పెట్రోల్, డీజిల్పై పన్ను తగ్గింపులేదు: నిర్మలా సీతారామన్, వీటికి మినహాయింపులేదు
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలపై పన్ను రేట్లు తగ్గించే యోచన ప్రభుత్వానికి లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోకసభలో స్పష్టం చేశారు. సభలో అడిగిన ఓ ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర పన్నులు పెట్రోలు విక్రయ ధరలో సగం వరకు ఉండగా, డీజిల్ విక్రయ ధరలో నలభై శాతం వరకు ఉన్నాయి. ప్రస్తుతానికి వీటిపై సుంకాలు తగ్గించే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని చెప్పారు.
మోడీ అతిపెద్ద కలకు ఫ్లిప్కార్ట్, అమెజాన్ అడ్డంకి!'
ట్యాక్స్ తగ్గించే ప్రతిపాదన లేదు
పెట్రోల్, డీజిల్ పైన ట్యాక్స్ తగ్గించే ప్రతిపాదన లేదని నిర్మల చెప్పారు. కొద్ది రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు క్రమంగా పెరుగుతుండటం వల్ల దేశీయంగా పెరుగుతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకు వస్తారా అని అడిగిన ప్రశ్నకు నిర్మల సమాధానం ఇచ్చారు. దీనిపై చర్చలు జరుగుతున్నాయని, వీటిపై ఎలాంటి జీఎస్టీని విధించడం లేదన్నారు. రేట్లపై మాత్రం జీఎస్టీ కౌన్సెల్ తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కౌన్సెల్లో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉన్నారు. పెట్రోల్, డీజిల్పై కేంద్రం సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ పన్నులను వసూలు చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వాలు లెవీ ట్యాక్స్ విధిస్తున్నాయి.
తయారీ కిందకు వీటిని తీసుకు రావట్లేదు
తక్కువ కార్పోరేట్ పన్ను ప్రయోజనాన్ని అందించే కొత్త తయారీ కంపెనీల నిర్వచనం నుంచి ప్రభుత్వం గనులను తొలగించింది. సభలో పన్ను చట్టాలు (సవరణ) బిల్లు-2019కు ఆమోదం లభించిన తర్వాత నిర్మల మాట్లాడారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొన్ని కార్యకలాపాలను తయారీ కిందకు తీసుకు రావడం లేదన్నారు. అందులో కంప్యూటర్ సాఫ్టువేర్ అభివృద్ధి, పుస్తకాల ప్రింటింగ్, గనులు ఉన్నట్లు చెప్పారు.
వీటికి తక్కువ పన్ను రేటు వర్తించదు
పైన పేర్కొన్న వాటికి కొత్త తయారీ కంపెనీలకు అనుమతి ఇచ్చే తక్కువ కార్పోరేట్ పన్ను విధానాన్ని అమలు చేయడం లేదని నిర్మల చెప్పారు. కంప్యూటర్ సాఫ్టువేర్ అభివృద్ధి, పుస్తకాల ప్రింటింగ్, గనులతో పాటు మార్బుల్ బ్లాక్స్ను స్లాబులుగా మార్చినా, బాటిళ్లలోని గ్యాస్ను సిలిండర్గా మార్చినా, సినిమాటోగ్రాఫ్ ఫిల్మ్ను ఉత్పత్తి చేసినా కూడా తక్కువ పన్ను రేటు వర్తించదని స్పష్టం చేశారు.
అలా అయితే పన్ను క్లెయిమ్ చేసుకోవచ్చు..
దేశీయ కంపెనీలు ఆదాయపన్ను చట్టం కింద కొన్ని మినహాయింపులను క్లెయిమ్ చేసుకోకుంటే అలాంటి వాటికి 22% పన్నును కట్టేలా కొత్త అవకాశమిస్తున్నారు. అదే సమయంలో అక్టోబర్ 1న లేదా ఆ తర్వాత ఏర్పడిన కొత్త దేశీయ తయారీ కంపెనీలకు 15% పన్ను రేటు వర్తిస్తుంది. ఇవి కూడా కొన్ని మినహాయింపులకు క్లెయిమ్ చేసుకోకపోతే ఆ పన్ను వర్తిస్తుంది. ఈ ఆర్డినెన్స్కు ముందు రూ.400 కోట్ల వరకు వార్షిక టర్నోవర్ కలిగిన దేశీయ కంపెనీలు 25% పన్ను రేటు, ఇతర దేశీయ కంపెనీలకు 30% పన్ను రేటు వర్తించేది. సెప్టెంబర్లో కార్పోరేట్ ట్యాక్స్ తగ్గించడానికి ప్రభుత్వం అప్పుడే ఆర్డినెన్స్ జారీ చేసింది. దానికి సవరణలతో కేంద్రం బిల్లు తీసుకు వస్తోంది.
పెట్టుబడులు, ఉద్యోగాల కోసమే..
పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన కోసమే ఇటీవల కంపెనీలపై కార్పోరేట్ ట్యాక్స్ తగ్గించినట్టు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇప్పటికే మంచి ఫలితాలు ఇస్తున్న సంకేతాలు వెలువడుతున్నాయన్నారు. జీడీపీ వృద్ధి రేటు అయిదేళ్ల కనిష్టానికి పడిపోవడంతో సెప్టెంబర్ 20న ప్రభుత్వం కార్పోరేట్ ట్యాక్స్ను 34.94% నుంచి 25.17% తగ్గించింది. కొత్తగా ఉత్పత్తి యూనిట్లు ప్రారంభిస్తే కంపెనీలపై విధించే పన్నును 15 శాతానికి తగ్గించింది. అమెరికా - చైనా ట్రేడ్ వార్ నేపథ్యంలో ఇది అవసరమైనట్లు తెలిపారు.