పీఎన్ వాసుదేవన్-ఓ మోడల్ మిలియనీర్-ఉద్యోగుల్ని కదిలించిన ఎండీ రాజీనామా
మన దేశంలో ఏదైనా ఓ కంపెనీ స్టాక్ ఎక్చేంజ్ లో లిస్ట్ అయినప్పుడు ఆ కంపెనీ వ్యవస్ధాపకుల సంపద ఎంత పెరిగిందనే లెక్కలు వేసుకుంటుంటాం. కానీ చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే సదరు కంపెనీల యజమానుల సంపద కంటే అందులో ఉద్యోగులకు, సంస్ధకూ ఎక్కువ ప్రయోజనం కలిగిందని అనుకుంటాం. అలాంటి ఓ అరుదైన సందర్భం గత వారం దేశీయ మైక్రో ఫైనాన్స్ కంపెనీ ఈక్విటాస్ హోల్డింగ్స్ లిస్ట్ అయినప్పుడు జరిగింది. కంపెనీ వ్యవస్ధాపకుడు పీఎన్ వాసుదేవన్ తాజాగా రాజీనామా చేయడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది.
ఈక్విటాస్ ఎండీ రాజీనామా
దేశంలో మైక్రో ఫైనాన్స్, స్మాల్ ఫైనాన్స్ రంగంలో వేగంగా విస్తరిస్తున్న సంస్ధల్లో ఒకటైన ఈక్విటాస్ హోల్డింగ్స్ తాజాగా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. దాదాపు 15 ఏళ్ల శ్రమ తర్వాత ఈ కంపెనీ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయింది. దీని వెనుక కీలకంగా ఉన్న వ్యవస్ధాపకుడు, ఎండీ పీఎన్ వాసుదేవన్ మాత్రం తాజాగా రాజీనామా చేశారు. కంపెనీ నిర్వహణ విషయంలో వాటాదారుల నుంచి ఎదురైన ఒత్తిడితో ఆయన పగ్గాల్ని వదులుకున్నారు.
అయితే ఇతర కంపెనీల్లో వ్యవస్ధాపకుల రాజీనామాల్లా కాకుండా వాసుదేవన్ రాజీనామా ఉద్యోగుల్లో ఎంతో ఆవేదన, ఉద్వేగం నింపింది. దీని వెనుక చాలా బలమైన కారణాలే ఉన్నాయి.
ఎవరీ వాసుదేవన్?
చెన్నైలోని ఓ సంప్రదాయ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన పీఎన్ వాసుదేవన్ ఓ సంస్కృత లెక్చరర్ కుమారుడు. మార్క్యూ, మురుగప్ప గ్రూప్ నిర్వహిస్తున్న చోళమండలం ఫైనాన్స్ సంస్ధలో ఓ చిన్న ఉద్యోగిగా తన ప్రస్ధానాన్ని ప్రారంభించిన వాసుదేవన్ అంచెలంచెలుగా ఎదిగారు. ముంబైకి తరచూ వ్యాపార నిమిత్తం పర్యటనలు చేస్తున్న వాసుదేవన్.. చివరికి అదే నంగరంలో డెవలప్మెంట్ క్రెడిట్ బ్యాంక్ లో చేరేలా చేసింది. అయితే స్ధానికంగా పరిస్ధితులు సహకరించకపోవడంతో తిరిగి చెన్నైకి వచ్చిన వాసుదేవన్ ఉద్యోగాల అన్వేషణలో పడ్డారు.
మైక్రో ఫైనాన్స్ రంగంలో అడుగులు
మైక్రోఫైనాన్స్ వ్యాపారం వాసుదేవన్ దృష్టిని ఆకర్షించింది. కొంతమంది మైక్రో ఫైనాన్షియర్స్ ను సంప్రదించినా వారు మాత్రం వాసుదేవన్ సొంతంగానే వ్యాపారం చేస్తే మంచిదని సూచించారు. కానీ చేతిలో డబ్బులేదు. ఆ దశలో కుటుంబమంతా వ్యతిరేకించినా ఇంటిపై పందెం కట్టి గెలిచారు. చోళమండలం సంస్ధలో తన మాజీ బాస్ ఆనందన్, మురుగప్ప గ్రూప్ కుటుంబ సభ్యులు సహకరించడంతో 2007లో ఈక్విటాస్ ఆవిర్భవించింది. అక్కడి నుంచి వాసుదేవన్ వెనక్కి తిరిగి చూసుకోలేదు.
