ఐపీవోలకు.. మళ్లీ మంచి రోజులు! ప్రైమరీ మార్కెట్లో మొదలైన సందడి...

ఐపీవోలకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. స్టాక్‌ మార్కెట్ల ర్యాలీ (సెకండరీ మార్కెట్‌)తో ప్రైమరీ మార్కెట్‌లో ఐపీవో ఇష్యూల సందడి మళ్లీ మొదలవుతోంది. సెప్టెంబర్‌లో కార్పొరేట్‌ పన్ను భారీ తగ్గింపు నిర్ణయం తర్వాత ఈక్విటీ మార్కెట్ల ర్యాలీ మొదలైంది. దీంతో పలు కంపెనీలు మళ్లీ ఐపీవో ఇష్యూలతో ముందుకొస్తున్నాయి.

ఐపీవో కోసం ఇప్పటి వరకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) నుంచి 27 కంపెనీలు అనుమతి పొందాయి. ఇవి ఐపీవో ఇష్యూల ద్వారా రూ.18,000 కోట్ల వరకు సమీకరించే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాది మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ.. మంచి వ్యాపార నమూనాలు కలిగిన కంపెనీలు, ఆకర్షణీయమైన ధరలతో వచ్చిన ఐపీవోలను ఇన్వెస్టర్లు బాగా ఆదరించారు.

ఈక్విటీ మార్కెట్ల ఊగిసలాట...

ఈక్విటీ మార్కెట్ల ఊగిసలాట...

ఈ ఏడాది ఈక్విటీ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో మొదటి పది నెలల కాలంలో పేరున్న కంపెనీలు ఐపీవో వచ్చినా వాటి సంఖ్య 20లోపునకే పరిమితమైంది. ప్రతికూల పరిస్థితుల్లో ఇష్యూలు పూర్తిగా సబ్‌స్క్రయిబ్‌ అవుతాయన్న నమ్మకం ఉన్న కంపెనీలే వాటిని చేపట్టాయి. చాలా కంపెనీలు ఐపీవోకు రావాలని భావిస్తున్నప్పటికీ.. సానుకూల వాతావరణం కోసం వేచి చూస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఆఫర్‌ పత్రాలను దాఖలు చేసినా.. ప్రతికూల పరిస్థితుల కారణంగా ముందుకు అడుగేయలేక పోయాయి. ‘‘మార్కెట్‌లో ఇప్పటికీ ఎంతో అనిశ్చితి ఉంది. తిరిగి ఆఫర్‌ పత్రాలను దాఖలు చేయడం వల్ల ఈ వాతావరణం మెరుగుపడిన వెంటనే ఐపీవోలకు వచ్చేందుకు కంపెనీలకు వీలు కలుగుతుంది..'' అని పీఎల్‌ మార్కెట్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ దారా కల్యాణి వాలా పేర్కొన్నారు.

కార్పొరేట్‌ పన్ను తగ్గింపుతో మళ్లీ ర్యాలీ...

కార్పొరేట్‌ పన్ను తగ్గింపుతో మళ్లీ ర్యాలీ...

సెప్టెంబర్‌లో కేంద్రం కార్పొరేట్‌ పన్ను శ్లాబ్‌లను తగ్గిస్తున్నట్లు ప్రకటించడంతో ఈక్విటీ మార్కెట్లలో మళ్లీ ర్యాలీ మొదలైంది. దీంతో కంపెనీలు మళ్లీ ధైర్యంగా ఐపీవో ఇష్యూలలకు ముందుకొస్తున్నాయి. గడిచిన రెండు నెలల్లో రూట్‌ మొబైల్, మాంటే కార్లో, మజ్‌గాన్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్, ఇండియన్‌ రెన్యువబుల్‌ డెవలప్‌మెంట్‌ ఎనర్జీ, ముంబైకి చెందిన పురానిక్‌ బిల్డర్స్‌ సంస్థలు సెబీ వద్ద మరోసారి ఐపీవో ఆఫర్‌ పత్రాలను దాఖలు చేశాయి. తాజాగా ఎస్‌బీఐకి చెందిన ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ (క్రెడిట్‌కార్డు కంపెనీ) కూడా ఐపీవోకు వచ్చేందుకు అవసరమైన ఆఫర్‌ పత్రాలను దాఖలు చేసింది. వచ్చే మరికొన్ని నెలల్లో యూటీఐ మ్యూచువల్‌ ఫండ్, పలు స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు కూడా ఐపీవో ఇష్యూకు సంబంధించి సెబీ ఎదుట ఆఫర్ పత్రాలు దాకలు చేసే అవకాశాలున్నట్లు మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

27 కంపెనీలకు సెబీ ‘గ్రీన్‌ సిగ్నల్'‌...

27 కంపెనీలకు సెబీ ‘గ్రీన్‌ సిగ్నల్'‌...

2016-17, 2017-18 ఆర్థిక సంవత్సరాల్లో ఐపీవో మార్కెట్లో రూ.లక్ష కోట్లకు పైగా నిధుల సమీకరణ జరిగింది. ఇక ఈ ఏడాది ఇప్పటి వరకు ఐపీవో ఇష్యూ కోసం సెబీ నుంచి 27 కంపెనీలకు అనుమతి లభించింది. ఇవి ఐపీవో ద్వారా రూ.18,000 కోట్ల వరకు నిధులనుసమీకరించే అవకాశం ఉంది. ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు, బజాజ్‌ ఎనర్జీ, శ్రీరామ్‌ ప్రాపర్టీస్, పెన్నా సిమెంట్‌ తదితర కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. అలాగే మరో ఏడు వరకు కంపెనీలు ఆఫర్‌ పత్రాలను దాఖలు చేసి, సెబీ అనుమతి కోసం నిరీక్షిస్తున్నాయి. ఈ ఏడాది 14 కంపెనీలు కలసి ఐపీవో ద్వారా సుమారు రూ.15,000 కోట్ల వరకు నిధులను సమీకరించాయి. వీటిల్లో ఒక్క స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ మినహా.. మిగిలిన వాటి షేర్లు ఇష్యూ ధర కంటే ఎక్కువ ధరకే ట్రేడ్‌ అవుతున్నాయి. వీటిల్లో ఐఆర్‌సీటీసీ, యాఫిల్‌ ఇండియా, ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్‌ ఇష్యూ ధరకు నూరు శాతం మించి ట్రేడ్ అవుతున్నాయి.

