కరోనా ఎఫెక్ట్: షాకింగ్.. ఇకపై రోజుకు 12 గంటలు పనిచేయాల్సిందే!
మాయదారి మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచంలో అనేక మార్పులు తీసుకొస్తోంది. తాజాగా దేశంలోని కార్మికులందరికీ వెన్నులో వణుకు పుట్టించే మార్పు ఒకటి తీసుకు రాబోతోంది. చైనా లో మొదలైన ఈ బీమారి (వ్యాధి)... మొత్తం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. పేద, పెద్ద తేడా లేకుండా అందరినీ వణికిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో దీర్ఘకాలిక లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ప్రజలు ఇండ్లలోనే ఉండేలా ప్రభుత్వాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి.
దీంతో చాలా మందికి ఉపాధి కరువై బతుకు బరువై పోతోంది. ఒకవైపు ప్రాణాంతక వైరస్ తో పోరాటం చేస్తూనే మరో వైపు బతుకుదెరువు కోసం ఏం చేయాలో పాలు పోక ఆపసోపాలు పడుతున్నారు. లాక్ డౌన్ వల్ల అన్ని రకాల పరిశ్రమలు మూతపడటంతో ఉత్పత్తి నిలిచిపోయింది. అమ్మకాలు పడిపోయాయి. అయితే మరికొన్ని రోజుల్లో లాక్ డౌన్ సడలించే అవకాశాలు కనిపిస్తుండటంతో ప్రజలంతా మళ్ళీ తమ తమ కార్యకలాపాలు కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు.
కానీ ఇక్కడే ఒక కొత్త చిక్కొచ్చి పడుతోంది. కరోనా వైరస్ తో వచ్చిన లాక్ డౌన్ కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు పారిశ్రామిక సంఘాలు కొత్త ఎత్తుగడ వేస్తున్నాయి. దాంతో శ్రామిక వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంటోంది.
కొత్తవారికి ఈ హోమ్లోన్పై వడ్డీ రేటు పెంపు, ఎంత తీసుకుంటే ఎంత?
ఒడిషా, గోవా లో 12 గంటలు...
కార్మికులతో అధిక పనిగంటలు పనిచేయించుకునేందుకు అనుమతులు ఇవ్వాలని పారిశ్రామిక సంఘాల నుంచి ఎదురవుతున్న ఒత్తిడితో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే తమ రాష్ట్రాల్లో లేబర్ చట్టాలను సవరిస్తున్నాయి. ఈ మేరకు ఫ్యాక్టరీల చట్టం 1948 నిబంధనలు సడలిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం రోజులో 8 గంటలు మాత్రమే పనిచేయాలనే నియమం ఇకపై వర్తించదు.
కొత్త నిబంధనల ప్రకారం శ్రామికులతో రోజుకు 12 గంటలు పనిచేయించుకోవచ్చు. ఇప్పటికే ఈ విధానానికి ఒడిషా, గోవా రాష్ట్రాలు పచ్చ జెండా ఊపాయి. త్వరలోనే కర్ణాటక కూడా ఇదే విధానాన్ని అమలు చేయబోతున్నట్లు సమాచారం. మహారాష్ట్ర కూడా ఈ మేరకు కొన్ని సడలింపులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ది టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక ప్రత్యేక కథనంలో వెల్లడించింది. ఐతే ఈ నిర్ణయాన్ని లెఫ్ట్ పార్టీల అనుబంధ కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అలాగే కాంగ్రెస్ అనుసంధాన ఐఎన్టీయూసి కూడా వ్యతిరేకిస్తోంది.
తెలుగు రాష్ట్రాల సంగతేమిటి?
సహజంగానే తెలుగు రాష్ట్రాలు పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక చర్యలు తీసుకునేందుకు సర్వదా సిద్ధంగా ఉంటాయి. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం భారీగా విస్తరించి ఉన్న తెలంగాణ అయితే ఇప్పటికే ఆ రంగానికి అవసరమైన సడలింపులు ఇచ్చేసింది. కానీ, ఇతర రంగాల్లో 8 గంటల పని మాత్రమే అమల్లో ఉంది.
ఆంధ్ర ప్రదేశ్ లో ఉత్పత్తి, తయారీ కంపెనీలు పెద్ద ఎత్తున ఉండటంతో ఇప్పుడు ఆ రాష్ట్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి. దేశంలో రెండు మూడు రాష్ట్రాలు ఒక విధానాన్ని అమలు చేస్తే... మిగితా రాష్ట్రాలపై కూడా ఆ మేరకు ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి, మిగితా రాష్ట్రాలు కూడా అవే నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. దీంతో ఇక దేశమంతా 12 గంటల పని అనేది సర్వ సాధారణ విషయం అయ్యే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఇందుకు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ కూడా అతీతమేమి కాబోవని చెబుతున్నారు.
ఓవర్ టైం పేమెంట్...
అయితే ప్రస్తుతం ఉన్న 8 గంటల పని విధానం స్థానే... 12 గంటల పని అమలు చేస్తే ఆ మేరకు కార్మికులకు అదనంగా ఓవర్ టైం (ఓటీ) భత్యం చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉత్తర్వుల్లో పేర్కొంటున్నాయి. మరోవైపు ప్రస్తుత నిర్ణయాలు కేవలం వచ్చే 3 నెలల వరకు మాత్రమే అమల్లో ఉంటాయని, అది కూడా కరోనా వైరస్ లాక్ డౌన్ తో నష్టపోయిన ఉత్పత్తిని పూడ్చుకునేందుకు మాత్రమేనని ప్రభుత్వాలు చెబుతున్నాయి.
కానీ, ఒకసారి ఇలాంటి నిబంధనలు అమల్లోకి తీసుకొస్తే.. వాటిని వెనక్కి తీసుకోవటం కష్టతరమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే, ఇది ఒక్క మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి మాత్రమే పరిమితం కాదని, మిగితా అన్నిరంగాలు కూడా అమలు చేస్తే కార్మికులు తీవ్ర శారీరక, మానసిక ఒత్తిడికి లోనవుతారని విశ్లేషిస్తున్నారు. అలాగే, ఓటీ భత్యం చెల్లించే పదం కేవలం కాగితాలకే పరిమితం అవుతుందని, ఆచరణలో అది సాధ్యం కాకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.