ఈక్విటాస్ ప్రస్ధానం
ఈక్విటాస్ హోల్డింగ్స్ సంస్ధను మైక్రో ఫైనాన్స్ రంగంలో మేటిగా తీర్చిదిద్దేందుకు వాసుదేవన్ తీవ్రంగా శ్రమించారు. ఓవైపు ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడుతూనే మరోవైపు సంస్ధను ఒక్కో మెట్టూ ఎక్కించేందుకు ప్రయత్నించారు. నీతి నిజాయితీల్ని మాత్రమే నమ్ముకున్న ఆయన శ్రమ ఫలించింది. అనతికాలంలోనే ఈక్విటాస్ హోల్డింగ్స్ మార్కెట్లో ప్రభావం చూపడం మొదలుపెట్టింది. ముఖ్యంగా గృహ,వాహన రుణాల రంగంలో మంచి పేరు తెచ్చుకుంది. సంస్ధలో అంతర్గతంగా కూడా వాసుదేవన్ ప్రొఫెషనలిజంతో పాటు ఉద్యోగుల ప్రయోజనాలకు పెద్దపీట వేశారు. టాప్ ఎగ్జిక్యూటివ్ జీతం రూ.40వేలు మించకూడదని సూచించారు. తన జీతం కూడా తగ్గించమని కంపెనీ బోర్డుకు అభ్యర్ధన పెట్టి ఆశ్చర్యపరిచారు.
సామాజిక సేవలో మేటి
దేశంలో పెద్ద పెద్ద కార్పోరేట్ దిగ్గజ కంపెనీలు సైతం సామాజిక బాధ్యతపై కేవలం 2 శాతం మొత్తం ఖర్చు చేస్తున్న సమయంలో చిన్న మైక్రో ఫైనాన్స్ కంపెనీ అయిన ఈక్విటాస్ హోల్డింగ్స్ 5 శాతం ఖర్చు చేసేందుకు ముందుకొచ్చింది. దిని వెనుక ఉన్నదీ వాసుదేవన్ ఆలోచనలే. ప్రభుత్వం కార్పోరేట్ సామాజిక బాధ్యత కింద 2 శాతం మొత్తం ఖర్చు చేయాలన్న నిబంధన తీసుకురావడానికి సంవత్సరాల ముందే వాసుదేవన్ 5 శాతం నిబంధన తీసుకొచ్చారు.
ఉద్యోగుల్లో ఉద్వేగం
ఈక్విటాస్ సంస్ధలో వాసుదేవన్ తో పాటు మిగతా ఉద్యోగులు కూడా గరిష్టంగా 15 శాతం వాటా మాత్రమే కలిగి ఉండేలా మరో నిబంధన తీసుకొచ్చారు. ఇంతకంటే ఎక్కువ ఉంటే అది కంపెనీ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని వాసుదేవన్ భావించారు. ఇప్పుడు కంపెనీలో 8,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇంత తక్కువ మంది ఉద్యోగులతో అద్భుతాలు చేయడం సాధ్యమేనా అంటే సాధ్యమే అంటారు వాసుదేవన్. ద్వితీయ శ్రేణి నాయకత్వం లేకుండా కంపెనీపై వాటాదారుల్లో నమ్మకం కలిగించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు అనిర్వచనీయమైనవి.
అందుకే ఇప్పుడు ఆయన ఎండీ పదవి నుంచి తప్పుకున్నారని తెలియగానే ఉద్యోగులు ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. ఈ పరిణామం కంపెనీ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపకూడదని వారు కోరుకుంటున్నారు.