీణించాయి. సెప్టెంబర్ 16వ తేదీ నుండి సెన్సెక్స్ దాదాపు 6 శాతం, నిఫ్టీ 5.7 శాతం మేర నష్టపోయాయి. కరోనా సమయంలో ఆరు నెలల కాలంలో ఝున్ఝున్వాలా ఇన్వెస్ట్ చేసిన పలు స్టాక్స్ మంచి లాభాలు ఇచ్చాయి. కొన్ని స్టాక్స్ రెండింతల కంటే ఎక్కువ లాభాలను అందించాయి.
టాటా గ్రూప్Xమిస్త్రీ గ్రూప్: 70 ఏళ్ళ బంధం.. వ్యాల్యుయేషన్ సవాలేనా?
ఝున్ఝున్వాలా ఇన్వెస్ట్ చేసిన ఈ షేర్లు క్షీణించాయి
- ఎడెల్వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో రాకేష్ ఝున్ఝున్వాలాకు 1.19 శాతం మేర వాటా ఉంది. ఈ స్టాక్స్ ఆరు రోజులుగా నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. గత వారం రూ.70కి పైగా ఉన్న ఈ స్టాక్స్ నేడు (గురువారం, సెప్టెంబర్ 24) రూ.56కు క్షీణించాయి. సెప్టెంబర్ 16వ తేదీ నుండి 24 శాతం మేర నష్టపోయింది.
- డిష్మాన్ కార్బోజెన్ అమ్సీస్లో ఝున్ఝున్వాలాకు 3.18 శాతం వాటా ఉంది. ఇది 18 శాతం మేర క్షీణించింది. రూ.170కి పైగా ఉన్న షేర్ ధర రూ.146కు దిగి వచ్చింది.
- ఆటోలైన్ ఇండస్ట్రీస్లో 6.48 శాతం వాటా ఉంది. ఈ ఆరు సెషన్లలో 17 శాతం మేర క్షీణించింది. రూ.32కు పైగా ఉన్న షేర్ ధర రూ.26కు దిగి వచ్చింది.
- కరూర్ వైశ్య బ్యాంకులో ఝున్ఝున్వాలాకు షేర్లు ఉన్నాయి. ఈ షేర్ ధర వరుసగా ఎనిమిది రోజులుగా నష్టపోతోంది. ఈ సెషన్లలో 13.64 శాతం మేర నష్టపోయి ఈ రోజు రూ.32 వద్ద ఉంది. సెప్టెంబర్ 14వ తేదీన షేర్ ధర రూ.37గా ఉంది.
పది శాతానికి పైగా నష్టాల్లో..
రాకేష్ ఝున్ఝున్వాలా ఫేవరేట్గా భావించే పలు కంపెనీల షేర్లు ఇటీవల అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇందులో ఎడెల్వీస్, డిష్మన్ కార్బొజెన్, ఎస్కార్ట్స్, ప్రకాశ్ ఇండస్ట్రీస్, వీఐపీ ఇండస్ట్రీస్, జీఎంఆర్ ఇన్ఫ్రా, మందానా రిటైల్స్, అయాన్ ఎక్స్చేంజ్, ఇండియన్ హోటల్స్, ఫెడరల్ బ్యాంక్ వంటివి ఉన్నాయి. ఈ షేర్లు దాదాపు పది శాతానికి పైగా నష్టపోయాయి.
టైటాన్, ఎస్కార్ట్ వంటి దిగ్గజ కంపెనీల్లో...
- ఝున్ఝున్వాలా బిగ్గెస్ట్ స్టాక్ హోల్డింగ్ టైటాన్ కంపెనీ స్టాక్స్ ఈ ఐదు సెషన్లలో 7 శాతం మేర నష్టపోయింది. టైటాన్ గ్రూప్ కంపెనీలో ఝున్ఝున్వాలాకు రూ.5000 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. రూ.1200కు సమీపంలో ఉన్న షేర్ ధర ఈ రోజు రూ.1,103 వద్ద ట్రేడ్ అవుతోంది.
- ఎస్కార్ట్ కంపెనీలో రాకేష్ ఝున్ఝున్వాలాకు రూ.1000 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. ఇది 4.7 శాతం మేర నష్టపోయింది. క్రిసిల్, లుపిన్ వరుసగా 3 శాతం, 1.18 శాతం మేర నష్టపోయాయి.