ఐటీ పోర్టల్ పరిష్కారానికి నిర్మలమ్మ గడువు, కోట్లాది మందికి నెలలుగా ఇబ్బందులు

ఆదాయపు పన్ను శాఖ కొత్త పోర్టల్ సాంకేతిక సమస్యలను సెప్టెంబర్ 15వ తేదీ నాటికి పరిష్కరించాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్‌కు సూచించారు. ఈ సాంకేతిక ఇబ్బందుల పైన ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి, ఆందోళనను తెలియజేసింది. అన్ని సాఫ్టువేర్ ఇబ్బందులు తొలగించేందుకు ఇరవై రోజులకు పైగా గడువును ఇచ్చింది. కొత్త ఐటీ పోర్టల్‌లోని సాంకేతిక సమస్యలను చర్చించేందుకు సోమవారం సలీల్ పరేఖ్‌తో సమావేశమయ్యారు నిర్మలమ్మ. ఈ వెబ్ సైట్ జూన్ 7వ తేదీన ప్రారంభమైంది. అప్పటి నుండి రూ.4241 కోట్లు ఖర్చు చేశామని, నాటి నుండి నేటి వరకు సాంకేతిక సమస్యలు వెన్నాడుతూనే ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు.

రెండున్నర నెలలుగా పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. వెబ్ సైట్ సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు తమ టీం ప్రయత్నిస్తోందని సలీల్ పరేఖ్ చెప్పారు. 750 మందికి పైగా సిబ్బంది ఐటీ శాఖ వెబ్ సైట్ పైన పని చేస్తున్నారన్నారు. ఇన్ఫోసిస్ సీఈవో ప్రవీణ్ రావు వ్యక్తిగతంగా ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు సలీల్ పరేఖ్.

IT portal glitches: FM Sitharaman sets September 15 as deadline for Infosys

ఐటీ రిటర్న్స్ గడువు పొడిగించే అవకాశం

ఆదాయపు పన్ను శాఖ కొత్త పోర్టల్‌లో రెండున్నర నెలలుగా సాంకేతిక సమస్యల నేపథ్యంలో ఐటీ రిటర్న్స్ గడువును మళ్లీ పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా ఐటీ రిటర్న్స్ గడువు జూలై 31వ తేదీ వరకు ఉంటుంది. అయితే వివిధ అంశాల నేపథ్యంలో గడువును సెప్టెంబర్ 30వ తేదీకి పొడిగించారు. కొత్త పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు కొనసాగుతున్నందున, ట్యాక్స్ పేయర్స్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు ఇబ్బందిపడుతున్నందున మరోసారి పొడిగించవచ్చు.

ఆదాయపుపన్ను శాఖ చివరకు కొత్త ఇన్‌కం ట్యాక్స్ పోర్టల్‌లోని సాంకేతిక సమస్యలను అంగీకరించిందని, ఈ నేపథ్యంలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే గడువును డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగించాలని ప్రముఖ జీఎస్టీ కన్సల్టెంట్ దివ్యేష్ జైన్ ట్వీట్ చేశారు. ఆయన సోషల్ మీడియా అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా ఆదాయపు పన్ను శాఖ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ గడువు పొడిగించాలని కోరారు.

మరో ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ చిరాగ్ చౌహాన్ కూడా ఓ ట్వీట్ చేశారు. గతంలో టీసీఎస్ సంస్థ ఎంసీఏను బాగా హ్యాండ్లింగ్ చేసిందని, ప్రస్తుతం పాస్ పోర్ట్ ఆపరేషన్స్‌ను బాగా నిర్వహిస్తోందని చెబుతూ, కొత్త ట్యాక్స్ పోర్టల్ అసైన్‌ను టీసీఎస్‌కు హ్యాండిల్ చేసి, ఏడాది సమయం ఇవ్వాలని పేర్కొన్నారు. అలాగే, పాత ఇన్‌కం ట్యాక్స్ పోర్టల్‌ను రిస్టోర్ చేయాలని పేర్కొన్నారు. దివ్యేష్ జైన్ ఈ ట్వీట్‌ను కూడా రీట్వీట్ చేస్తూ, పాత ఆదాయపు పన్ను శాఖ పోర్టల్‌ను రిస్టోర్ చేయాలన్నారు. ఆదాయపు పన్ను శాఖ పోర్టల్ సాంకేతిక సమస్యలకు ఇన్ఫోసిస్‌తో పాటు ఆదాయపు పన్ను శాఖ కూడా సమానమైన బాధ్యత వహించాలని కూడా సీఏ చిరాగ్ చౌహాన్ సూచించారు.