మంచి ఇష్యూలకు భారీ డిమాండ్‌...

మంచి ఇష్యూలకు భారీ డిమాండ్‌...

ఈ ఏడాది మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ.. మంచి బిజినెస్ మోడల్ కలిగిన కంపెనీలు, ఆకర్షణీయమైన ధరలతో వచ్చిన ఐపీవోలకు ఇన్వెస్టర్ల నుంచి మంచి ఆదరణ దక్కింది. ముఖ్యంగా ఐఆర్‌సీటీసీ, యాఫిల్‌ ఇండియా, ఇండియామార్ట్, పాలీక్యాబ్, నియోజన్‌ కెమికల్స్, సీఎస్‌బీ బ్యాంకు ఇష్యూలకు భారీ స్పందనే లభించింది. లిస్టింగ్‌లోనూ ఈ కంపెనీల షేర్లు లాభాలు కురిపించాయి. ఐఆర్‌సీటీసీ షేరు ఇష్యూ ధర రూ.320 కాగా, లిస్టింగ్‌లోనే వాటాదారులకు 100% లాభాలిచ్చింది. అలాగే యాఫ్లే ఇండియా కూడా ఇష్యూ ధర నుంచి చూస్తే ఇప్పటి వరకు 119 శాతం పెరిగింది. ఇక కేరళకు చెందిన సీఎస్‌బీ బ్యాంకు ఇష్యూ ఈ నెల 27న ముగియగా దీనికి 87 రెట్లు అధికంగా బిడ్లు వచ్చాయి. వచ్చే వారం మొదలయ్యే ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు ఐపీవోకు, అలాగే త్వరలో రానున్న ఎస్‌బీఐ కార్డ్స్‌ ఇష్యూకు సైతం మంచి స్పందన ఉండవచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

సెకండరీ మార్కెట్లో స్థిరమైన ర్యాలీ ఉంటేనే...

సెకండరీ మార్కెట్లో స్థిరమైన ర్యాలీ ఉంటేనే...

దేశ ఆర్థిక వ్యవస్థ ఇంకా మదగమనం నుంచి కోలుకుంటున్న సంకేతాలు ఇవ్వలేదని, కేంద్రం కార్పొరేట్‌ పన్ను తగ్గింపుతో లిక్విడిటీ (నిధుల రాక) ఆధారంగా ప్రస్తుతం మార్కెట్లలో ర్యాలీ సాగుతోందని, కాబట్టి కొంత అప్రమత్తంగా ఉండాలన్నది బ్రోకరేజీల అభిప్రాయం. సెకండరీ మార్కెట్లో మంచి ర్యాలీ ఉంటే తప్ప, ప్రైమరీ మార్కెట్లో (ఐపీవోలు) వాతావరణం మారకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఈ ఏడాది ఇప్పటి వరకు 12 శాతం మేర పెరిగింది. ‘‘ఈ ఏడాది పలు ఐపీవోలకు అనుమతుల గడువు కూడా తీరిపోయింది. తాము ఆశిస్తున్న ధరకు తగినంత డిమాండ్‌ లేని పరిస్థితుల్లో మరికొంత కాలం ఇదే వాతావరణం కొనసాగొచ్చు..'' అని ప్రైమ్‌ డేటా బేస్‌ ఎండీ ప్రణవ్‌ హల్దియా వ్యాఖ్యానించారు.

త్వరలో ఎస్‌బీఐ కార్డ్స్‌ నుంచి భారీ ఐపీవో...

త్వరలో ఎస్‌బీఐ కార్డ్స్‌ నుంచి భారీ ఐపీవో...

దేశంలోని అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)కి చెందిన.. దేశంలోనే రెండో అతి పెద్ద క్రెడిట్‌ కార్డ్‌ కంపెనీ అయిన ‘ఎస్‌బీఐ కార్డ్స్‌' బుధవారం సెబీకి ఐపీవో పత్రాలనుసమర్పించింది. ఇష్యూలో భాగంగా రూ.500 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. వీటితో పాటు ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌)లో ఎస్‌బీఐ, కార్లైల్‌ గ్రూప్‌నకు చెందిన సీఏ రోవర్‌ హోల్డింగ్స్‌ సంస్థలు 13.05 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయిస్తాయి. మొత్తం మీద ఈ ఐపీవో సైజు రూ.8,000-9,500 కోట్ల రేంజ్‌లో ఉంటుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. దీనిని పరిగణనలోకి తీసుకుంటే ఈ కంపెనీ విలువ రూ.65,000 కోట్ల మేర ఉండగలదని అంచనా. సెబీ ఆమోదం గనుక లభిస్తే, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇదే అతి పెద్ద ఐపీవో ఇష్యూ కానుంది. అయితే వచ్చే ఏడాది మార్చిలోనే మార్కెట్లో లిస్టింగ్‌ చేయాలని ఎస్‌బీఐ కార్డ్స్ భావిస్తోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+