వసూలు చేసిన ఛార్జీలు చెల్లించండి: కస్టమర్లకు ఐటీ శాఖ గుడ్న్యూస్
ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుండి రూపే కార్డులు, బీమ్-యూపీఐ మార్గంలో చెల్లింపులు జరిపిన వారికి విధించిన ఛార్జీలను రీఫండ్ చేయాలని బ్యాంకులకు ఆదాయపు పన్ను శాఖ సూచించింది. మున్ముందు కూడా ఈ రెండు విధానాల్లో జరిపే ట్రాన్సాక్షన్స్ పైన ఎలాంటి ఛార్జీలు విధించవద్దని ఆదేశించింది. 2020 జనవరి 1వ తేదీ నుండి నిర్దేశిత ఎలక్ట్రానిక్ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్(MDR) సహా ఇతర ఎలాంటి ఛార్జీలు ఉండవని గత ఏడాది డిసెంబర్ నెలలో సీబీడీటీ స్పష్టం చేసింది.
5 నెలలు.. రూ.45 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద తిరిగి వచ్చింది
ఈ నేపథ్యంలో రూపే కార్డ్స్, భీమ్-యూపీఐ ద్వారా జరిగిన డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పైన వసూలు చేసిన ఛార్జీల్ని తిరిగి కస్టమర్లకు చెల్లించాలని ఆదాయపుపన్ను శాఖ బ్యాంకులకు సూచించింది. జనవరి 1 నుంచి వసూలు చేసిన ఛార్జీలను తక్షణమే చెల్లించాలని ఆదేశించింది. ఈ సర్క్యులర్ ప్రకారం ఐటీ చట్టంలోని సెక్షన్ 269 ఎన్యూను అనుసరించి ఈ డిజిటల్ లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలను వసూలు చేయకూడదు.
డిజిటల్ లావాదేవీల పెంపు, నగదు రహిత ఆర్తిక వ్యవస్థను రూపొందించేందుకు గాను ఫైనాన్స్ యాక్ట్, 2019లో కేంద్రం ఈ సెక్షన్ను చేర్చింది. రూపే డెబిట్ కార్డు, భీమ్-యూపీఐ, క్యూఆర్ కోడ్లను నిర్దేశిత ఎలక్ట్రానిక్ వ్యవస్థల కింద నోటిఫై చేసింది. కాబట్టి డిజిటల్ రూపంలో పేమెంట్స్ చేసిన వారికి ఛార్జీలు వర్తించవు. అలాగే వీటికి ఎలాంటి MDR వర్తించబోదని తేల్చిచెప్పింది. నిర్దేశించిన లావాదేవీలు దాటిన తర్వాత యూపీఐ పేమెంట్స్పై కొన్ని బ్యాంకులు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు సీబీడీటీ దృష్టికి రావడంతో ఈ సర్కూలర్ జారీ చేసింది.