IT portal glitches: FM Sitharaman sets September 15 as deadline for Infosys

నిర్మలమ్మ గడువు

ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి రూపొందించిన కొత్త వెబ్ సైట్ శనివారం నుండి ఆదివారం రాత్రి వరకు తెరుచుకోలేదు. ఈ వెబ్‌సైట్‌ను తయారు చేసిన ఇన్ఫోసిస్‌కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. వెబ్‌సైట్‌లోని ఎర్రర్స్ పైన వివరణ కోరింది. ఇన్ఫీ పైన ఆదాయపు పన్ను విభాగం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి పరిస్థితులను వివరించాలని ఇన్ఫోసిస్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో సలీల్ పరేఖ్‌ను ఐటీ శాఖ కోరింది. అత్యవసర నిర్వహణ నిమిత్తమే పోర్టల్‌ను నిలిపివేశామని, ఆదివారం రాత్రి నుండి ఇది పని చేస్తోందని ఇన్ఫోసిస్ ఈ మేరకు ట్వీట్ చేసింది. ఆ తర్వాత సలీల్ పరేఖ్ కేంద్రమంత్రిని కలిసి వివరణ ఇచ్చారు. సెప్టెంబర్ 15వ తేదీలోగా పరిష్కరించాలని నిర్మలమ్మ ఆదేశించారు.

ఈ కొత్త ఆదాయపు పన్ను వెబ్ సైట్ జూన్ 7వ తేదీన ప్రారంభమైంది. ప్రారంభం నుండి ఈ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. సమస్యలను పరిష్కరించాలని నిర్మలా సీతారామన్.. ఇన్ఫోసిస్‌ను వెంటనే ఆదేశించారు. అయినప్పటికీ సమస్యలు పూర్తిగా కొలిక్కిరాలేదు. జూన్ 22వ తేదీన ఇన్ఫీ ప్రతినిధులతో ఆర్థికమంత్రి భేటీ అయ్యారు. త్వరగా సాంకేతిక సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఇన్ఫోసిస్ అధిపతి నందన్ నీలేకని నుండి కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఆర్థికమంత్రి తెలుసుకున్నారు. ఇప్పుడు సలీల్ పరేఖ్ ఆర్థికమంత్రి ముందుకు వచ్చారు.

ఐటీ రిటర్న్స్ ప్రాసెసింగ్ వ్యవధిని 63 రోజుల నుండి ఒక్కరోజుకు తగ్గించడం, రీఫండ్స్ వేగవంతం చేయడమే లక్ష్యంగా కొత్త ఐటీ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఈ కొత్త పోర్టల్ అభివృద్ధికి కేంద్రం రెండేళ్ల క్రితం రూ.4వేల కోట్లకు పైగా ఫండ్స్‌కు ఆమోదం తెలిపింది. జూన్ వరకు రూ.164.5 కోట్లు చెల్లించింది. నిర్వహణ, జీఎస్టీ, రెంట్, పోస్టేజ్ సహా 8.5 సంవత్సరాలలో ప్రాజెక్టు నిధులను మొత్తం చెల్లించాలి.

సాంకేతిక సమస్యపై శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది స్పందిస్తూ.. ఐటీ పోర్టల్ ప్రారంభమై రెండు నెలలు దాటిందని, ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని, సీఈవోకు అసలు సమన్లు జారీ చేయడం, హెచ్చరించడం ఆర్థిక మంత్రిత్వ శాఖకు పీఆర్ మెటీరియల్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఆత్మనిర్భర్, డిజిటల్ భారత్ గురించి మాట్లాడే దేశానికి ఇది ఇబ్బంది అన్నారు.

PHDCCI చైర్ డైరెక్ట్ ట్యాక్స్ కమిటీ ముకుల్ బాగ్లా మాట్లాడుతూ... దాదాపు ఏడు కోట్ల మంది వ్యక్తులు లేదా సంస్థలు తమ ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేస్తున్నారని, ట్యాక్స్ పోర్టల్ లోపాల కారణంగా వారి రోజువారీ పనితీరుపై జూలై 7వ తేదీ నుండి ప్రతికూల ప్రభావం పడిందన్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+