ఈ వారం బంగారం ధరలు ఎలా ఉండవచ్చు, మార్కెట్పై వీటి ప్రభావం
ముంబై: గతవారం బంగారం ధరలు దాదాపు స్థిరంగా ఉండగా, మార్కెట్ మాత్రం నష్టపోయింది. మార్కెట్ సెంటిమెంట్ ఈవారం కూడా బలహీనంగా ఉండవచ్చునని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, దేశీయంగా పెరుగుతున్న కేసుల నేపథ్యంలో మార్కెట్ ఒడిదుడుకుల్లో కొనసాగవచ్చునని భావిస్తుననారు. ఐటీ షేర్లు సానుకూలంగా కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఐటీఆర్, క్యాష్ వోచర్, పాన్-ఆధార్ లింక్: గడువు మార్చి 31 వరకే... వెంటనే ఇవి పూర్తి చేయండి
బంగారం, వెండి అంచనాలు
గోల్డ్ ఏప్రిల్ కాంట్రాక్ట్ ఈ వారం రూ.44,670 కంటే దిగువకు వస్తే రూ.43,900 వరకు పడిపోయే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ధరలు పెరిగితే రూ.45,495 వద్ద నిరోధకం ఉంటుంది. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.45,850 పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వెండి మే కాంట్రాక్ట్ కిలో రూ.67,166 కంటే దిగువకు వస్తే రూ.66,730 వరకు దిద్దుబాటుకు లోను కావొచ్చు.
మార్కెట్ ఎలా ఉండొచ్చు
గతవారం నిఫ్టీ 15052-14350 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు 287 పాయింట్ల నష్టంతో 14744 వద్ద ప్రతికూలంగా ముగిసింది. ఈ వారంలో14450 కంటే దిగువకు వస్తే స్వల్పకాలిక ట్రెండ్ బేరిష్ కావొచ్చు. నిఫ్టీ బ్రేక్ అవుట్ 15,050, బ్రేక్ డౌన్ 14,450. 14,800 పాయింట్ల పైకి చేరుకుంటే షార్ట్ కవరింగ్ ర్యాలీకి అవకాశముందని, 15000 దాటి 15300 దిశగా ఉండవచ్చునని అంటున్నారు.
వీటి ప్రభావం
అమెరికా బాండ్ యీల్డ్స్ పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ఉండటంతో గత వారం సూచీలు నష్టాల్లో ముగిశాయి. దీనికి ద్రవ్యోల్భణ భయాలు కలిశాయి. దేశంలో కరోనా సెకండ్ వేవ్, పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ ఆందోళన కలిగిస్తోంది. గత వారం సెన్సెక్స్ 49,858 పాయింట్ల వద్ద ముగిసింది. FPIలు నికరంగా రూ.5894 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేయగా, డీఐఐలు రూ.3037 కోట్ల విలువైన షేర్లు విక్రయించారు. సూచీలు ఈ వారం స్థిరీకరించుకునే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఈ వారం మార్కెట్ పైన కరోనా సెకండ్ వేవ్, అంతర్జాతీయ పరిణామాలు, మార్చి డెరివేటివ్ కాంట్రాక్ట్ ముగింపు వంటి అంశాలు ప్రభావం చూపవచ్చు.