అక్కడ 24 వేల టన్నుల బంగారం, గోల్డ్ బ్యాంక్ అవసరం
ప్రజల వద్ద ఉన్న భౌతిక బంగారాన్ని నగదీకరించేలా దేశంలో గోల్డ్ బ్యాంకు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మాజీ డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ అన్నారు. బుధవారం డిజిటల్ లెండింగ్ ఫిన్టెక్ సంస్థ రుపీక్ నిర్వహించిన వర్చువల్ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా గోల్డ్ బ్యాంక్ అవశ్యకత గురించి మాట్లాడారు. గోల్డ్ బ్యాంకు కోసం కొత్త లైసెన్సింగ్ పాలసీతో పాటు బంగారం ప్రామాణికతతో ప్రత్యేకంగా నగదు నిల్వల నిష్పత్తి, చట్టబద్ద ద్రవ్య నిష్పత్తిని ప్రవేశపెట్టవలసి ఉందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రగతికి పసిడి నగదీకరణ దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. భారతీయులకు బంగారం సెంటిమెంట్ అని, దీనిని అలాగే ఉంచుకోవడానికి ఇష్టపడతారని, కానీ నగదీకరించుకోరన్నారు.
ఇళ్లు, మతపరమైన ట్రస్ట్స్, సంస్థల వద్ద 23వేల నుండి 24వేల టన్నుల వరకు బంగారం ఉండవచ్చునని అభిప్రాయపడ్డారు. ఇదంతా వృథాగా ఉండిపోతోందన్నారు. దీనిని నగదుగా మార్చితే ప్రజలకు, ప్రభుత్వాలకు, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు లాభం ఉంటుందన్నారు. పలు కీలక రంగాల అభివృద్ధికి ఎన్నో పెట్టుబడులు అవసరమని చెప్పారు. బంగారం నగదీకరణతో పెట్టుబడులు వంటి అవసరాలు తీరుతాయన్నారు. ముఖ్యంగా విదేశీ పెట్టుబడులపై ఆధారపడవలసిన అవసరం తగ్గుతుందని చెప్పారు. అయితే ప్రజల మనస్తత్వం మారితేగానీ పసిడి నగదీకరణ విజయం సాధించగలదని, అయితే అది అంత సులభం కాదన్నారు.
ప్రజల వద్ద ఉన్న ఫిజికల్ బంగారాన్ని సేకరించి, దానిని నగదీకరించాలి. లేదా డిజిటల్గా మార్చాలి. ఇందుకు వినూత్న ఆలోచన అవసరం. ప్రజలు, సంస్థలు తమ వద్ద ఉన్న బంగారు నగలు, నాణేలతో పాటు ఇతర రూపంలో ఉన్న పసిడిని ఈ గోల్డ్ బ్యాంకులో డిపాజిట్ చేయవచ్చు. తద్వారా రుణాలు పొందవచ్చు. భౌతిక బంగారాన్ని నగదుగా మార్చేందుకు ఈ బ్యాంకు ఉత్ప్రేరకంగా పని చేయాలి. ప్రజలు కూడా ఫిజికల్ బంగారంపై ఇన్వెస్ట్ చేయడం కాకుండా గోల్డ్ డిపాజిట్స్, గోల్డ్ మెటల్ లోన్లు, గోల్డ్ బాండ్స్, గోల్డ్ ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్ చేసేలా ప్రభుత్వం ఇప్పటికే ప్రయత్నాలు చేస్తోంది. గోల్డ్ బ్యాంకు దీనిని మరింత ప్రోత్సహించాలి.